పాడి పశువుల పునరుత్పత్తిలో ఖనిజలవణాల ప్రాముఖ్యత

పాడిపశువులలో అధిక పాల ఉత్పత్తితో పాటు పునరుత్పత్తి సామర్ధ్యం కూడా రైతులకి ఆదాయాన్ని చేకూరుస్తుంది. లాభదాయకమైన పాల ఉత్పత్తికి మరియు మంచి సంతానోత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. పశువుల ఆహారంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడితే అవి సకాలంలో ఎదకు రాకపోవడం, పదే పదే పొర్లడం, గర్భధారణ శాతం తగ్గడం, గర్భస్రావాలు మరియు మాయ పడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పచ్చిమేత, పొడిమేత మాత్రమే సరిపోవు, సమతుల్య మోతాదులలో ఖనిజలవణాలు అందించినప్పుడే పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పునరుత్పత్తి లో ఖనిజాలవణాల ప్రాముఖ్యత :
ఖనిజలవణాలు శరీరం పెరుగుదల, ఎముకల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖనిజలవణాలు రెండు రకాలుగా ఉంటాయి.

స్థూల ఖనిజాలు: కాల్షియమ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్.

సూక్ష్మ ఖనిజాలు: జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, కోబాల్ట్, అయోడిన్, ఇనుము.

పశువుల దాణాలో కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ నిష్పత్తి 2:1 ఉండేలా చూసుకోవాలి. వీటి లోపం వలన అండాల ఉత్పత్తి తగ్గుతుంది. కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ పశువులు సకాలంలో ఎదకు రావడానికి సహాయపడుతాయి.

కాల్షియమ్: పశువుల గర్భాశయ కండరాల పనితీరుని మెరుగు పర్చడంలో, ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంలో మరియు ప్రసవానంతరం గర్భాశయం సాధారణస్థితికి రావడంలో కాల్షియమ్ ముఖ్యపాత్ర వహిస్తుంది. కాల్షియమ్ లోపించడం వలన పశువులకు పాల జ్వరం, మాయపడకపోవడం, గర్భాశయ బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

ఫాస్ఫరస్: పశువు ఎదకు సకాలంలో రావడంలో మరియు అండాశయాల పనితీరుని మెరుగుపరచడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది. గర్భధారణ శాతాన్ని పెంచుతుంది. ఫాస్ఫరస్ లోపించడం వలన మూగ ఎద, ఎదకు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

జింక్: అండాశయంలో ఆరోగ్యకరమైన అండాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ప్రసవం తరువాత గర్భాశయం త్వరగా సాధారణస్థితికి రావడానికి సహాయపడుతుంది. ప్రసవం అనంతరం గర్భాశయ సమస్యలు నివారించి, త్వరగా గర్భం దాల్చేందుకు సహాయపడుతుంది.

రాగి (కాపర్): పునరుత్పత్తి హార్మోన్ల పనితీరుని మెరుగుపరిచి పశువులు త్వరగా గర్భం దాల్చేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచి ప్రసవానంతరం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగి లోపం వలన గర్భస్రావం, మూగ ఎద వంటి సమస్యలు ఏర్పడుతాయి.
మాంగనీస్: అండం విడుదల సక్రమంగా జరిగేలా చేసి, గర్భం నిలదొక్కుకోవడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది. పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. మాంగనీస్ లోపం వలన గర్భధారణ శాతం తగ్గుతుంది.

అయోడిన్: శరీర జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. పిండం మెదడు ఎదుగుదలకు మరియు శరీర అభివృద్ధికి సహాయపడడంలో అయోడిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం వలన బలహీనమైన దూడలు లేదా చనిపోయిన దూడలు పుట్టే ప్రమాదం ఉంటుంది.

సెలీనియం: విటమిన్ -ఈ తో కలిసి పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈనిన తరువాత మాయ ఆలస్యంగా పడడం వంటి సమస్యలు నివారించి, పశువుల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, దూడలు ఆరోగ్యంగా పుట్టడంలో తోడ్పడుతుంది.
కోబాల్ట్ : కోబాల్ట్ చాల తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ రుమేన్ సూక్ష్మజీవుల ద్వారా విటమిన్ బి12 తయారీ, శరీర జీవక్రియ, మంచి శారీరకస్థితి మరియు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైన ఖనిజలవణం.

ఐరన్: ఇనుము (ఐరన్) లోపం వలన ఆకలి తగ్గడం సంభవించవచ్చు. రక్తహీనత మరియు శరీర పోషక స్థితి క్షీణించడం వల్ల ప్రజనన ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇనుము లోపం కారణంగా పశువులు పదే పదే పొర్లడం, ఒక్క గర్భధారణ కోసం ఎక్కువసార్లు సంయోగం అవసరమవడం, గర్భస్రావాలు సంభవించడం జరుగుతుంది.

ఖనిజాలవణాల లోపాల నివారణ చర్యలు :

  1. సమతుల్యమైన దాణా అందించాలి: పశువుల వయస్సు, పాల ఉత్పత్తి మరియు గర్భధారణ దశను బట్టి సమతుల్యమైన ధాణాని ఇవ్వాలి.
  2. ప్రతి రోజు తగిన మోతాదులో ఖనిజాలవణాల మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి.
  3. పశువుల కొట్టంలో ఎల్లప్పుడూ మినరల్ మిక్స్ బ్రిక్స్ ను అందుబాటులో ఉంచాలి.
  4. పోషకవిలువలు అధికంగా ఉన్న నాణ్యమైన మేతను అందించాలి. బూజు పట్టిన లేదా నాసిరకం మేతను ఇవ్వకూడదు.
  5. తగినంత శుభ్రమైన త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
    6.గర్భం ధరించిన మరియు అధిక పాలిచ్చే పశువులకు ప్రత్యేక పోషణను అందించాలి.
  6. పునరుత్పత్తి సమస్యలు పశువులలో గమనించినప్పుడు వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
  7. క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు పశువులకు ఇవ్వడం వలన ఖనిజాలవణాల శోషణ పెరుగుతుంది.

ముగింపు : పాడిపశువుల సంతానోత్పతి విజయవంతంగా ఉండాలంటే సమతుల్య పోషకాహారంతో పాటు ఖనిజలవణాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన పశువులలో పునరుత్పతి సమస్యలను అధిగమించవచ్చు. సమతుల్య పోషకాహారం, నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం, మినరల్ మిక్స్ బ్రిక్స్ మరియు పశువైద్యుడి సూచనలు పాటించడం ద్వారా పశువులను ఆరోగ్యంగా ఉంచి రైతులు అధిక లాభాలు పొందవచ్చు.

రచయిత: డా సిహెచ్. ప్రజ్ఞ అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం పశువైద్యకళాశాల, కోరుట్ల. 9014639814

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా కృమినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్ల: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమి+న్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యతను: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నాపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
• పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
• ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
• అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
• శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
• పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
• ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాంసన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
• గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
• మినరల్ మిక్చర్ నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
• పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
• వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
• సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
• మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
• కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
• సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
• కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
• పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
• పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.

అందువల్ల ప్రతి రైతు “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana
Assistant Professor
College of Veterinary Science, Korutla

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More