అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.