ప్రకృతి సేద్య రైతులకు ప్రయోజనం కలుగుతుంది

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

ఏపీ మష్రూమ్ మిషన్‌కు కార్యాచరణ

ఆంధ్రరాష్ట్రంలో రూ. 12,960 కోట్లతో ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా 40% రాయితీ అందిస్తారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుట్టగొడుగులను కూడా వ్యవసాయ ఉత్పత్తిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏడాదికి లక్ష టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎం నిర్దేశించారు. రాయలసీమ ఉద్యానహబ్‌లో భాగంగా ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన వాతావరణానికి అనుకూలమైన మిల్కీ, వరి గడ్డి ఆధారిత రకాల నుంచి బటన్ మష్రూమ్ రకాల సాగును ప్రోత్సహిస్తారు. రోజుకు 10 టన్నుల సామర్థ్యంతో కూడిన యూనిట్లతో పాటు చిన్న యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ కింద ఏపీ మష్రూమ్ మిషన్ ద్వారా ప్రోత్సాహకాలిస్తారు. పుట్టగొడుగుల ఉత్పత్తిలో (ఏటా 45 వేల టన్నులతో) బిహార్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్త ఉత్పత్తిలో 11% ఆ రాష్ట్రానిదే. బటన్, ఆయిస్టర్, మిల్కీ రకాల సాగులో అగ్రస్థానంలో ఉంది. బిహార్ తర్వాత స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హరియాణ, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. దేశీయ ఉత్పత్తిలో వైట్‌బటన్ వాటా అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉంది. 2023-24 గణాంకాల ప్రకారం అక్కడ ఏడాదికి 16 వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది.

ఏపీ పుట్టగొడుగుల మిషన్
వార్షిక ఉత్పత్తి లక్ష్యం: 67,500 టన్నులు
అవసరమైన స్థలం: 81 కోట్ల చదరపు అడుగులు
యూనిట్ల సంఖ్య (ఒక్కోటి 5 వేల అడుగులు):1,62,000
మొత్తం పెట్టుబడి అంచనా: రూ. 12,960 కోట్లు
రాయితీ (40%): రూ. 5,184 కోట్లు
కేంద్రం వాటా (60%): రూ. 3,110 కోట్లు
రాష్ట్ర వాటా (40%): రూ. 2,074 కోట్లు

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More

క్వింటాకు 42 వేల రూపాయలు పలికిన ‘సింగిల్ పట్టి’ మిర్చి

తెలంగాణాలోని ములుగు జిల్లా పొట్లాపూర్ గ్రామానికి చెందిన కె. లింగమూర్తి అనే రైతు 7 బస్తాల సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా.. క్వింటాకు రూ.42 వేల ధర వచ్చింది. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రకం మిర్చి తక్కువ కారం ఉండి.. మంచి రంగు ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Read More

పంటల సాగుకు అందించే రుణ పరిమితి పెంపు

వివిధ రకాల పంటల రుణాల పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలు, అగ్రి, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ సమావేశమై 127 రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి సిఫార్సులు చేయగా.. రుణ పరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించింది.


వరి – రూ.48 వేలు, పత్తి – రూ.52 వేలు, మొక్కజొన్న – రూ.38 వేలు,
వేరుశనగ – రూ.34 వేలు, మిర్చి – 90 వేలు, చెరకు – 84 వేలు.

Read More

తెలంగాణలో మద్దతు ధరతో పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగయిన శనగ, మినుములు, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తులను మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్‌లో మాట్లాడగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 1.25 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనాలని. దీనికి సుమారు రూ. 894 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. కేంద్రం ఆమోదం లభించడంతో రాష్ట్రంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Read More

రైతు ఆదాయం పెంపు, విలువ జోడింపులే ప్రధాన లక్ష్యం

రైతు ఆదాయ పెంపు, విలువ జోడింపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడుతున్నట్లు, వచ్చే మూడేళ్లలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని అదనంగా ఉద్యాన పంటల సాగులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో బుధవారం ‘కృషి రోడ్ మ్యాప్’ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉద్యాన) డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్, పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు దీనికి హాజరయ్యారు. స్థూల విలువ జోడింపులో 15శాతం వృద్ధి సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కృషి రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని.. విలువ ఆధారిత పంటల సాగుతోపాటు కేంద్ర, రాష్ట్రాల సమన్వయం ఎంతో కీలకమని సంజయ్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా చెప్పారు.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More