ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ
ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.