వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.