వర్షాకాలంలో పశుసంరక్షణ…!

వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

  1. పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ:
    వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.

వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్‌లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్‌లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

  1. మేత మరియు పోషకాహార నిర్వహణ:
    మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి.
  2. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ
    వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
  3. పరాన్నజీవుల (Worms) నియంత్రణ:
    పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్‌తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం.
  4. మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ:
    చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
  • Dr. Vaishnavi Polapelli, MVSc Scholar
    Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211

Read More

వర్షాకాల ఒత్తిడి పాల దిగుబడిపై ఎలా ప్రభావం చూపుతుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?

  1. అధిక తేమ ప్రభావం
    వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
  2. మేత వినియోగం తగ్గడం
    పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  3. తడి మరియు బురద వాతావరణం
    బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  4. వ్యాధుల పెరుగుదల
    వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది.
  5. పొదుగు వాపు వ్యాధి ప్రభావం
    వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు.
  6. పరాన్నజీవుల దాడి
    వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
  7. కలుషితమైన మేత
    వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది.
  8. తాగునీటి సమస్య
    వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు.
    కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.

వర్షాకాల ఒత్తిడి లక్షణాలు
రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు:

• పాల ఉత్పత్తి తగ్గడం
• మేత తక్కువగా తినడం
• నీరసం
• ఎక్కువసేపు నిలబడటం
• బరువు తగ్గడం
• పొదుగు సమస్యలు
• జ్వరాలు
• తరచుగా వ్యాధులు రావడం

రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు

  1. షెడ్ నిర్వహణ
    వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి
  2. పొడి పరుపు ఏర్పాటు
    పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు.
  3. పరిశుభ్రత పాటించాలి
    రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి
  4. పొదుగు వాపు వ్యాధి నివారణ
    పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。
  5. నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి
    వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి
  6. ఖనిజ మిశ్రమాలు
    పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్
    అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
  7. పరాన్నజీవుల నియంత్రణ
    క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి.
  8. టీకాలు వేయించాలి
    వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.

ముగింపు
వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.

డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి
పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834

Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

నాణ్యమైన గొర్రెలు/మేకల మంద అభివృద్ధి కావాలంటే

ఆరోగ్యమైన మరియు జన్యుపరంగా మంచి నాణ్యత కలిగిన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెల/మేకల పెంపకందార్లు ప్రతి ఏటా “ఏరివేత”ని అవలంబించాలి. నాసిరకం జీవాలని ఎప్పటికప్పుడు గుర్తించి మందనుండి వేరుచేసి, ఆరోగ్యమైన జీవాలని మాత్రమే ఉంచడం వలన పోషణ ఖర్చు తగ్గి, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.

పుట్టిన ఆడ జీవాల(పిల్లలు)లో ఆరోగ్యంగా, మంచి శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడానికి ఎంపిక చేసుకోవాలి. బలహీనంగా ఉండి, పెరుగుదల లేని, ఆరోగ్యంగా  లేని పిల్లల్ని, తల్లి పాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకి పాలివ్వలేని తలుల్ని  వేరుచేసి, ఆరోగ్యంగా, పాలిచ్చే శక్తి కలిగిఉన్న తల్లుల్ని మాత్రమే మందలో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ బరువున్న జీవాల్ని, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్నవాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని, చూలి నిలవని వాటిని, తరచుగా ఈడుసుకుని పోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన జీవాల్ని మందనుండి తీసివేయాలి. 

ఇక మగ జీవాల (పిల్లల) విషయానికొస్తే అధిక శరీర బరువు కలిగివుండి, జాతి లక్షణాలున్న 3-4 మగ జీవాల పిల్లల్ని మందలో ఉంచి, మిగితా వాటిని వేరు చేసి 6-7 మాసాలు పోషించి, మాంసం కొరకు అమ్మివేయాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొటేళ్లుగా) అమ్మివేయాలి. రెండు సంవత్సరాల పాటు మందలో ఉన్న పొట్టేలు/పోతులను తొలగించివేయాలి. లేనిచో మందలో “ఇన్ బ్రీడింగ” సమస్య  తలెత్తి, మంద నాణ్యత జన్యుపరంగా క్షీనిస్తుంది. కాబట్టి పొట్టేలు / పోతులను ప్రతి రెండేళ్లకోసారి మార్చుకోవాలి.

వంగిపోయిన కాళ్ళు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండడం), పగిలిన నోరు మొదలగు జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి.  మంద పరిమాణం. వసతి, మేత వనరులు మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏటా 10-20% జీవాల్ని ఏరివేయటం మంచిది.

డా. జె. సాయి ప్రసన్న, డా. సరిన్ కున్నత్, సహ ఆచార్యులు, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వా విద్యాలయం, హైదరాబాద్. ఫోన్: 8008910925

Read More

రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి

నైరుతి రుతుపవన కాలంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరవు పరిస్థితులు రావచ్చన్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పశుపోషకులకు సూచనలు చేస్తూ ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు.
నీటివసతి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక, అధిక దిగుబడి వచ్చే పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా వచ్చే మేత లభ్యతను కొనసాగించాలి. పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత, ఖనిజ లవణ మిశ్రమాల పోషకాహారం అందించాలి. వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పశుగ్రాస సాగు చేపట్టాలి. అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వచేయాలి.

Read More

సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

4 మేక పిల్లలు…. ఒకే ఈతలో

సాధారణంగా మేకలు రెండు, మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధికి చెందిన అన్వర్ పెంచుకుంటున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను ఈనింది. దీంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. ‘చాలా అరుదుగా మాత్రమే ఇలా నాలుగు పిల్లలను పెడతాయి’ అని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. అందులో ఏదైనా మేక పిల్ల బలహీనంగా ఉంటే జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందన్నారు.

Read More