71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

‘నాటుకోళ్ల’ పెంపకంకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువతకు, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి, రైతులకు అదనపు రాబడిని కల్పించడానికి నూతన, సంప్రదాయ విధానాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా తిన్నవారికి ప్రొటీన్లు… పెంచిన వారికి ఆదాయం అందుతుందనే భావనతో నాటుకోళ్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రతి పల్లెలో నాటుకోళ్లు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య భారీగా తగ్గింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం… తెలంగాణలో 2014లో 8,20,134 నాటుకోళ్లు ఉండగా 2025 నాటికి 5,10,552 తగ్గాయి. మరోవైపు పట్టణాల్లో నాటుకోడి మాంసానికి అధిక గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కోళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది.
కార్యాచరణ…
వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
దళిత, గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద కోళ్లను పంపిణీ చేస్తారు. ఇప్పటికే మహబూబాబాద్‌, ములుగు, నల్గొండ జిల్లాల్లో దళితులు, గిరిజనులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను అందజేశారు.
రైతులు తక్కువ పెట్టుబడితో పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల షెడ్లను ఏర్పాటు కోవచ్చు. గుడ్లు, మాంసం సంతల్లో, స్థానిక మార్కెట్లలో అమ్మకాల ద్వారా లాభాలు పొందవచ్చు.
షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకోవచ్చు. మదర్‌ యూనిట్‌ కింద పెద్దషెడ్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనిలో కోడిపిల్లలను పెంచి గ్రామంలో ఇతరులకు పెంపకానికి ఇస్తారు. చిన్న యూనిట్లకు రూ. లక్ష ఇస్తారు. ఈ మేరకు రాయితీపై కోళ్లను, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణసాయాన్ని అందజేస్తారు.
మహిళాశక్తి పథకం కింద ప్రతి మండలానికి రెండు చొప్పున యూనిట్లు, 100 చొప్పన చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి రుణసాయాన్ని సెర్ప్‌ అందజేస్తుంది.

Read More

నానో బయోటెక్నాలజీతో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోజనాలు

ఉద్యానపంటలు, కూరగాయలు, ఆకుకూరల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో నానో బయోటెక్నాలజీతో పోషక విలువలు పెంచవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బయోఫాక్టర్‌ సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు నానో బయోటెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిచయం చేసి కూరగాయలు పండించారు. ఆయా కూరగాయల మొక్కలకు 40 శాతం పోషకాలు పెరగడంతోపాటు 15శాతం అధికంగా దిగుబడి వచ్చింది.
ఈ ప్రయోగ ఫలితాలను ధ్రువీకరించేందుకు ఇక్రిశాట్‌లోనిని వరల్డ్‌ వెజిటెబుల్‌ సెంటర్‌ ఆసియా శాఖకు తాజాగా హెచ్‌సీయూ, బయోఫాక్టర్‌ ప్రతినిధులు నమూనాలు పంపించారు. ధ్రువీకరణ లభించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని రైతులను సేంద్రీయ సాగు వైపు ప్రోత్సహించనున్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని ఉద్యాన పంటల్లో 20-30 శాతం తగ్గించేందుకు హెచ్‌ సీయూ ఆచార్యులు డా. దివాకర్‌దాస్‌, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సేంద్రీయ సాగులో ఫాలియర్‌ పిచికారీతో మొక్కలకు పోషకాలు అందుతాయి. పంటల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో కూరగాయలు రుచి పెరుగుతుంది.
నానో బయోటెక్నాలజీ పరిజ్ఞానంపై మూడేళ్లపాటు హెచ్‌సీయూ విద్యార్థులు, బయోఫాక్టర్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కోళ్ల పరిశ్రమ, మత్స్యసంపద పరిరక్షణపై పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి.
నానో బయోటెక్నాలజీ ఆకుకూరలు, కాయగూరలపై ప్రయోగించడం ద్వారా ఉద్యానపంటలకు ప్రయోజనం. యూరియా, రసాయన ఎరువులు వినియోగించినప్పుడు వర్షాలు కురిస్తే మొక్కలకు అవి ఎక్కువగా అందవు. భూమిలోకి వెళ్తాయి. నానోటెక్నాలజీతో నేరుగా మొక్కల్లోకే పోషకాలు వెళ్తాయి. రైతులకు ఈ సాంకేతికతో రైతులకు ప్రయోజనకరం కలుగుతుందని డా.శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌ అన్నారు.
ఉద్యాన పంటల్లో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పిచికారీ మందులను వినియోగిస్తున్నందువలన రసాయన అవశేషాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇందుకు నానో బయోటెక్నాలజీ అవసరం. తద్వారా భూసారం పెరుగుతుంది. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా కనిపించని వానపాములు ఉనికి పెరుగుతుందని డాక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, సీఈవో, బయోఫాక్టర్‌ అన్నారు.

Read More