క్రిమిసంహారిణిగా ‘పంచగవ్య’

పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.

పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు
ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో

తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.

Read More

‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More

ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి

గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

Read More