ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More

పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రానికి వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయంలో రోబోటెక్ సేవలు

కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం చేసే రోబోలు వచ్చేశాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ రోబో చూడటానికి ఎద్దు మాదిరే ఉంది. భూములు దున్నేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. ఒక చిన్న సూట్‌కేస్ పెట్టి తీసుకెళ్లొచ్చు. పొలం లోకి వెళ్లి, ఆన్ చేసి పనిచేయించి.. మళ్లీ సూట్‌కేసులో పెట్టి తీసుకోచ్చేయొచ్చు. సాంకేతికత ఆ స్థితికి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. రోబో పని తీరు వీడియోను తన కార్యాలయంలో చూశానని తెలిపారు. దాన్ని మీకు షేర్ చేశానని.. చూశారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను అడిగారు. సాంకేతికత ఆ స్థాయికి వచ్చేసిందని, ఇక కూలీలు దొరకడం లేదని మీరు అనకూడదని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. అది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉందని రాజశేఖర్ అనడంతో.. సీఎం స్పందిస్తూ.. ఏఐ జెనరేటెడ్ అయ్యుండొచ్చేమో చూసుకోండి.. అదే అయితే ఐ డోంట్ మైండ్ అని నవ్వారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రోబోటిక్ సేవలు ప్రవేశిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

ప్రకృతి సేద్య రైతులకు ప్రయోజనం కలుగుతుంది

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

పీఎం ఆషా పథకం కింద మొక్కజొన్న రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే ఇది చాలా తక్కువ. రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి’ అని వివరించారు. ‘రాష్ట్రంలో 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. నాఫెడ్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి. జూన్ 2026 వరకు పథకాన్ని పొడిగించాలి’ అని సీఎం కోరారు.

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More

వచ్చే ఖరీఫ్ లో ఎల్ నినో ప్రభావం

సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఎల్నినో కారణంగా వచ్చే ఖరీఫ్ లో నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఆదేశించింది. ఎల్నినో పరిస్థితుల్ని అంచనా వేసి, అందుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపై అధికారులతో చర్చించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సాగుపై సూచనలు చేయాలని ఆదేశించారు. అయితే దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్లో రుతుపవనాలపై ఐఎండీ నివేదిక విడుదల చేయనుంది.
మే నుంచి జులై మధ్య లేదా ఆగస్టులో ఎల్నినో వచ్చే అవకాశం 50% నుంచి 61% పైనే ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అక్టోబరు వరకూ ఇది కొనసాగొచ్చని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరంగా సున్నిత రాష్ట్రం. వర్షాలపై ఆధారపడి అధిక శాతం పంటలు సాగవుతాయి. ఎలి నినో ఏర్పడితే రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా వర్షపాతం తగ్గుతుంది. పొడికాలాలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వర్షాధార పంటల ఉత్పత్తి తగ్గుతుంది. సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన రైతులు కొంతమేర బయటపడొచ్చు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

ఉల్లి రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలి

ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్‌ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్‌ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్‌ చైన్‌ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

Read More
  • 1
  • 2