ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

పశువులకు బీమా ఎందుకు అవసరం?రైతు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

“పశువు రైతుకు కేవలం ఒక జీవి కాదు… అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి.”
ఒక రైతు తన ఇంట్లో రెండు లేదా మూడు పాలిచ్చే పశువులను పెంచుకుంటున్నాడని అనుకుందాం. ప్రతిరోజూ వచ్చే పాల ఆదాయం ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పశువుల మేతకు కొంత అండగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ పశువు అనారోగ్యంతో మరణిస్తే లేదా ప్రమాదానికి గురైతే? పశువును కోల్పోవడంతో పాటు, రైతు కుటుంబానికి వచ్చే రోజువారీ ఆదాయం కూడా ఆగిపోతుంది.

ఇలాంటి అనుకోని ఆర్థిక నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయడానికి పశువుల బీమా (Livestock Insurance) ఎంతో ఉపయోగపడుతుంది.

పశువుల బీమా అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, పశువులకు బీమా అనేది అనుకోని ప్రమాదాల వల్ల పశువును కోల్పోయినప్పుడు రైతుకు ఆర్థిక రక్షణ కల్పించే వ్యవస్థ.

రైతు నిర్ణీత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకుంటాడు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా చేసిన పశువు మరణించినప్పుడు, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా సంస్థ రైతుకు పాలసీలో నిర్ణయించిన పరిహారాన్ని అందిస్తుంది.

అంటే, బీమా పశువును తిరిగి తీసుకురాదు. కానీ పశువును కోల్పోయిన తర్వాత రైతు కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

పశువులకు బీమా ఎందుకు అవసరం?

  1. పశువు రైతుకు ఒక పెట్టుబడి
    ఒక మంచి పాలిచ్చే ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడానికి రైతు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తాడు. పశువు ద్వారా పాలు, దూడలు, పేడ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
    అందువల్ల పశువు ఒక ఉత్పాదక ఆస్తి. ఈ ఆస్తిని అనుకోని నష్టం నుంచి రక్షించుకోవడానికి బీమా ఒక ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.
  2. అనుకోని ప్రమాదాలకు ఆర్థిక రక్షణ
    పశువులకు వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక ప్రమాదాలు ఎదురవుతాయి. రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ప్రతి ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు.
    ఉదాహరణకు: పశువు మరణం → ఆస్తి నష్టం → పాల ఆదాయం నిలిచిపోవడం → కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి
    ఇలాంటి పరిస్థితుల్లో బీమా పరిహారం రైతుకు కొంత ఆర్థిక ఊరటనిస్తుంది.
  3. చిన్న రైతులకు మరింత ఉపయోగకరం
    పెద్ద రైతు ఒక పశువును కోల్పోయినా ఇతర పశువుల ద్వారా కొంత ఆదాయం పొందగలడు. కానీ ఒకటి లేదా రెండు పశువులపై ఆధారపడే చిన్న రైతు కుటుంబానికి ఒక పశువు నష్టం కూడా పెద్ద ఆర్థిక సమస్యగా మారవచ్చు. అందుకే చిన్న, సన్నకారు రైతులకు పశువుల బీమా ప్రత్యేకంగా ఉపయోగకరం.

ఏ పశువులకు బీమా చేయవచ్చు?
ప్రభుత్వ పథకాల మార్గదర్శకాల ప్రకారం బీమా పరిధిలో పాలు ఇచ్చే దేశీ/క్రాస్బ్రీడ్ పశువులతో పాటు కొన్ని ఇతర పశువులు కూడా ఉండవచ్చు. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, యాక్, మిథున్ వంటి పశువులు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం పరిధిలోకి రావచ్చు. ప్యాక్ యానిమల్స్గా గుర్రాలు, గాడిదలు, మ్యూల్స్, ఒంటెలు, పోనీలు వంటి జంతువులు కూడా పథక పరిధిలో ఉండవచ్చు. అయితే ఏ జంతువుకు, ఏ పరిస్థితుల్లో, ఎంతవరకు బీమా అందుబాటులో ఉందో రాష్ట్రంలో అమలులో ఉన్న తాజా మార్గదర్శకాలు మరియు పాలసీ నిబంధనల ఆధారంగా తెలుసుకోవాలి.

బీమా ఎలా పనిచేస్తుంది?
రైతు ముందుగా బీమా చేయించాలనుకునే పశువును ఎంపిక చేసుకోవాలి. అనంతరం పశువుకు సంబంధించిన గుర్తింపు వివరాలను నమోదు చేసి, దాని విలువను నిర్ణయిస్తారు. ఈ వివరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకుని, నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత, పాలసీ నిబంధనలకు లోబడి పశువుకు అనుకోని నష్టం సంభవించినట్లయితే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ లేదా అధికారికి సమాచారం ఇవ్వాలి. అనంతరం పశువైద్య లేదా బీమా సంస్థ ప్రతినిధులు అవసరమైన పరిశీలన, ధృవీకరణ చేపడతారు. రైతు క్లెయిమ్కు అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, బీమా సంస్థ క్లెయిమ్ను పరిశీలిస్తుంది. పాలసీ నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ అర్హత పొందితే, రైతుకు నిర్ణయించిన పరిహారం చెల్లించబడుతుంది. అందువల్ల బీమా తీసుకోవడం మాత్రమే కాదు, పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

రైతు బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

  1. పశువు విలువను సరిగ్గా నమోదు చేయాలి
    బీమా తీసుకునే సమయంలో పశువు విలువను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎవరు విలువను ధృవీకరిస్తారు? పాలసీలో ఎంత మొత్తానికి బీమా చేస్తున్నారు? వంటి విషయాలను రైతు వివరంగా తెలుసుకోవాలి.
  2. పశువు గుర్తింపు చాలా ముఖ్యం
    పశువును ఇతర పశువులతో గందరగోళం కాకుండా గుర్తించడానికి చెవి ట్యాగ్, ప్రత్యేక గుర్తింపు లేదా సంబంధిత అధికారిక గుర్తింపు విధానం ఉపయోగించవచ్చు. గుర్తింపు వివరాలు సరిగ్గా నమోదు చేయడం క్లెయిమ్ సమయంలో ఎంతో ముఖ్యమైనది.
  3. పాలసీ కాలాన్ని తెలుసుకోవాలి
    పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? ఎప్పుడు పునరుద్ధరించాలి? అనే విషయాలను రైతు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత జాతీయ మార్గదర్శకాలు సాధ్యమైన చోట ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి బీమా చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
  4. ఏ నష్టాలకు పరిహారం వస్తుందో తెలుసుకోవాలి
    “బీమా ఉంది కాబట్టి ఏ కారణంతో పశువు చనిపోయినా డబ్బు వస్తుంది” అనుకోవడం సరికాదు. ప్రతి పాలసీకి కొన్ని నిబంధనలు, మినహాయింపులు (exclusions), క్లెయిమ్ విధానాలు ఉంటాయి.
    అందువల్ల పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు:
    • ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
    • ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు?
    • ఏ పత్రాలు అవసరం?
    • నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి?
    • ఎంత సమయంలోపు సమాచారం ఇవ్వాలి?

పశువు మరణించినప్పుడు రైతు ఏం చేయాలి?
ఇది చాలా ముఖ్యమైన విషయం.
పశువు బీమా చేసిన తర్వాత అనుకోని కారణంతో మరణిస్తే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి/సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
అవసరమైన గుర్తింపు, పశువైద్య ధృవీకరణ, మరణానికి సంబంధించిన పత్రాలు, పాలసీ వివరాలు వంటి వాటిని నిబంధనల ప్రకారం సమర్పించాలి.
పశువు మరణించిన వెంటనే తొందరపడి మృతదేహాన్ని తొలగించడం లేదా అవసరమైన పరిశీలనకు అవకాశం లేకుండా చేయడం క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ముందుగానే సంబంధిత అధికారుల సూచనలు తెలుసుకోవడం మంచిది.

“బీమా అంటే అదనపు ఖర్చు” అనే ఆలోచన సరైనదేనా?
• చాలామంది రైతులు, “పశువుకు బీమా చేయడానికి డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?” అని అనుకుంటారు. కానీ దీన్ని మరో విధంగా ఆలోచించాలి.
• ప్రీమియం – రక్షణ కోసం చేసే చిన్న ముందస్తు ఖర్చు.
• పశువును పూర్తిగా కోల్పోయినప్పుడు కలిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే, బీమా కోసం చెల్లించే రైతు వాటా తక్కువగా ఉండవచ్చు.
• అంతేకాదు, ప్రభుత్వ పథకాల కింద అర్హత ఉన్న రైతులకు ప్రీమియంపై సబ్సిడీ కూడా లభించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పశుసంపద బీమా National Livestock Mission (NLM) లోని “Research & Development, Livestock Insurance, Extension and Innovation” ఉప-మిషన్లో భాగంగా కొనసాగుతోంది.

ప్రభుత్వ సహాయం గురించి రైతు తెలుసుకోవాల్సింది
ప్రస్తుత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పశుసంపద బీమాలో రైతు ప్రీమియం వాటాను తగ్గించే విధంగా ప్రభుత్వ సహాయం అందించే విధానం ఉంది. 2025–26 వార్షిక నివేదిక ప్రకారం, రైతు వాటా 15 శాతానికి తగ్గించబడింది, మిగిలిన 85 శాతం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో భరించే విధానం అమలులో ఉంది. అయితే పథకం అమలు, అర్హత, రాష్ట్ర స్థాయి ప్రక్రియలు మారవచ్చు కాబట్టి రైతులు తమ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వద్ద తాజా వివరాలు తెలుసుకోవాలి.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ ప్రయోజనం నిర్దిష్ట పరిమితిలోని పశువులకు వర్తిస్తుంది; ఆ పరిమితికి మించి పశువులకు బీమా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో పూర్తి ప్రీమియం చెల్లించి బీమా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల “ప్రభుత్వం మొత్తం బీమా డబ్బు చెల్లిస్తుంది” అని భావించకూడదు.

బీమా తీసుకునే ముందు రైతు చెక్లిస్ట్
బీమా పాలసీ తీసుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి:
• నా పశువుకు బీమా అర్హత ఉందా?
• పశువు విలువ ఎలా నిర్ణయించారు?
• బీమా మొత్తం ఎంత?
• నేను చెల్లించాల్సిన ప్రీమియం ఎంత?
• ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందా?
• పాలసీ కాలం ఎంత?
• ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
• ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ రాదు?
• పశువు మరణిస్తే ఎవరికి సమాచారం ఇవ్వాలి?
• ఏ పత్రాలు అవసరం?
• క్లెయిమ్ ఎన్ని రోజుల్లో నమోదు చేయాలి?
• బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి సంప్రదింపు నంబర్ ఏమిటి?

బీమా ఒక్కటే రక్షణ కాదు
పశువులకు బీమా చేయడం మంచిదే. కానీ బీమా అనేది మంచి పశుపోషణకు ప్రత్యామ్నాయం కాదు.
పశువులను వ్యాధుల నుంచి రక్షించడానికి సమయానికి టీకాలు, సరైన పోషణ, పరిశుభ్రమైన నీరు, మంచి గాలి ప్రసరణ, సరైన మేత, శాస్త్రీయ ప్రజనన నిర్వహణ, సమయానుకూల పశువైద్యం అన్నీ అవసరం.
అదే విధంగా పశువుల ఆరోగ్య రికార్డులు, టీకాల వివరాలు, చికిత్స వివరాలు, కొనుగోలు వివరాలు వంటి వాటిని సురక్షితంగా భద్రపరచడం కూడా మంచిది.
ముగింపు
రైతు పశువును కేవలం “పశువు”గా చూడకూడదు. అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి. అది రైతు శ్రమకు ప్రతిఫలం. అది గ్రామీణ కుటుంబ ఆర్థిక భద్రతలో ఒక భాగం. అందుకే పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక రక్షణ కూడా అవసరం. అనుకోని ప్రమాదాన్ని మనం ఎప్పుడూ ఆపలేకపోవచ్చు. కానీ దాని వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
“పశువును కాపాడటం బాధ్యత…పశువు విలువను కాపాడటం తెలివైన ఆర్థిక నిర్ణయం.”
కాబట్టి రైతు సోదరులు తమ ప్రాంతంలో అమలులో ఉన్న పశుసంపద బీమా పథకాల గురించి సమీప పశువైద్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం లేదా అధికారిక బీమా ప్రతినిధి వద్ద వివరాలు తెలుసుకుని, అర్హత ఉన్న పశువులకు బీమా రక్షణను పరిశీలించడం మంచిది.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

“పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది”

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను తీరుస్తాయి.

ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా క్రి మినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్లు: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమిన్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యత: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నేపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది

  • పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
  • ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
  • అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
  • శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
  • పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాన్ సన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
  • గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
  • మినరల్ మిక్చర్ ను నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
  • పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
  • వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
  • సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
  • మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
  • కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
  • సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
  • కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
  • పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
  • పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.
    అందువల్ల “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana, Assistant Professor
College of Veterinary Science, Korutla. Ph: 8096871067

Read More

రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)

భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.

  1. బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్

కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) :  ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు  ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5)  నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన  అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్)  విడుదల అగును. 
  1. ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  2. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  3. మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్

బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:

  • పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
  • కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
  • రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
  • పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
  • విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
  • సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
  • బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
  • ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
  • మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
  • బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును

బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :

  • బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
  • ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
  • ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
  • బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
  • బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
  • బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
  • నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.

బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
  2. మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
  3. ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
  4. బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
  5. బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
  6. బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
  7. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
  8. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
  9. బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
  10. శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
  11. పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  12. భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
  13. అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  14. నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
  15. విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  16. పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
  17. ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More

పశువైద్యులకు దైవసేవ చేసే అపూర్వ అవకాశంగోసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం – నా అనుభవం

పశువైద్యులుగా మనకు లభించిన విద్య, అనుభవం, నైపుణ్యాలను మూగజీవుల ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఒక గొప్ప బాధ్యత. అదే సేవను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోసేవగా అందించే అవకాశం లభిస్తే, అది ఒక వృత్తిపరమైన అనుభవం మాత్రమే కాదు—జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతి.

తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీవారి వైద్య సేవ (Sri Vari Vaidya Seva)” పశువైద్యులకు అలాంటి అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

శ్రీవారి సన్నిధిలో పశుసేవ – ఒక గొప్ప భాగ్యం

  • శ్రీవారి వైద్య సేవ ద్వారా పశువైద్యులు TTD ఆధ్వర్యంలోని గోశాలల్లో పశువులకు వైద్య సేవలు అందించే అవకాశం పొందుతున్నారు.
  • పశువైద్య వృత్తిలో మనం ప్రతిరోజూ పశువులకు చికిత్స చేస్తూనే ఉంటాం. అయితే, తిరుమల శ్రీవారి సన్నిధిలో, గోమాతలకు సేవ చేయడం మన వృత్తికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరిమళాన్ని అందిస్తుంది.
  • “గోసేవ – గోవింద సేవ” అనే భావనతో పనిచేస్తూ, గోమాత ఆరోగ్య పరిరక్షణలో మన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. శ్రీవారి వైద్య సేవకు ప్రొఫైల్ నమోదు
    ఈ సేవలో పాల్గొనాలనుకునే అర్హత కలిగిన పశువైద్యులు ముందుగా TTD వెబ్‌సైట్/యాప్ ద్వారా తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    సాధారణంగా అవసరమైన వివరాలు/పత్రాలలో:
    ✅ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
    ✅ UG Degree Certificate
    ✅ PG Degree / PG Diploma Certificate
    ✅ VCI Registration Card
    ✅ Biodata / CV ఉంటే అదనంగా
    వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయం
ఈ సేవకు అవసరమైన అర్హతలను ముందుగానే పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా PG Degree లేదా PG Diploma అర్హత, సంబంధిత రిజిస్ట్రేషన్ తదితర TTD నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
ప్రొఫైల్ నమోదు అనంతరం గోశాల డైరెక్టర్ అనుమతి పొందిన తరువాతే సేవా స్లాట్‌ను బుక్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది.

నా శ్రీవారి వైద్య సేవ అనుభవం

  • ఇటీవల నాకు కూడా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే అవకాశం లభించింది.
  • ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆగస్టు 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడం జరిగింది.
  • ఈ సేవా కాలంలో నాతో పాటు డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లా కూడా పాల్గొని, కలిసి సేవలందించడం మరింత ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది.
  • ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు పశువైద్య అధికారులు కలిసి, తమ వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి శ్రీవారి గోసంరక్షణ కార్యక్రమంలో సేవ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సేవ

  • శ్రీవారి వైద్య సేవలో భాగంగా శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలు అందించే అవకాశం లభించింది.
  • గోశాలలో పశువుల నిర్వహణ, పరిశుభ్రత, మేత, పశువైద్య సేవలు, జాతుల సంరక్షణ తదితర అంశాలను దగ్గరగా పరిశీలించాను.
    అక్కడ:
    🐄 గిర్
    🐄 సాహివాల్
    🐄 కంక్రేజ్
    🐄 రెడ్ సింధీ
    🐄 ఒంగోలు
    🐄 పుంగనూరు
    వంటి అనేక విలువైన దేశీయ గో జాతులను చూడగలిగాము.
    జాతుల వారీగా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి నిర్వహించడం, పాలిచ్చే పశువులు, గర్భిణీ పశువులు, పొడి పశువులు, దూడలకు ప్రత్యేక నిర్వహణ చేయడం ఎంతో అభినందనీయం.

వసతి మరియు భోజన సదుపాయాలు

  • శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే పశువైద్యులకు TTD కల్పిస్తున్న సదుపాయాలు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి.
  • మాకు వేదిక్ విశ్వవిద్యాలయంలోని వశిష్ఠ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు.
  • అదేవిధంగా పద్మావతి వసతి గృహంలో టిఫిన్, భోజనం, డిన్నర్ వంటి ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
  • సేవ చేయడానికి వచ్చిన వైద్యులకు వసతి, భోజనం వంటి ప్రాథమిక అవసరాల గురించి ఆందోళన లేకుండా, సేవపై పూర్తి దృష్టి పెట్టేలా ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయోగపడ్డాయి.
  • అంతేకాకుండా గోశాల మరియు వసతి గృహాల మధ్య రాకపోకల కోసం ఒక కారును కూడా TTD ఏర్పాటు చేసింది.
  • ఈ రవాణా సదుపాయం వల్ల ప్రతిరోజూ నిర్ణీత సమయానికి గోశాలకు చేరుకోవడం, సేవ పూర్తయిన తరువాత వసతి గృహానికి తిరిగి రావడం ఎంతో సౌకర్యవంతంగా జరిగింది.
  • TTD అందించిన ఈ సదుపాయాలు సేవలో పాల్గొన్న వైద్యులకు ఎంతో సహాయకరంగా నిలిచాయి.

వైద్య సేవలో పొందిన అనుభవం
శ్రీవారి వైద్య సేవలో భాగంగా వివిధ రకాల పశువైద్య కేసులను పరిశీలించి చికిత్స అందించే అవకాశం లభించింది.
ముఖ్యంగా:
🔹 గర్భ నిర్ధారణ (Pregnancy Diagnosis – PD)
🔹 మావి నిలిచిపోవడం (Retained Placenta)
🔹 గర్భాశయ వాపు / గర్భాశయ ఇన్ఫెక్షన్ (Endometritis)
🔹 పునరుత్పత్తి సంబంధిత సమస్యలు
🔹 మళ్లీ మళ్లీ గర్భం దాల్చకపోవడం (Repeat Breeding)
🔹 కాళ్లు మరియు కీళ్లకు సంబంధించిన సమస్యలు
🔹 గాయాలకు చికిత్స మరియు నిర్వహణ
🔹 వ్యాధి నివారణ మరియు ఆరోగ్య పరిరక్షణ చర్యలు
🔹 గాలికుంటు వ్యాధి (FMD) టీకాలు
🔹 నులిపురుగుల నివారణ / నులిపురుగుల మందులివ్వడం (Deworming)
🔹 పోషకాహార లోపాలు మరియు సంబంధిత సమస్యలు
వంటి అంశాలలో సేవలందించగలిగాము.

కొన్ని రిటెయిన్‌డ్ ప్లాసెంటా మరియు ఎండోమెట్రైటిస్ కేసుల్లో అవసరమైన చికిత్స, గర్భాశయానికి తగిన విధంగా చికిత్సా చర్యలు మరియు సహాయక చికిత్స అందించడం జరిగింది.

అదేవిధంగా డ్రై మరియు మిల్క్ జంతువులలో Pregnancy Diagnosis (PD) నిర్వహించి, పునరుత్పత్తి స్థితిని అంచనా వేయడం జరిగింది.

గాలికుంటు వ్యాధి టీకాలు కూడా పశువులకు అందించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఇలాంటి కేసుల ద్వారా పశువైద్య సేవను అందించడంతో పాటు, ఒక పెద్ద స్థాయి గోశాలలో జరుగుతున్న శాస్త్రీయ పశు నిర్వహణను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.

శాస్త్రీయ మేత నిర్వహణ – ఒక మంచి అనుభవం

  • గోశాలలో మేత నిర్వహణ కూడా క్రమబద్ధంగా ఉంది.
  • పాలిచ్చే పశువులకు ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా కాన్సంట్రేట్ ఫీడ్ అందించడం, పొడి మేతను అందించడం, మధ్యాహ్నం సూపర్ నేపియర్ పచ్చిమేత ఇవ్వడం గమనించాము.
  • చాఫ్ కట్టర్ ఉపయోగించి పచ్చిమేతను తరిగి అందించడం వల్ల మేత వృథా తగ్గడం, పశువులు సులభంగా మేత తీసుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి.
  • అదేవిధంగా దేశీయ గో జాతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ఆకట్టుకుంది.

గోశాలతో పాటు ఆలయ ఏనుగుల సంరక్షణ

  • ఈ సేవలో భాగంగా తిరుచానూరు గోశాల మరియు అమ్మవారి ఆలయానికి చెందిన ఏనుగులను కూడా పరిశీలించే అవకాశం లభించింది.
  • ఏనుగుల నిర్వహణ, షెడ్ల పరిశుభ్రత, పాదాల ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలించడం జరిగింది.
  • ఏనుగుల పాదాల వద్ద గాయం/సమస్య కనిపించిన సందర్భంలో అవసరమైన చికిత్సా సలహాలు మరియు నిర్వహణ సూచనలు ఇవ్వడం జరిగింది.
  • గోమాతలతో పాటు ఆలయ ఏనుగులకు కూడా ఆరోగ్య పరిరక్షణ అందించడం ద్వారా ఈ సేవ మరింత విస్తృతమైన పశుసేవగా అనిపించింది.
  • ఈ సేవలో నాకు మరో ప్రత్యేకమైన అనుభూతి డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లాతో కలిసి సేవ చేయడం.
  • ఇద్దరం కలిసి గోశాలలోని పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలను అందించాము.
  • వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, వివిధ కేసులపై చర్చించుకుంటూ, గోశాల నిర్వహణను పరిశీలిస్తూ గడిపిన ఈ రోజులు మాకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించాయి.
  • శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పశువైద్యులు కలిసి గోసేవ చేయడం మా వృత్తి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

పశుసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం

  • శ్రీవారి వైద్య సేవలో నాకు అత్యంత ఆనందాన్ని కలిగించిన అంశాలలో ఒకటి కుటుంబ సభ్యులకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం పొందే అవకాశం.
  • పశువైద్యునిగా మనం ఎప్పుడూ విధుల్లో నిమగ్నమై ఉంటాం. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, వృత్తిపరమైన బాధ్యతలు, సమయాభావం వంటి కారణాల వల్ల అనేక సందర్భాల్లో అది సాధ్యం కాదు.
  • అలాంటి సమయంలో శ్రీవారి వైద్య సేవ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

నేను శ్రీవారి సన్నిధిలో గోసేవ చేస్తుంటే…
నా కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందాన్ని పొందడం…
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ఒక పశువైద్యునికి సేవా సంతృప్తి, కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఆనందం—రెండూ ఒకేసారి లభించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

Break Darshan – ఒక ప్రత్యేకమైన అవకాశం
సేవా కాలాన్ని పూర్తిచేసిన పశువైద్యులకు TTD నిబంధనలకు అనుగుణంగా Break Darshan అవకాశం కల్పించడం ఈ సేవలో మరో ప్రత్యేకత.
సేవలో పాల్గొనే ముందు తాజా TTD నిబంధనలు, అర్హతలు, దర్శన విధానం, ఛార్జీలు మరియు కుటుంబ సభ్యులకు వర్తించే నియమాలను తప్పనిసరిగా అధికారికంగా నిర్ధారించుకోవాలి.
కానీ ఆ అవకాశం లభించినప్పుడు, పశుసేవ అనంతరం కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం నిజంగా ఒక మరపురాని అనుభూతి.

TTDకి హృదయపూర్వక కృతజ్ఞతలు
పశువైద్యులకు సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవ చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ముఖ్యంగా గోశాల డైరెక్టర్, పశువైద్య అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, అటెండర్లు మరియు సిబ్బంది అందరూ ఎంతో సహకారంతో పనిచేయడం అభినందనీయం.
వారి సమన్వయం, పశువుల పట్ల శ్రద్ధ, గోశాల పరిశుభ్రత మరియు నిర్వహణ తీరు ఎంతో ఆకట్టుకున్నాయి.

ప్రతి పశువైద్యుడు ఒక్కసారైనా ఈ సేవలో పాల్గొనాలి
నా అనుభవం ఆధారంగా, అర్హత కలిగిన ప్రతి పశువైద్య మిత్రుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఇది కేవలం ఒక సేవా కార్యక్రమం కాదు.
ఇది—
🐄 గోసేవ
🩺 వైద్య సేవ
🙏 దైవ సేవ
👨‍👩‍👧‍👦 కుటుంబ ఆనందం
🌺 శ్రీవారి దర్శన భాగ్యం
📚 వృత్తిపరమైన అనుభవం
అన్నీ కలిసిన ఒక అపూర్వమైన అనుభవం.
పశువైద్యునిగా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఒక మూగజీవి ఆరోగ్యానికి ఉపయోగించడం గొప్ప విషయం. అదే జ్ఞానాన్ని శ్రీవారి సన్నిధిలో గోమాతల సేవకు వినియోగించే అవకాశం రావడం మరింత గొప్ప అదృష్టం.

ముగింపుగా…
శ్రీవారి వైద్య సేవ అనేది కేవలం పశువైద్య సేవ కాదు…
ఇది పశుసేవతో ప్రారంభమై, దైవసేవగా మారే పవిత్రమైన ప్రయాణం.
మన చేతులతో గోమాతకు వైద్యం అందిస్తూ…
మన హృదయంతో శ్రీవారిని స్మరిస్తూ…
మన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ…
“గోవిందా… గోవిందా…” అని పలకడం—
ఒక పశువైద్యుని జీవితంలో నిజంగా మరచిపోలేని అనుభూతి.
పశువులకు మన వైద్యం – శ్రీవారికి మన సేవ – కుటుంబానికి శ్రీవారి దర్శనం.
ఈ మూడు కలిసిన చోటే శ్రీవారి వైద్య సేవ యొక్క అసలైన గొప్పతనం.
🌺 గోసేవ – గోవింద సేవ 🌺
🩺 పశుసేవ – పరమ సేవ 🩺
🙏 శ్రీవారి సన్నిధిలో సేవ – అపూర్వమైన భాగ్యం 🙏
🌺 గోవింద… గోవింద… 🌺
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

– డా. జి. రాంబాబు

Read More

ఒక్క ఫోన్ కాల్‌తో పశువైద్య సేవలు: టెలిమెడిసిన్ యొక్క కొత్త విప్లవం

రాత్రి 9 గంటలు. మీ ఆవుకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. దగ్గరలో పశువైద్యుడు లేరు. ఇప్పుడేం చేయాలి? ఇలాంటి సమస్యలకు పరిష్కారమే టెలిమెడిసిన్ – ఆధునిక సాంకేతికత రైతులకు అందిస్తున్న వరం.

టెలిమెడిసిన్ అంటే ఏమిటి?
పశువైద్యుడిని ప్రతిసారీ నేరుగా కలవలేని పరిస్థితుల్లో రైతుకు అందుబాటులోకి వచ్చే సౌకర్యవంతమైన సేవే పశువైద్య టెలిమెడిసిన్. ఫోన్ కాల్, వీడియో కాల్, వాట్సాప్ లేదా ఇంటర్నెట్ వంటి మార్గాల ద్వారా పశువుకు కనిపిస్తున్న ఆరోగ్య సమస్యను పశువైద్యుడి దృష్టికి తీసుకెళ్లవచ్చు.

పశువులో కనిపిస్తున్న లక్షణాలను రైతు ఫోన్‌లో వివరించవచ్చు. అవసరమైతే పశువు పరిస్థితిని చూపించే ఫోటోలు లేదా చిన్న వీడియోలను కూడా పశువైద్యుడికి పంపవచ్చు. అందిన సమాచారాన్ని బట్టి పశువైద్యుడు సమస్య తీవ్రతను ప్రాథమికంగా అంచనా వేసి, వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు లేదా తదుపరి చికిత్సకు సంబంధించిన సూచనలు అందించవచ్చు.
అంతేకాదు, సలహా ఇచ్చిన తర్వాత పశువు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి పశువైద్యుడు ఫాలో-అప్ చేయవచ్చు. దీంతో చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి రైతుకు సహాయం లభిస్తుంది.

అయితే టెలిమెడిసిన్ పశువైద్యుడి ప్రత్యక్ష పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు లేదా ప్రత్యక్ష పరీక్ష అవసరమైన సందర్భాల్లో పశువును తప్పనిసరిగా పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

నేటి రైతుకు టెలిమెడిసిన్ ఎందుకు అవసరం?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో పశువైద్యుడు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. కొన్నిసార్లు వైద్యుడు వచ్చేలోపు విలువైన సమయం గడిచిపోతుంది. ఈలోపు వ్యాధి తీవ్రం కావచ్చు లేదా పాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు.
అలాంటి సందర్భాల్లో ఒక ఫోన్ కాల్ రైతుకు ధైర్యాన్ని ఇస్తుంది. పశువైద్యుడి సలహాతో ప్రారంభ దశలోనే సరైన చర్యలు తీసుకోవచ్చు.

టెలిమెడిసిన్ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలు
టెలిమెడిసిన్ పశువైద్య సేవలను రైతుల ఇంటి వద్దకే చేరువ చేసే ఆధునిక సాంకేతిక సాధనం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులను ఆసుపత్రికి తీసుకెళ్లే ఇబ్బందులను తగ్గిస్తూ, అవసరమైన సమయంలో నిపుణుల సలహాలను అందిస్తుంది. దీని ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

  1. సమయానికి పశువైద్య సలహాలు పొందే అవకాశం
    పశువులో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా పశువైద్యుడిని సంప్రదించవచ్చు. దీంతో సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  2. ప్రయాణ సమయం మరియు ఖర్చు తగ్గింపు
    ప్రతి చిన్న సమస్యకు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. టెలిమెడిసిన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ప్రాథమిక సలహాలు పొందడం వల్ల రైతుల సమయం, రవాణా ఖర్చు ఆదా అవుతుంది.
  3. నిపుణుల సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ
    దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా అనుభవజ్ఞులైన పశువైద్యుల సలహాలను పొందవచ్చు. దీనివల్ల నాణ్యమైన పశువైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
  4. వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించే అవకాశం
    పశువు ప్రవర్తనలో మార్పులు, మేత తగ్గడం, పాల దిగుబడి తగ్గడం వంటి ప్రారంభ సంకేతాలపై సలహాలు పొందడం ద్వారా వ్యాధులు తీవ్రరూపం దాల్చకుండా నివారించవచ్చు.
  5. పశువుల ఆరోగ్య నిర్వహణ మెరుగుదల
    టీకాలు, నులిపురుగుల నివారణ, పోషకాహారం, ప్రజనన నిర్వహణ, పాలిచ్చే పశువుల సంరక్షణ వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకత్వం పొందవచ్చు.
  6. అత్యవసరం కాని సమస్యలకు త్వరిత పరిష్కారం
    చిన్న గాయాలు, చర్మ సమస్యలు, ఆహార సంబంధిత సమస్యలు, మందుల వినియోగంపై సందేహాలు వంటి వాటికి త్వరగా సూచనలు పొందవచ్చు.
  7. చికిత్స అనంతర పర్యవేక్షణ సులభతరం
    చికిత్స పొందుతున్న పశువుల ఆరోగ్య పరిస్థితిని పశువైద్యుడికి తెలియజేసి, అవసరమైన మార్పులు లేదా తదుపరి సూచనలు పొందవచ్చు.
  8. రైతులలో అవగాహన మరియు నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది
    టెలిమెడిసిన్ ద్వారా రైతులు పశువుల ఆరోగ్యం, పోషణ మరియు నిర్వహణపై శాస్త్రీయ సమాచారం పొందుతూ, మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

టెలిమెడిసిన్‌ను ఎలా ఉపయోగించాలి?
టెలిమెడిసిన్ సేవలను సరిగ్గా ఉపయోగించుకుంటే రైతులు తమ పశువుల ఆరోగ్య సమస్యలపై త్వరగా పశువైద్యుల సలహాలు పొందవచ్చు. అయితే, పశువుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా అందించడం చాలా ముఖ్యం. టెలిమెడిసిన్ ద్వారా మంచి మార్గదర్శకత్వం పొందడానికి రైతులు ఈ క్రింది అంశాలను పాటించాలి.

  1. పశువు ఆరోగ్య పరిస్థితిని గమనించాలి
    ముందుగా పశువు ప్రవర్తనలో వచ్చిన మార్పులు, మేత తినే విధానం, పాల ఉత్పత్తిలో తగ్గుదల, జ్వరం, దగ్గు, విరేచనాలు, గాయాలు వంటి లక్షణాలను గమనించాలి. సమస్య ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతకాలంగా ఉంది అనే వివరాలను గుర్తుంచుకోవాలి.
  2. అవసరమైన సమాచారాన్ని పశువైద్యుడికి అందించాలి
    టెలిఫోన్ లేదా వీడియో కాల్ సమయంలో పశువు వయస్సు, జాతి, బరువు, గతంలో వచ్చిన వ్యాధులు, వేసిన టీకాలు, ప్రస్తుతం ఇస్తున్న మందులు, ఆహార పద్ధతులు వంటి వివరాలను తెలియజేయాలి. ఈ సమాచారం ఆధారంగా పశువైద్యుడు మెరుగైన సలహా ఇవ్వగలుగుతారు.
  3. ఫోటోలు మరియు వీడియోలను స్పష్టంగా పంపాలి
    పశువుకు ఉన్న గాయం, చర్మ సమస్య, కంటి లేదా ముక్కు నుంచి వచ్చే స్రావాలు, నడకలో మార్పులు వంటి వాటిని స్పష్టమైన ఫోటోలు లేదా చిన్న వీడియోల రూపంలో పంపితే సమస్యను అర్థం చేసుకోవడం సులభమవుతుంది.
  4. పశువైద్యుడి సూచనలను పాటించాలి
    మందుల మోతాదు, ఇచ్చే సమయం, ఆహార మార్పులు లేదా సంరక్షణ పద్ధతులపై పశువైద్యుడు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలి. స్వయంగా మందులు వాడటం లేదా మోతాదును మార్చడం చేయకూడదు.
  5. ఫాలో-అప్ సేవలను ఉపయోగించుకోవాలి
    చికిత్స ప్రారంభించిన తర్వాత పశువు ఆరోగ్యంలో వచ్చిన మార్పులను పశువైద్యుడికి తెలియజేయాలి. అవసరమైతే మళ్లీ వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించి తదుపరి సూచనలు పొందాలి.

టెలిమెడిసిన్‌తో పరిష్కరించగల కొన్ని సమస్యలు
టెలిమెడిసిన్ ద్వారా అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయలేకపోయినా, అనేక సాధారణ ఆరోగ్య సమస్యలపై పశువైద్యుల నుంచి సముచితమైన సలహాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ క్రింది సందర్భాల్లో టెలిమెడిసిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
• ఆహారం తగ్గడం, మేత సరిగా తినకపోవడం వంటి ప్రారంభ లక్షణాలపై సలహాలు పొందవచ్చు.
• జ్వరం, స్వల్ప దగ్గు, విరేచనాలు, అజీర్ణం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక సూచనలు పొందవచ్చు.
• చిన్న గాయాలు లేదా స్వల్ప చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఫోటోలు లేదా వీడియోల ద్వారా పశువైద్యుడికి చూపించి తగిన సలహా పొందవచ్చు.
• మందుల వినియోగం, మోతాదు, చికిత్స విధానం గురించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
• టీకాలు, నులిపురుగుల నివారణ (డీవార్మింగ్), ఖనిజ మిశ్రమాల వినియోగం వంటి నివారణ చర్యలపై మార్గదర్శకత్వం పొందవచ్చు.
• దాణా నిర్వహణ, పోషకాహారం, పాలిచ్చే లేదా గర్భిణీ పశువుల సంరక్షణ గురించి నిపుణుల సూచనలు పొందవచ్చు.
• కృత్రిమ గర్భధారణ (AI), ప్రజనన నిర్వహణ, హీట్ లక్షణాల గుర్తింపు వంటి అంశాలపై సలహాలు పొందవచ్చు.
• చికిత్స పొందుతున్న పశువుల ఫాలో-అప్ కోసం తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పశువైద్యుడితో సంప్రదింపులు కొనసాగించవచ్చు.
• అత్యవసరం కాని ఆరోగ్య సమస్యలపై రెండో అభిప్రాయం కూడా నిపుణుల నుంచి పొందవచ్చు.
ఈ విధంగా టెలిమెడిసిన్ రైతులకు సమయాన్ని, ప్రయాణ ఖర్చును ఆదా చేయడమే కాకుండా, పశువుల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎప్పుడు తప్పనిసరిగా పశువైద్యుడిని ప్రత్యక్షంగా కలవాలి?
టెలిమెడిసిన్ ఎంతో ఉపయోగకరమైన సేవ అయినప్పటికీ, ప్రతి సమస్యకు ఇది ప్రత్యామ్నాయం కాదు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు సలహాలు పొందడం, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం, ఫాలో-అప్ సేవలు పొందడం వంటి సందర్భాల్లో టెలిమెడిసిన్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పశువును ప్రత్యక్షంగా పరీక్షించి చికిత్స అందించడం తప్పనిసరి.
ఉదాహరణకు, ప్రసవంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు, అధిక రక్తస్రావం జరిగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, పాము కాటు లేదా విషపదార్థాలు తిన్నప్పుడు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నప్పుడు, పశువు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు టెలిమెడిసిన్‌పై మాత్రమే ఆధారపడకూడదు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని పశువైద్యశాల లేదా పశువైద్యుడిని వెంటనే సంప్రదించడం పశువు ప్రాణాలను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
• ఫోన్‌లో చెప్పే సమాచారం నిజాయితీగా, స్పష్టంగా ఉండాలి.
• వైద్యుడి సూచన లేకుండా మందులు వాడకూడదు.
• పొరుగువారి సలహా లేదా సోషల్ మీడియాలో చూసిన మందులను ఉపయోగించకూడదు.
• చికిత్స తర్వాత పశువు పరిస్థితిని మళ్లీ వైద్యుడికి తెలియజేయాలి.

భవిష్యత్తు పశువైద్యం: రైతు చేతిలోని మొబైల్‌లోనే
ఈరోజు మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడేందుకు మాత్రమే కాదు. అది రైతుకు సమాచార కేంద్రం, మార్కెట్ వేదిక, బ్యాంకు, ఇప్పుడు పశువైద్య సేవలకు కూడా ఒక వంతెనగా మారుతోంది.

డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో టెలిమెడిసిన్ గ్రామీణ పశుపోషకులకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఇది సమయానుకూలమైన పశువైద్య సేవలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI), మొబైల్ యాప్‌లు, ధరించగల సెన్సర్లు (Wearable Sensors) వంటి సాంకేతికతలు టెలిమెడిసిన్‌తో కలిసినప్పుడు పశువైద్య సేవలు మరింత వేగంగా, ఖచ్చితంగా అందే అవకాశం ఉంది.

ముగింపు
“పశువుకు మాటలు రావు… కానీ రైతు సమయానికి చెప్పిన ప్రతి మాట పశువైద్యుడికి సరైన చికిత్స అందించడంలో సహాయపడుతుంది.”

టెలిమెడిసిన్ రైతుకు ఎంతో ఉపయోగకరమైన ఆధునిక సేవ. ఇది సమయానికి పశువైద్య సలహా అందించి, అనవసర ప్రయాణాన్ని తగ్గించి, పశువుల ఆరోగ్య సంరక్షణలో రైతుకు అండగా నిలుస్తుంది. అయితే, ఇది ప్రత్యక్ష పశువైద్య సేవలకు ప్రత్యామ్నాయం కాదు; వాటికి తోడ్పడే సేవ అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

డిజిటల్ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, సమయానికి నిపుణుల సలహా తీసుకుంటే ఆరోగ్యవంతమైన పశువులు, అధిక ఉత్పత్తి మరియు అభివృద్ధి చెందిన రైతు కుటుంబం అనే లక్ష్యాన్ని మరింత సులభంగా చేరుకోవచ్చు.

*డా. బద్దం అఖిల, టీచింగ్ ఫ్యాకల్టీ,
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

పాడి పశువుల పునరుత్పత్తిలో ఖనిజలవణాల ప్రాముఖ్యత

పాడిపశువులలో అధిక పాల ఉత్పత్తితో పాటు పునరుత్పత్తి సామర్ధ్యం కూడా రైతులకి ఆదాయాన్ని చేకూరుస్తుంది. లాభదాయకమైన పాల ఉత్పత్తికి మరియు మంచి సంతానోత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. పశువుల ఆహారంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడితే అవి సకాలంలో ఎదకు రాకపోవడం, పదే పదే పొర్లడం, గర్భధారణ శాతం తగ్గడం, గర్భస్రావాలు మరియు మాయ పడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పచ్చిమేత, పొడిమేత మాత్రమే సరిపోవు, సమతుల్య మోతాదులలో ఖనిజలవణాలు అందించినప్పుడే పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పునరుత్పత్తి లో ఖనిజాలవణాల ప్రాముఖ్యత :
ఖనిజలవణాలు శరీరం పెరుగుదల, ఎముకల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖనిజలవణాలు రెండు రకాలుగా ఉంటాయి.

స్థూల ఖనిజాలు: కాల్షియమ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్.

సూక్ష్మ ఖనిజాలు: జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, కోబాల్ట్, అయోడిన్, ఇనుము.

పశువుల దాణాలో కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ నిష్పత్తి 2:1 ఉండేలా చూసుకోవాలి. వీటి లోపం వలన అండాల ఉత్పత్తి తగ్గుతుంది. కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ పశువులు సకాలంలో ఎదకు రావడానికి సహాయపడుతాయి.

కాల్షియమ్: పశువుల గర్భాశయ కండరాల పనితీరుని మెరుగు పర్చడంలో, ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంలో మరియు ప్రసవానంతరం గర్భాశయం సాధారణస్థితికి రావడంలో కాల్షియమ్ ముఖ్యపాత్ర వహిస్తుంది. కాల్షియమ్ లోపించడం వలన పశువులకు పాల జ్వరం, మాయపడకపోవడం, గర్భాశయ బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

ఫాస్ఫరస్: పశువు ఎదకు సకాలంలో రావడంలో మరియు అండాశయాల పనితీరుని మెరుగుపరచడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది. గర్భధారణ శాతాన్ని పెంచుతుంది. ఫాస్ఫరస్ లోపించడం వలన మూగ ఎద, ఎదకు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

జింక్: అండాశయంలో ఆరోగ్యకరమైన అండాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ప్రసవం తరువాత గర్భాశయం త్వరగా సాధారణస్థితికి రావడానికి సహాయపడుతుంది. ప్రసవం అనంతరం గర్భాశయ సమస్యలు నివారించి, త్వరగా గర్భం దాల్చేందుకు సహాయపడుతుంది.

రాగి (కాపర్): పునరుత్పత్తి హార్మోన్ల పనితీరుని మెరుగుపరిచి పశువులు త్వరగా గర్భం దాల్చేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచి ప్రసవానంతరం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగి లోపం వలన గర్భస్రావం, మూగ ఎద వంటి సమస్యలు ఏర్పడుతాయి.
మాంగనీస్: అండం విడుదల సక్రమంగా జరిగేలా చేసి, గర్భం నిలదొక్కుకోవడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది. పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. మాంగనీస్ లోపం వలన గర్భధారణ శాతం తగ్గుతుంది.

అయోడిన్: శరీర జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. పిండం మెదడు ఎదుగుదలకు మరియు శరీర అభివృద్ధికి సహాయపడడంలో అయోడిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం వలన బలహీనమైన దూడలు లేదా చనిపోయిన దూడలు పుట్టే ప్రమాదం ఉంటుంది.

సెలీనియం: విటమిన్ -ఈ తో కలిసి పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈనిన తరువాత మాయ ఆలస్యంగా పడడం వంటి సమస్యలు నివారించి, పశువుల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, దూడలు ఆరోగ్యంగా పుట్టడంలో తోడ్పడుతుంది.
కోబాల్ట్ : కోబాల్ట్ చాల తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ రుమేన్ సూక్ష్మజీవుల ద్వారా విటమిన్ బి12 తయారీ, శరీర జీవక్రియ, మంచి శారీరకస్థితి మరియు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైన ఖనిజలవణం.

ఐరన్: ఇనుము (ఐరన్) లోపం వలన ఆకలి తగ్గడం సంభవించవచ్చు. రక్తహీనత మరియు శరీర పోషక స్థితి క్షీణించడం వల్ల ప్రజనన ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇనుము లోపం కారణంగా పశువులు పదే పదే పొర్లడం, ఒక్క గర్భధారణ కోసం ఎక్కువసార్లు సంయోగం అవసరమవడం, గర్భస్రావాలు సంభవించడం జరుగుతుంది.

ఖనిజాలవణాల లోపాల నివారణ చర్యలు :

  1. సమతుల్యమైన దాణా అందించాలి: పశువుల వయస్సు, పాల ఉత్పత్తి మరియు గర్భధారణ దశను బట్టి సమతుల్యమైన ధాణాని ఇవ్వాలి.
  2. ప్రతి రోజు తగిన మోతాదులో ఖనిజాలవణాల మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి.
  3. పశువుల కొట్టంలో ఎల్లప్పుడూ మినరల్ మిక్స్ బ్రిక్స్ ను అందుబాటులో ఉంచాలి.
  4. పోషకవిలువలు అధికంగా ఉన్న నాణ్యమైన మేతను అందించాలి. బూజు పట్టిన లేదా నాసిరకం మేతను ఇవ్వకూడదు.
  5. తగినంత శుభ్రమైన త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
    6.గర్భం ధరించిన మరియు అధిక పాలిచ్చే పశువులకు ప్రత్యేక పోషణను అందించాలి.
  6. పునరుత్పత్తి సమస్యలు పశువులలో గమనించినప్పుడు వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
  7. క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు పశువులకు ఇవ్వడం వలన ఖనిజాలవణాల శోషణ పెరుగుతుంది.

ముగింపు : పాడిపశువుల సంతానోత్పతి విజయవంతంగా ఉండాలంటే సమతుల్య పోషకాహారంతో పాటు ఖనిజలవణాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన పశువులలో పునరుత్పతి సమస్యలను అధిగమించవచ్చు. సమతుల్య పోషకాహారం, నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం, మినరల్ మిక్స్ బ్రిక్స్ మరియు పశువైద్యుడి సూచనలు పాటించడం ద్వారా పశువులను ఆరోగ్యంగా ఉంచి రైతులు అధిక లాభాలు పొందవచ్చు.

రచయిత: డా సిహెచ్. ప్రజ్ఞ అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం పశువైద్యకళాశాల, కోరుట్ల. 9014639814

Read More

సీమ పందుల పెంపకంరైతుల ఆర్థిక సాధికారతకు శాస్త్రీయ ప్రత్యామ్నాయం

గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.

సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు
మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.

ప్రధాన సీమ జాతులు

  • లార్జ్ వైట్ యార్క్‌షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
  • ల్యాండ్‌రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
  • డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
  • హ్యాంప్‌షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.

తెలంగాణకు అనువైన సంకర జాతులు:
పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు

SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్‌ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).

రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్‌షైర్‌ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్‌తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).

TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).

ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు
గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్‌లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్‌తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.

సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

మేత యాజమాన్యం
పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.

దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం
దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత)
2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500
5–15 కిలోల బరువు 22% 3,500
15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300
35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300
గర్భిణి ఆడ పందులు 14% 3250
పాలిచ్చే ఆడ పందులు 15% 3300
కోడె పందులు (boars) 14% 3250

క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత
పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్‌తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.

గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా
గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.

పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో)
మొక్కజొన్న 55 భాగాలు
వేరుశనగ చెక్క 20 భాగాలు
గోధుమ తవుడు 15 భాగాలు
చేపల పొడి 8.5 భాగాలు
ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు
ఉప్పు 0.5 భాగాలు
ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.

గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత:
గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.

నీటి అవసరం (రోజుకు):
వర్గం నీరు (లీటర్లలో)
కోడె పంది (boar) 45–50
ఈనే ఆడ పంది 18–22
పాలు మాన్పిన పిల్లలు 3.5–4
పాలిచ్చే ఆడ పంది 14–23

చౌక, స్థానిక మేత వనరులు
దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్‌లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.

వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు

ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం

నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.

వ్యాధి : *లెప్టోస్పైరోసిస్

ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు

వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్

ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స

వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స

వైరస్ వ్యాధులు: *

వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)

ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి

వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)

ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు

నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.

వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)

ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు

నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి

వ్యాధి : స్వైన్ ఇన్‌ఫ్లుఎంజా

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు

నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు

*పరాన్నజీవి వ్యాధులు *

వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్

ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు

నివారణ / నియంత్రణ : ఐవర్‌మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత

వ్యాధి : రౌండ్‌వార్మ్, విప్‌వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్

ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం

నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి

వ్యాధి : ట్రైకినోసిస్

ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి

నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి

జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు
బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.

బయోసెక్యూరిటీ చర్యలు
• కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్‌లో ఉంచాలి.
• షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి.
• ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి.
• టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి.
• అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.

ప్రభుత్వ పథకాలు — విధానాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)

పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముగింపు
సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం.
.
డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, సెల్‌: 8499884669.

Read More

వర్షాకాలంలో పశుసంపద సంరక్షణ – శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు రోగకారక క్రిములు (బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల పశువులలో పాల దిగుబడి తగ్గడమే కాకుండా తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పశుపోషణలో పాటించాల్సిన సమగ్ర శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు

1: షెడ్ల నిర్వహణ, పారిశుధ్యం మరియు గాలి-వెలుతురు (Shed Management & Sanitation)

వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం షెడ్ పరిశుభ్రతపైనే 80% ఆధారపడి ఉంటుంది.

ఏ . షెడ్ పరిశుభ్రత మరియు నీటి నిల్వ నివారణ:

  • నేల పొడిగా ఉంచడం: షెడ్ లోపల నీరు నిలవకుండా చూడాలి. కాంక్రీట్ లేదా మట్టి నేలపై వర్షం నీరు లేదా మూత్రం నిలిస్తే గిట్టల కుళ్లు (Foot rot) మరియు పొదుగు వాపు (Mastitis) వ్యాధులు వస్తాయి.
  • సున్నం మరియు క్రిమిసంహారకాలు: వారానికి కనీసం రెండు సార్లు షెడ్ నేలపై, మూలల్లో పొడి సున్నం (Quick lime) లేదా వరి పొట్టు చల్లాలి. ఇది తేమను పీల్చుకుని క్రిములను చంపుతుంది.
  • మురుగు నీటి కాలువలు: షెడ్ చుట్టూ ఉన్న కాలువలను శుభ్రం చేసి వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
  1. షెడ్ ఎత్తు మరియు గాలి, వెలుతురు:
  • కిటికీలు మరియు పరదాలు: వర్షం చినుకులు లోపలికి పడకుండా గోనె సంచులు లేదా తార్పాలిన్ పరదాలను అమర్చాలి. అయితే, షెడ్ లోపల అమ్మోనియా వాయువు నిలిచిపోకుండా గాలి ఆడటానికి పైన ఖాళీ (Ventilation) ఉంచాలి.
  • ఈగలు, దోమల నివారణ: వర్షాకాలంలో దోమలు, ఈగల తీవ్రత ఎక్కువ. వీటి నివారణకు సాయంత్రం వేళల్లో వేపఆకులు, సాంబ్రాణి పొగ వేయడం లేదా పొగచుట్ట పొడి ద్రావణాన్ని షెడ్ చుట్టూ పిచికారీ చేయడం చేయాలి.

2: మేత మరియు పోషక యాజమాన్యం (Feed & Nutrition Management)
వర్షాకాలంలో లభించే చిగురించిన పచ్చిమేత వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఏ . పచ్చిమేత వాడకంలో జాగ్రత్తలు:

  • లేత గడ్డి వల్ల ప్రమాదం: వర్షాలకు కొత్తగా పెరిగిన లేత పచ్చిమేతలో నీటి శాతం ఎక్కువ, పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉంటుంది. దీనిని నేరుగా తినిపిస్తే పశువులకు సార విరేచనాలు (Diarrhea) మరియు కడుపు ఉబ్బరం (Bloat) వస్తాయి.
  • ఎండుగడ్డి కలపడం: పచ్చిమేతతో పాటు తప్పనిసరిగా తగినంత వరిగడ్డి లేదా జొన్న చొప్ప (ఎండుమేత) కలిపి అందించాలి. పచ్చిమేత కోసిన వెంటనే వేయకుండా 2-3 గంటల పాటు నీడలో ఆరబెట్టి వేయాలి.

బి . బూజు పట్టిన మేత నివారణ (Aflatoxin Control):

  • వర్షాకాలంలో గాలిలో తేమ వల్ల నిల్వ ఉంచిన దాణా, శనగ పొట్టు, తవుడు బూజు పట్టే ప్రమాదం ఉంది.
  • బూజు పట్టిన దాణాను పశువులకు మేపకూడదు. దీనివల్ల కాలేయం పాడై ‘ఆఫ్లాటాక్సికోసిస్’ అనే విషప్రభావం ఏర్పడుతుంది. దాణాను నిల్వ చేసే ప్రదేశంలో ప్లాస్టిక్ షీట్ పరిచి దానిపై బస్తాలు ఉంచాలి.

సి . మినరల్ మిశ్రమం మరియు తాగునీరు:

  • ధాతు లవణాల మిశ్రమం (Mineral Mixture): వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ప్రతి పాడి పశువుకు రోజుకు 50-100 గ్రాముల మినరల్ మిశ్రమం దాణాలో కలిపి ఇవ్వాలి.
  • శుభ్రమైన నీరు: వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి. పశువులకు పంపు నీరు లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాపాలి. గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని తాపకూడదు.

3: వ్యాధుల వ్యాప్తి, నివారణ మరియు అత్యవసర జాగ్రత్తలు (Disease Control & Health Care)
వర్షాకాలంలో బ్యాక్టీరియల్ మరియు పరాన్నజీవుల (Parasites) ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువ.

ఏ . ముఖ్యమైన వ్యాధులు – ముందస్తు టీకాలు (Vaccinations):

వ్యాధి పేరు
గొంతువాపు (HS)

లక్షణాలు:
గొంతు వాచి శ్వాస తీసుకోవడం కష్టమవడం, తెల్లటి నురుగు రావడం

నివారణ / టీకా:
వర్షాకాలం ముందు లేదా ప్రారంభంలో H.S. టీకా వేయించాలి

వ్యాధి పేరు: జానపద వ్యాధి (BQ)

లక్షణాలు: పిరుదుల కండరాలు వాచి, తాకితే చప్పుడు రావడం, తీవ్ర జ్వరం

నివారణ / టీకా: B.Q. టీకా వేయించాలి

వ్యాధి పేరు: పొదుగు వాపు (Mastitis)

లక్షణాలు: పొదుగు గట్టిపడి పాలు ఎర్రగా/విరిగిపోయి రావడం

నివారణ / టీకా: పాలు పితికిన తర్వాత చనుమొనలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచాలి

వ్యాధి పేరు: పరాన్నజీవుల సమస్య

లక్షణాలు: బరువు తగ్గడం, కళ్ల వెంట నీరు, దవడ కింద వాపు

నివారణ / టీకా: నట్టల నివారణ మందు (Deworming) తాపించాలి

బి . గిట్టల సంరక్షణ (Foot Care):
• నేల తేమగా ఉండటం వల్ల గిట్టల మధ్య పుండ్లు పడతాయి (Foot rot).
• పరిష్కారం: వారానికి ఒకసారి పశువుల కాళ్లను 2% రాగి మైలుతుత్తం (Copper Sulphate) ద్రావణంతో కడగాలి.

  1. గొర్రెలు, మేకలు మరియు కోళ్ల ప్రత్యేక జాగ్రత్తలు:
    • గొర్రెలు/మేకలు: వీటిని వర్షంలో తడవనివ్వకూడదు. వర్షాకాలంలో PPR టీకా మరియు ఎంటరోటాక్సిమియా (ET) టీకా తప్పనిసరిగా వేయించాలి.
    • పెరటి కోళ్లు: కోళ్ల షెడ్లలో రంధ్రాలు లేకుండా చూసి, రాణిఖేత్ (RDV) టీకా వేయించాలి. తాగునీటిలో యాంటీబయోటిక్స్ లేదా విటమిన్లు కలిపి ఇవ్వడం శ్రేయస్కరం.

రైతులకు ముఖ్య గమనిక:
వర్షాకాలంలో పశువులలో ఏమాత్రం మేత తినకపోవడం, జ్వరం రావడం లేదా నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యుడిని (Veterinary Doctor) సంప్రదించి చికిత్స అందించాలి.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం). Ph: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More