పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.

కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్

ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు
కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్‌ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.

మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు
A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు

వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.

ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
• మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి.
• వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి.
• వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి.
• విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు.
• రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
• వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి.
• వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి.
• అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.

ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.

ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్
భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435
ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301