ANGRAU – DAATTC MOBILEAPP

ANGRAU – DAATTC MOBILE APP – రైతులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుళ్లు – పురుగుల నివారణ, పోషక యాజమాన్యం, వాతావరణ ఆధారిత సూచనలు మరియు విశ్వవిద్యాలయం అందించే తాజా సాంకేతిక వేదిక.

పరిచయం:
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందించడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనిఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Acharya N.G. Ranga Agricultural University – ANGRAU) పరిధిలోని District Agricultural Advisory and Transfer of Technology Centre (DAATTC) ఆధ్వర్యంలో ANGRAU DAATTC App అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ను డా.పి.బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (Transfer of Technology) & కోఆర్డినేటర్, DAATTC, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపొందించారు.
ఈ మొబైల్ యాప్ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, విస్తరణ సిబ్బంది మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సమగ్ర డిజిటల్ సమాచార వేదికగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన తాజా సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సిఫార్సులు మరియు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు సులభంగా చేరవేయడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ లో పంటల వారీగా శాస్త్రీయ సాగు విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, విత్తనాల ఎంపిక, భూమి తయారీ, విత్తే సమయం, విత్తన మోతాదు, నాటే దూరం, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నియంత్రణ, సమగ్ర పురుగుల మరియు తెగుళ్ల నివారణ పద్ధతులు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రధాన ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఎంతో అవసరం. ఈ యాప్ ద్వారా పంటల వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాభావం లేదా అధిక వర్షాల సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలను రక్షించుకునే మార్గాలు వంటి విలువైన సూచనలు అందించబడతాయి. దీని ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం
ఉంటుంది.

ANGRAU DAATTC_App ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పూర్తిగా ANGRAU శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు అధికారిక సమాచారం సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల రైతులకు విశ్వసనీయమైన, శాస్త్రీయమైన మరియు ప్రామాణికమైన సమాచారం అందుతుంది. అదనంగా రైతుల శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ ప్రదర్శనలు, సాంకేతిక వీడియోలు, ప్రచురణలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఈ యాప్ కేవలం రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతు సేవా కేంద్రాల (RSKs)సిబ్బందికి, కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs)శాస్త్రవేత్తలకు, వ్యవసాయ పాలిటెక్నిక్ మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా ఒక ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్స్ వేదికగా ఉపయోగపడుతుంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో, రైతు సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు సాంకేతిక సలహాలు అందించే సందర్భాల్లో ఈ యాప్ సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.

ఈ యాప్ యొక్క మరో ముఖ్యమైన విశేషం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సులభమైన వినియోగాన్ని అందించడం. గ్రామీణ ప్రాంత రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా సరళమైన రూపకల్పన (User-Friendly Interface) కలిగి ఉండటం వల్ల ప్రతి రైతు తన మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని పొందగలుగుతున్నాడు. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతుల చేతికి చేరుతుంది.

డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు శాస్త్రీయ సమాచారం, సకాలంలో వ్యవసాయ సూచనలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికలో అందించే ANGRAU DAATTC Appనేటి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ గా నిలుస్తుంది. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత వృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రధాన ప్రయోజనాలు:
• రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.
పంటల వారీగా సమగ్ర సాగు యాజమాన్య సమాచారాన్ని అందిస్తుంది.
• పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాల నివారణకు నిపుణుల సూచనలు అందిస్తుంది.
• వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్ గా పనిచేస్తుంది.
• శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతుంది.
డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తుంది.

ముగింపు:
ANGRAU DAATTC App అనేది కేవలం ఒక మొబైల్ యాప్ మాత్రమే కాదు, రైతులకు శాస్త్రీయ వ్యవసాయ జ్ఞానాన్ని అందించే డిజిటల్ విజ్ఞాన వేదిక. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేసి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, లాభదాయకత మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఒక వినూత్న ప్రయత్నంగా ఈ యాప్ నిలుస్తోంది. ప్రతి రైతు, వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త మరియు వ్యవసాయ విద్యార్థి తమ మొబైల్లో ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును.

డా. పి. బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త &కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024
డా.డి.ఆదిలక్ష్మీ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ph: 9550506498
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా– 531111

Read More

అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి వాతావరణం (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి వాతావరణం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం) ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు వంటివి) సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంట నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.

• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుత వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి. ఫోన్ : 7674886216

Read More

ఔషధ మొక్క… గొబ్బి

గొబ్బి 60-100 సెం.మీ. ఎత్తు పెరిగే ఒక పొద. ఆకుల పైభాగం ముదురు ఆకుపచ్చ రంగులో, అడుగుభాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు అండాకారం నుండి వెడల్పు తక్కువ గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూలు సుమారు 5 సెం.మీ. పొడవు కలిగి గరాట ఆకారంలో ఉంటాయి. ఊదారంగు, లేత గులాబి రంగు లేదా తెలుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. పొడవుండి కోడిగుడ్డు ఆకారంలో చిన్న సంచివలె ఉంటుంది. కాయ ముదిరినపుడు మెరుస్తూ ఉంటుంది.

సాధారణ నామం : హైగ్రోఫిలా/టెంపుల్‌ప్లాంట్/మార్ష్‌బార్బెల్ శాస్త్రీయ నామం : బార్లేరియా క్రిస్టేట కుటుంబం: అకాంథేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • థాయ్‌లాండ్‌లో గొబ్బిని సంప్రదాయ మూలికా సంబంధ మందుగా ఉపయోగిస్తారు. ఇది టానిక్, మూత్ర వర్థకం, మరియు రక్తశుద్దికారిణిగా పనిచేస్తుంది. తమిళనాడులో మహిళలు ఈ పూలను పూల చెండుగా ఉపయోగిస్తుంటారు.
  • దీని ఆకులు, వేర్ల వగరు రసం యాంటిబాక్టీరియల్, స్వేదనకారి, కఫహర లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీవ్ర జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులు, వేర్ల కషాయాన్ని ఉడుకు, పుండుపై వాపులను తగ్గించడానికి పూస్తారు. గొబ్బి విత్తనాలను పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఆకుల మిథనాల్ ద్రావణం వాపు, నొప్పి తగ్గించే చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కలను అలంకరణ హెడ్ౙిగా పెంచుతారు.
  • ఈ మొక్కకి యాంటి ఆక్సిడెంట్, యాంటి డయాబెటిక్ లక్షణాలున్నాయి. బార్లేరియా ఇమ్‌ప్యూలినా మొక్కకి గాయం నయం చేసే ప్రభావముంది.

వ్యవసాయరంగంలో…

  • బార్లేరియా లాంగిఫోలియా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలోని కౌమారిన్, సపానిన్స్, టానిన్స్, స్టీరాయిడ్స్, స్పోడోప్టెరా లిటూరాపై అధికంగా 79.40% యాంటి ఫీడెంట్ చర్య, 77.36% లార్వానాశక చర్య ప్రదర్శించాయి. హెలికోవర్పా ఆర్మిజరాపై 70.96% యాంటి ఫీడెంట్ చర్య, 68-70% లార్వానాశక చర్య ప్రదర్శించింది. రూపుమారిన లార్వాలు, ప్యూపాలు, పెద్ద పురుగుల శాతం కూడా ఇథైల్ ఎసిటేట్ ద్రావణంలో నమోదైంది. పెద్ద పురుగులు విడుదలయ్యే శాతం కూడా తగ్గింది (చెన్నియన్, అతని అనుచరులు, 2016).
  • బార్లేరియా ప్రయోనిటిస్ యాంటిఆక్సిడెంట్, యాంటిమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించింది. దీనిని పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు (కరుప్పుసామి, 2007)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

మొక్కల ఎదుగుదలకు… చేప బెల్లం ద్రావణం

మొక్కల ఎదుగుదలకు నత్రజని చాలా అవసరం. దీనిమీద లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇందుకోసం ఎటువంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా చేప బెల్లం ద్రావణాన్ని తయారుచేసి మొక్కలకు అందించవచ్చు. ఈ ద్రావణంలో పదమూడుశాతం పైగా ఎమైనో ఆసిడ్స్ వుంటాయి. పదిహేనురోజుల్లో ద్రావణం తయారు చేసుకోవచ్చు.

ఒక కిలో చేపలను ముక్కలుగా చేసి, 1కిలో బెల్లంతో కలిపి పదిహేను రోజులపాటు నిలువవుంచాలి. తయారైన ద్రావణాన్ని 1 లీటర్‌కు 1 మి.లీ. చొప్పున కలుపుకుని స్ప్రే చేసుకోవాలి. దీనిని నర్సరీ దశనుండి మొక్క ఎదిగే దశ వరకు ఇస్తే మంచి ఫలితాలు గమనించవచ్చు.

Read More

ఔషధ మొక్క…. పనస

పనస 20 మీ. ఎత్తు పెరిగే వృక్షం. బెరడు నలుపు రంగులో లేదా ఆకుపచ్చ మచ్చలతో నునుపుగా ఉంటుంది. మానులోపల పసుపు రంగులో ఉంటుంది. దీని ఆడ, మగ పూలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. పూలు మానుపైనే ఏర్పడతాయి. ఆడ కంకులలోని పూలన్నీ ఫలదీకరణం చెంది ఒకే పెద్ద పండు తయారవుతుంది. పండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : జాక్‌ఫ్రూట్ ట్రీ శాస్త్రీయ నామం : ఆర్టోకార్పస్ హిటరోఫిల్లస్ కుటుంబం: మోరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పనస ఆకులు, వేర్లు, పండ్లు, గింజలు, చెక్క, పాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో పిండిపదార్థాలు, అమైనోఆమ్లాలు, బీటాకెరోటిన్ ఉంటాయి. పండులోపల గల జిగురులాంటి పదార్థంలో ల్యూసిన్, ఐసోల్యూసిన్, టైరోసిన్, వాలైన్ ఉంటాయి.
  • మానులోపలి కర్రభాగంలో మోరిన్, ఆర్టోకార్పిన్ మొదలగు రసాయనాలుంటాయి. లేత ఆకులను వాపులకి, గాయాలకు కాపుపెట్టడానికి ఉపయోగిస్తారు.
  • లేత పనస కాయకూర మేధస్సును వృద్ధి చేస్తుంది. బలం, వీర్యపుష్టినిస్తుంది.
  • గింజల పొడిని గిరిజనులు ఆహారంగా ఉపయోగిస్తారు. పనస చెట్టు చెక్క మరియు కొద్దిగా మిరియాలు కలిపిన పొడి మందు గజ్ౙి, తామర, దురదలను పోగొడుతుంది. దీనిని విరేచనాలు అరికట్టడానికి, కడుపులో పుండ్ల నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • పనస ఆకుద్రావణం పర్యావరణహిత లార్విసైడ్‌గా పనిచేస్తుంది. ఇది బ్రూకస్‌పైసోరం, ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ ఒరైజెపై కీటకనాశక చర్యను కూడా ప్రదర్శించింది (నాయిర్ అండ్ కర్వేకర్, 2017).
  • పనస గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కరిచియాకోలి, సూడోమోనాసఈరూజినోసా, స్టెఫైలోకోకస్ ఆరియస్‌లపై అత్యంత సమర్ధవంతమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (జా అండ్ శ్రీవాస్తవ, 2013).
  • పనస లేటెక్స్ హెక్సనాయిక్, మిథనాలిక్, పెట్రోలియం ఈదర్, క్లోరోఫాం ద్రావణాలు స్పోడోప్టెరాలిటూర లార్వాలను 90-95% చంపాయి. ఇవి లార్వాల బరువును గణనీయంగా తగ్గించాయి (ఉపాధ్యాయమ్, 2013).
  • పనస వేర్లు, కాండాలు, ఆకులు, గింజలలో ఉండే అసిటోజెనిన్స్ శక్తివంతమైన పురుగు మందు లక్షణాలు కలిగి ఉంటాయి (నజ్‌ముల్‌హక్, 2006).
  • పనస పచ్చి ఆకులను మేకలకు మేతగా వేస్తారు.
  • ఎండిన ఆకులను వంటచెరకుగాను, కంపోస్టు తయారీకి, ఆచ్ఛాదన చేయడానికి ఉపయోగిస్తారు (ప్రాక్టికల్ మాన్యువల్, 2006).
  • పనస కాండం, వేరుబెరడు, కాండం, వేరుహార్ట్‌వుడ్, ఆకులు, కాయలు, గింజల మిథనాల్ ద్రావణాలు అనేక బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (ఖాన్, అతని అనుచరులు, 2003)
  • పనస డైక్లోరోమిథేన్ ద్రావణం పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు పెట్టకుండా, పెద్ద పురుగులు విడుదలవకుండా నిరోధించాయి (జయకుమార్, అతని అనుచరులు, 2005)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్

సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.

తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.

వాటి మదర్ కల్చర్లను  వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Read More

ఔషధ మొక్క…. నేలవేము

సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి

కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్‌లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
  • నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

నేలవేము కషాయం తయారీ విధానం

  • ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More