ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల తయారీ, ప్రాముఖ్యత మరియు వినియోగం

ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం

ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:

  • నేల సారవంతత పెరుగుతుంది.
  • పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
  • నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • రసాయన అవశేషాలు తగ్గుతాయి.
  • ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
  1. జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి
    జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.
    తయారీకి కావలసిన పదార్థాలు
  • దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
  • ఆవు మూత్రం – 10 లీటర్లు
  • బెల్లం – 2 కిలోలు
  • శనగపిండి – 2 కిలోలు
  • పొలం మట్టి – 1 కిలో
  • నీరు – 200 లీటర్లు

ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
  • మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
  • పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
  • నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
  1. పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం

పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి.
ఉద్యాన పంటలపై ప్రభావం
పుష్పించే శాతం పెరుగుతుంది.

  • పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
  • పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
  • కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
    ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
  1. వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ

వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • కూరగాయలలో అధిక దిగుబడి.
  • పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
  • పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
  • మొక్కల వేర్ల అభివృద్ధి.
  1. వర్మివాష్

వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వినియోగం
5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.

  • నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
  • ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
  1. బీజామృతం
    ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు
  • విత్తన వ్యాధుల నివారణ.
  • మొలక శాతం పెరుగుదల.
  1. వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు
    ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    ప్రయోజనాలు
  • తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
  • పర్యావరణానికి హాని లేకపోవడం.
  • ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
  1. అగ్నాస్త్రం
    అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని.
    పదార్థాలు:
    • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు
    • వేపాకు పేస్ట్: 5 కిలోలు
    • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు
    • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు
    • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో

తయారీ విధానం:

  1. ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
  3. తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
  4. చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

  1. బ్రహ్మాస్త్రం.
    వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’.
    కావలసిన పదార్థాలు:
    • ఆవు మూత్రం: 20 లీటర్లు
    • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
  2. పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
  3. పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
  5. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి.
• ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు

  1. ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు
• చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు)
• నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి)
• ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది

తయారీ విధానం

  1. చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
  2. బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
  3. మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
  4. నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
  5. గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
  6. వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.

ఉపయోగించేపద్ధతి:
స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.
• మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు.
• సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.

ఉపయోగాలు
• మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
• ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి.
• పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది.
• నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  1. మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు
• పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ).
• ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు).
• త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు.
గుంత లేదా కుప్ప పద్ధతి

  1. స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
  2. మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
  3. రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
  4. పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
  5. పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి.
    • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు.
    • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి.
    • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

ఎరువు తయారీ సమయం
వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర

సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ముగింపు
ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.

డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని
డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291

Read More

ఆయిల్ పామ్ తోటలలో పరాగసంపర్కం చేసే వీవిల్స్ (ఎలైడోబియస్ కామెరూనికస్) విడుదల యొక్క విధి విధానాలు

పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.

కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్

ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు
కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్‌ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.

మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు
A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు

వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.

ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
• మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి.
• వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి.
• వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి.
• విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు.
• రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
• వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి.
• వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి.
• అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.

ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.

ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్
భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435
ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301

Read More

రెండు మూడు నెలలు ముందుకు ఖరీఫ్ సాగు

అన్ని రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉందని, ముందస్తు సాగు చేస్తే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని, ఖరీఫ్ సీజన్‌ను రెండు, మూడు నెలలు ముందుకు తెస్తున్నామని, దీనిపై రైతులకు శాసనసభ్యులు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ.. “క్లస్టర్ బేస్డ్ విధానంలో ఉద్యానపంటల సాగుకు ముందుకెళ్తున్నాం. వివిధ పంటల సాగుకు అనుగుణంగా జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. వ్యవసాయం నుంచి ఉద్యానసాగు వైపు రైతులు మళ్లితే లాభాలొస్తాయి. ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చినట్లే డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై అందిస్తాం. గతేడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.61 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.137 కోట్లు కేటాయించాం అని అన్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ ధరలు గత రెండేళ్లకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు సంబంధించి ప్రభుత్వం గత రెండేళ్లకు ధరలు నిర్ణయించింది. 2023-24 సంవత్సరానికి 2023 నవంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 వరకు ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో పర్సంటేజి(ఓఈఆర్‌) 19.17%, గింజలకు 10. 25% చొప్పున ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరంలో ఇదే కాలానికి (ఓఈఆర్‌)19.42%, గింజలకు 10.15% చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, సహకారశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డి-క్రిషి యాప్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్‌, మొబైల్‌ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More