నైరుతి రుతుపవన కాలంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరవు పరిస్థితులు రావచ్చన్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పశుపోషకులకు సూచనలు చేస్తూ ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు.
నీటివసతి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక, అధిక దిగుబడి వచ్చే పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా వచ్చే మేత లభ్యతను కొనసాగించాలి. పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత, ఖనిజ లవణ మిశ్రమాల పోషకాహారం అందించాలి. వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పశుగ్రాస సాగు చేపట్టాలి. అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వచేయాలి.