పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More

వర్షాకాల ఒత్తిడి పాల దిగుబడిపై ఎలా ప్రభావం చూపుతుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?

  1. అధిక తేమ ప్రభావం
    వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
  2. మేత వినియోగం తగ్గడం
    పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  3. తడి మరియు బురద వాతావరణం
    బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  4. వ్యాధుల పెరుగుదల
    వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది.
  5. పొదుగు వాపు వ్యాధి ప్రభావం
    వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు.
  6. పరాన్నజీవుల దాడి
    వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
  7. కలుషితమైన మేత
    వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది.
  8. తాగునీటి సమస్య
    వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు.
    కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.

వర్షాకాల ఒత్తిడి లక్షణాలు
రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు:

• పాల ఉత్పత్తి తగ్గడం
• మేత తక్కువగా తినడం
• నీరసం
• ఎక్కువసేపు నిలబడటం
• బరువు తగ్గడం
• పొదుగు సమస్యలు
• జ్వరాలు
• తరచుగా వ్యాధులు రావడం

రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు

  1. షెడ్ నిర్వహణ
    వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి
  2. పొడి పరుపు ఏర్పాటు
    పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు.
  3. పరిశుభ్రత పాటించాలి
    రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి
  4. పొదుగు వాపు వ్యాధి నివారణ
    పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。
  5. నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి
    వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి
  6. ఖనిజ మిశ్రమాలు
    పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్
    అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
  7. పరాన్నజీవుల నియంత్రణ
    క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి.
  8. టీకాలు వేయించాలి
    వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.

ముగింపు
వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.

డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి
పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834

Read More

ఔషధ మొక్క… ఉత్తరేణి

ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక ప్రదేశాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఉత్తరేణి నిలువుగా 2 మీ. ఎత్తు వరకు పెరిగే మొక్క. దీని కాండం మొదలులో కొయ్యలా తయారవుతుంది. ఆకులు చిన్నకాడలు కలిగి పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రిందివైపు లేత ఆకుపచ్చ రంగులోను ఉంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూవులు చిన్నవిగా, ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి. పూలు పెరిగిన కొద్దీ క్రిందికి వంగి కాండానికి దగ్గరగా వత్తుకుంటాయి. కాయలు పదునైన మొనలతో నారింజ రంగు నుండి ఎరుపు ఊదారంగులో ఉంటాయి.

సాధారణ నామం : చాఫ్ ఫ్లవర్ శాస్త్రీయ నామం : అకిరాంథస్ ఆస్పెర కుటుంబం: అమరాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వినాయక చవితి రోజు జరిపే గణేశ వ్రత పూజలో ఉపయోగించే 21 ఆకులలోఇది ఒకటి. ఈ మొక్క రసాన్ని గోడకు వేసే సున్నంలో ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.
  • ఉత్తరేణి భారతీయ సంస్కృతిలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. దీనిని పూర్వకాలం నుండి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు దీనిని గర్భస్రావానికి మందుగా ఉపయోగించేవారు.
  • ఉత్తరేణిని పశువుల వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆస్త్మా, దురదలు, హిస్టీరియా, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేర్లను క్యాన్సర్, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఉత్తరేణి ఇథైల్ ఎసిటేట్ ద్రావణం వంగ పంట నాశించి తీవ్ర నష్టం కలిగించే అక్షింతల పురుగు, హెనోసెపిలాక్నా విజింటియాక్టోపంక్టేటపై అత్యధిక యాంటిఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (జయశంకర్, అతని అనుచరులు, 2013).
  • తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, ఈశ్వర వేరు, అరిస్టొలోకియా బ్రాక్టియేట, అడవి ఆముదం (జట్రోఫాకర్కాస్), వేప, ఐలాంతాస్ ఎక్సెల్సా,తుమ్మి (ల్యూకాస్ ఆస్పెరా), జిల్లేడు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సహజ హెర్బల్ పురుగు మందు పంటలలో పురుగులు, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ హెర్బల్ మొక్కలన్నిటినీ ఎండబెట్టి పొడిచేసి ఆవుపేడ, ఆవు మూత్రంతో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. 1 లీ. పులిసిన ద్రావణాన్ని 20 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపింది (భగవాన్,అ తని అనుచరులు, 2008).
  • ఉత్తరేణి కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ కార్నియస్ శిలీంద్ర పెరుగుదలను 300 పిపియం వద్ద అరికట్టింది (మిశ్రా, అతని అనుచరులు, 1992).
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఆలుగడ్డ, వంగ పంటల ఆకులను తిని అధికంగా నష్టపరిచే హెనోస్ ఎపిలాక్న విగ్నింట యాక్టోపంక్టేటని నివారిస్తుంది (కుప్పుసామి ఎలుమలై, అతని అనుచరులు, 2014).
Read More

వివిధ పంటలపై ‘పంచగవ్య’ ప్రభావం

‘పంచ’ అంటే అయిదు. ‘గవ్య’ అంటే గోమాత నుండి లభించే పదార్థాలు. గోమాత నుండి లభించే ఐదు ఉత్పత్తులను – పాలు, పెరుగు, పేడ, మూత్రం, నెయ్యి – సరైన నిష్పత్తిలో కలిపి పులియబెడితే వచ్చే ఉత్పత్తినే “పంచగవ్య’ అంటారు. పంచగవ్య ఒక సమర్థవంతమైన సేంద్రియ ఎరువు. ఇది పురుగులకు వికర్షిణిగా పనిచేస్తుంది. పంచగవ్యపై జరిపిన అనేక అధ్యయనాలలో 3 శాతం ద్రావణం సమర్థవంతంగా మొక్కల పెరుగుదలకు, పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కాపాడటానికి పని చేస్తుందని తేలింది. వివిధ మొక్కలకు వివిధ నిష్పత్తులతో ప్రయోగాలు చేయవచ్చని సూచించబడింది.
పంచగవ్య మొక్కల పెరుగుదలకే కాకుండా, చీడపీడలకు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. దీనిని అన్ని రకముల మొక్కలపై వాడుకోవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్ఠం.

మామిడి : ఆ అధిక ఆడ పుష్పాలతో పూత సాంద్రతను పెంచుతుంది. ఆ పండ్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. క్రమం లేకుండా లేదా సంవత్సరం విడిచి సంవత్సరం పండ్లు ఏర్పడటం ఉండదు. ఆ గది ఉష్ణోగ్రత వద్ద పండ్ల నిల్వగుణాన్ని 12 రోజులు పెంచుతుంది. ఆ పండ్ల రుచి, వాసన అద్భుతం.

జామ : అధిక టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఆ పండ్ల నిల్వ గుణం 5 రోజులు పెరుగుతుంది.

పసుపు : దిగుబడులు 22% పెరుగుతాయి. ఆ అతి పొడవాటి చిల్ల కొమ్మలు. ఆ ¢డైనేజి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆ తల్లి, చిల్ల కొమ్మల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఆ పురుగులు, తెగుళ్ళను తగ్గించే తూనీగ, సాలీడులను వృద్ధి చేస్తుంది. ఆ తల్లి, విత్తన కొమ్మలకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ కుర్కుమిన్ పరిమాణాన్ని పెంచుతుంది.

నిమ్మ : సంవత్సరం పొడవునా పూత ఏర్పడేలా చేస్తుంది. ఆ పండ్లు పుష్టిగా, మంచి వాసన కల్గి ఉంటాయి. ఆ నిల్వ గుణం 10 రోజులు పెరుగుతుంది.

అరటి : సాగు నీటిలో కలిపి పారించడం, పిచికారి చేయడంతోపాటు 3% ద్రావణాన్ని (100 మి.లీ.) మగపూవుని తొలగించిన తర్వాత గెల చివర పాలిథిన్ సంచిలో పోసి కట్టాలి. గెల పరిమాణం ఒకే మాదిరిగా ఉంటుంది. గెల కోత సాధారణ పంటలలో కన్నా ఒక నెల ముందే జరుగుతుందని గమనించడమైనది. గెల పైభాగంలో, అడుగు భాగంలో వున్న హస్తాల పరిమాణం ఒకే మాదిరిగా వుంటుంది.

మల్లె : అరుదైన సువాసన, పరిమళం. ఆ మొగ్గ తొలుచు పురుగు ఆశించదు. ఆ సంవత్సరం పొడవునా పూత వస్తుంది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవు కడుపులో నుంచి బయటకు తీసిన పశువైద్యలు

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు ఇటీవల అస్వస్థతకు గురైంది. కడుపు బాగా ఉబ్బిపోయి, ఇబ్బందిపడుతుండటంతో పశువైద్యులకు చూపించారు. వైద్యులు పరీక్షించి ఆవు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారు. శుక్రవారం కోవెలకుంట్ల పశుసంవర్ధకశాఖ ఏడీ డా. కిశోర్ ఆధ్వర్యంలో వైద్యులు డా. నవీన్, డా. విజయానాయక్ శస్త్రచికిత్స చేసి దాని కడుపులోంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు.

Read More

తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More