లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు : మంత్రి తుమ్మల

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ
ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Read More

సహకార రంగాన్ని తెలంగాణాలో బలోపేతం చేస్తాం

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు

ధాన్యం అమ్మిన రైతుల చెల్లింపుల కోసం అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా వేసిన దశ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే వరకు జీరో పెండెన్సీ విధానాన్ని ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని వివరించారు. ధాన్యంతో వచ్చిన వాహనాలను రైస్ మిల్లులు వెంటనే అన్ లోడ్ చేసి, డిజిటల్ ఎక్‌నాలెడ్ౙ్‌మెంట్ ఇచ్చేలా చూడాలని జిల్లాల పౌరసరఫరాల అదికారులను కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు.

Read More

ప్రకృతి సేద్య రైతులకు ప్రయోజనం కలుగుతుంది

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలి

అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ అదికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో వర్షాల బీభత్సంపై ఆయన బుధవారం ఆ జిల్లాతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసు కురావాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మార్కెటింగ్ అదికారులను వెంటనే మంచిర్యాలకు వెళ్లాలని ఆదేశించారు.

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

తెలంగాణాలో సబ్సిడీపై పంట పొలాలకు సౌర విద్యుత్ కంచెలు

తెలంగాణలో అడవి జంతువుల వల్ల ఏటా 5 లక్షల ఎకరాల మేరకు పంట నష్టం వాటిల్లుతోంది. పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించే రైతుల పైనా అడవి పందులు, కోతులు దాడిచేసి గాయపరుస్తున్నాయి. గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా వంటి పథకాల్లోనూ జంతువుల ద్వారా జరిగే పంట నష్టాలకు పరిహారం లేదు. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ కంచెల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 50% సబ్సిడీతో పరికరాల కొనుగోలు సాయం అందించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వ్యవసాయ మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లో అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఐదువేల గ్రామాల్లో సౌరవిద్యుత్ కంచెలను ఏర్పాటు చేయించగా సత్ఫలితాలువచ్చాయి. దీంతో తెలంగాణ లోనూ సౌరవిద్యుత్ కంచెలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. కంచె వేయాల్సిన ప్రాంతం, పరిమాణాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

Read More

ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఆవు, గేదె జాతి పశువులకు వచ్చే నెల 29 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు తెలిపారు. తమ శాఖ సిబ్బంది పశు పోషకులు ఇళ్ల వద్దకే వెళ్లి ఈ టీకాలను ఉచితంగా అందజేస్తారని ప్రకటించారు. ఇందుకోసం 83.69 లక్షల డోసులను జిల్లాలకు సరఫరా చేశామని తెలిపారు.

Read More

రుణభారం తెలంగాణ రైతులకు తక్కువ

వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ ఎ. రాజా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు, ఏపీ లతో పోలిస్తే తెలంగాణలో రైతులకు రుణభారం తక్కువగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘2025 డిసెంబరు 31 నాటికి తమిళనాడు రైతులపై రూ.5,06,290.45 కోట్లు, ఏపీ రైతులపై రూ. 3,75,254. 59 కోట్లు, కర్ణాటక రైతులపై రూ.2,10,244.47 కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రైతులపై రూ.1,75,960. 56 కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు. రైతు రుణభారంపై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 2025 డిసెంబరు 31 నాటికి కటాఫ్ డేట్‌గా తీసుకొని ఈ వివరాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

Read More
  • 1
  • 2