ఎల్నినో ప్రభావం వలన పశుగ్రాస కొరత నానాటికీ పెరిగిపోతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాడిరంగం కునారిల్లుతోన్న ఈ పరిస్థితికి పాడి పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వలన చాలామంది పాడికి దూరం అవుతున్నారు. పశువుల దాణా, మేపు ఖర్చులు పెరగడం, పచ్చిమేత లభ్యత తగ్గడం, గ్రామాల్లో పశువైద్య సేవలు అరకొరగా ఉండటం, పాలకు గిట్టుబాటు ధర రాకపోవడం - ఇలా ఎన్నో కారణాల వలన పాల ఉత్పత్తి తగ్గుతున్న మాట వాస్తవం. గత 7 సం॥ల్లో 35% పాడి పశువులు తగ్గాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఉన్నా మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కన్నా తక్కువ ఉండవచ్చు.
3.7.26 ప్రకారం ఖరీఫ్ నాట్లు వరి (-15%), పల్లీ (-18%), సోయా (-65%), పత్తి (-28%) మాత్రమే నమోదయింది. ఈ ఆలస్యం ధాన్యం/నూనెగింజల ఉత్పత్తిపైనే కాక, ఎండుమేత, తవుడు, పత్తి చెక్కల లభ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, భారత ప్రభుత్వం 262 జిల్లాలను కరువు ప్రభావితంగా గుర్తించింది.
ఎన్డిడిబి అంచనా ప్రకారం, ఎండుమేత నిలువలు, అవసరమైనది 431 మిలియన్ మెట్రిక్ టన్నులు అయినా, 620 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు, పచ్చిమేత అవసరం 1140 మి.మె.ట. కాగా, 752 మి.మె.ట. ఉన్నట్లు, దాణా 32% కొరత ఉన్నట్లు గుర్తించింది.
దేశంలోని వాణిజ్యస్థాయి దాణా తయారీ, 14.5 మి.మె.ట. కాగా, ఈ వాతావరణ ప్రతికూలత వలన లభ్యత 5Ð10% తగ్గగలదని అంచనా.
మార్చి 26 నుండి జూన్ 26 వరకు చూస్తే, పచ్చిమేత ధరలు రూ. 3/80 నుండి రూ. 4/04 కి ఎగబాకగా, దాణాధరలు రూ.23.80 కిలో నుండి రూ.25.06 కి చేరింది. దాణా తయారీకి ముఖ్యమైన తవుడు ధరలు ఏకంగా 21% పెరిగాయి.
17 రాష్ట్రాల్లోని 262 కరువు ప్రభావిత జిల్లాల్లో పశు జనాభా ఇలా ఉంది.
పాలు ఇచ్చే పశువులు 31.19 మిలియన్లు
ఎండిపోయిన పశువులు 13.34 మిలియన్లు
దూడలు 37.16 మిలియన్లు
మొత్తం 81.70 మిలియన్లు
దీనికై, ఎండుమేత 1.1 మిలియన్ మె.ట., పచ్చిమేత 1.4 మి.మె.ట, దాణా 0.4 మి.మె.ట. గా ఉంటుంది. ముఖ్యంగా ఈ అవసరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిసా, బిహార్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉంది.
ఉపయోగంలోకిరాని దాణా తయారీ సామర్థ్యం వినియోగించి, 3.6 లక్షల టన్నుల అదనపు దాణా తయారీ చేపట్టి రాబోవు 3 నెలల్లో కరువు ప్రభావిత ప్రాంతాల పాడిరైతులకు అందుబాటులోకి తేవాలి.
ఎల్నినో ప్రభావం పాలఉత్పత్తిపైన కూడా ఉంటుంది. కాబట్టి, చల్లని వాతావరణంలో కృత్రిమ గర్భధారణ చేపట్టడం, శక్తివర్ధక దాణా సరఫరా ప్రోత్సహించాలి. ఏది ఏమైనా, పాడిపశువులకు పచ్చిమేత, ఎండుమేత, ఉత్పాదకత పెంపుదల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు మాగుడుగడ్డి తయారీ, టిఎంఆర్ వాడకం బాహుళ్యంలో తెచ్చినపుడే పాలఉత్పత్తి నిలకడగా ఉండగలదు. అంతేకాక, పాలధర పెంపుదల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకం, పశుగ్రాస పెంపకం కోసం పశుగ్రాస విత్తనాల సరఫరా, బీమా ప్రయోజనాలు విజయ డెయిరీ అందిస్తోంది. వీటితో పాడిరైతులు సహకార డెయిరీకి రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553
మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!
కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.
మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.
కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.
కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.
పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్హౌస్లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.
చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.
ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు.
ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.
కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు.
మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు.
కోతుల సంతాన నియంత్రణః కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.
అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు. ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!
అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.
పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.
ఆయిల్పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం
చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count) ఆయిల్పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది. • చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి. • దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి. • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique) ఆయిల్పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.
గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి? మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు. • నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి. • 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.
ఈ నియమాన్ని ఎలా పాటించాలి?
సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.
9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు • అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి. • ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది. • గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి. • సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.
గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి: • మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి. • పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది. • వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.
కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం కత్తిరించిన ఆయిల్పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు. • ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. • మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. • సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది. • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.
ముఖ్యమైన సూచనలు:
వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.
రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.
డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301
వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ: వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.
వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
మేత మరియు పోషకాహార నిర్వహణ: మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి.
ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
పరాన్నజీవుల (Worms) నియంత్రణ: పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం.
మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ: చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
Dr. Vaishnavi Polapelli, MVSc Scholar Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211
పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.
కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్
ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.
కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్ను విడుదల చేసే సాంకేతిక అంశాలు కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్తో కూడిన మగ పుష్పగుచ్ఛం.
కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.
మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు
వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.
ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.
గుర్తుంచుకోవలసిన విషయాలు • భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. • మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి. • వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి. • వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి. • విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు. • రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. • వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి. • వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి. • అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.
ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.
ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్ భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435 ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301
ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ‘ఎర్త్కాన్ ఎక్స్పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్ను 2027 నాటికి మార్కెట్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) లో మూడు సంస్థల మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. నార్మ్, ఎ-ఐడియా, భారత నూనె గింజల పరిశోధన సంస్థ(ఐఐవోఆర్)ల ప్రతినిధులు దీనిపై సంతకం చేశారు. దీని కింద ఎంపికైన అంకురాలకు ఈ 3 సంస్థలు సాయం అందిస్తాయి. నార్మ్ సంచాలకుడు, ఎ-ఐడియా అధ్యక్షుడు ఆరఎం సుందరం, ఐఐవోఆర్ సంచాలకుడు ఆర్కె మాథూర్, అంకుర సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కొన్నేళ్లుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రామికులకు రూ.20 లక్షలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. కాటన్పై అభిమానంతో తన ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఏటా కాటన్ జయంతికి వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించి, ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా యథావిధిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి, ఏళ్ల తరబడి తన వద్ద పనిచేస్తున్న పది కుటుంబాలకు రూ. రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు. రైతుల ప్రగతిలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.
ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.
జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైతులకు ఉచితంగా వంగడాలు కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.
బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.