రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి

నైరుతి రుతుపవన కాలంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరవు పరిస్థితులు రావచ్చన్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పశుపోషకులకు సూచనలు చేస్తూ ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు.
నీటివసతి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక, అధిక దిగుబడి వచ్చే పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా వచ్చే మేత లభ్యతను కొనసాగించాలి. పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత, ఖనిజ లవణ మిశ్రమాల పోషకాహారం అందించాలి. వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పశుగ్రాస సాగు చేపట్టాలి. అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వచేయాలి.

Read More

సహకార రంగాన్ని తెలంగాణాలో బలోపేతం చేస్తాం

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More

పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More

పశువుల ఆరోగ్యంకు రూ.1.70 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రూ.1.70 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి, వేరే పథకాలకు ఈ నిధులను మళ్లించరాదని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ పాలకూ తప్పనిసరి

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాల సంఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు జారీ చేసింది. పాల సహకార సంఘాల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్లందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించింది. అంటే ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ లేకుంటే వీళ్లు పాల వ్యాపారాలను నిర్వహించొద్దు. ‘ఇటీవల కొన్ని చోట్ల పాలల్లో కల్తీ జరిగి నట్లు వార్తలు వచ్ౘ్ిన దృష్ట్యా… రిజిస్ట్రేషన్/ లైసెన్సింగ్ నిబంధనలు పాటింపులో కఠినంగా వ్యవహరించాల’ని వారికి ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార ఉత్పత్తుల వ్యాపారాల కోసం రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు తీసుకోకుండానే కొందరు పాల విక్రయదార్లు, ఉత్పత్తిదార్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. అందువల్ల పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్ల దగ్గర నిర్దిష్ట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్/లైసెన్సు ఉందా? అని పరిశీలించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. నిల్వ ఉష్ణోగ్రతల నిర్వహణలో నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా? లేదా అని మిల్క్ చిల్లర్స్‌ను కూడా పరిశీలించాల్సిందిగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More