పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More