ద్వితీయ వ్యవసాయం – రైతుకు అదనపు ఆదాయం అందించే బంగారు బాట

“పంట ఒక్కటే కాదు… పంటతో పాటు మరెన్నో ఆదాయ మార్గాలు ఉన్నాయి”

ఈరోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగా పంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండవు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.
ఇదే భావనతో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు శాస్త్రవేత్తలు “ద్వితీయ వ్యవసాయం (Secondary Agriculture)” అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.

ద్వితీయ వ్యవసాయం అంటే ఏమిటి?
పొలంలో పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను శుభ్రపరచడం, ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు.

సరళంగా చెప్పాలంటే…
“పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవడమే ద్వితీయ వ్యవసాయం.”

  1. పంటలకు విలువ జోడించండి – ఎక్కువ ధర పొందండి
    చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తారు. అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది.
    వరిని బియ్యంగా మార్చడం ,బియ్యంతో అటుకులు, మురమురాలు తయారు చేయడం ,వేరుశెనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం ,మిరపతో మిరప పొడి తయారు చేయడం ,పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం , మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం.దీనివల్ల రైతు సాధారణంగా పొందే ఆదాయం కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం అనేది ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన మరియు స్థిరమైన రంగం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే రైతులు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మహిళా సంఘాలు, యువ రైతులు, FPOలు మరియు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఇది ఉపాధి కల్పించడంతో పాటు, పోషకాహార భద్రతను మెరుగుపరచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అందువల్ల చిరుధాన్యాల విలువ జోడింపును ద్వితీయ వ్యవసాయం అభివృద్ధికి ఒక ప్రధాన వ్యూహంగా ప్రోత్సహించడం అవసరం.
  2. కోత అనంతర నష్టాలను తగ్గించండి
    భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కోత అనంతరం గణనీయమైన నష్టం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రైతులు ఈ చర్యలు పాటించాలి:
పంటను బాగా ఆరబెట్టాలి, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేయాలి ,తేమ రాకుండా నిల్వ చేయాలి, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ ఉపయోగించాలి, శుభ్రమైన సంచుల్లో ప్యాకింగ్ చేయాలి.

  1. గ్రామంలోనే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
    గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది.అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.
    చిన్న పరిశ్రమలు : రైస్ మిల్లు, నూనె గానుగ , పప్పు మిల్లు, పిండి మిల్లు , మసాలా తయారీ, పండ్ల ప్రాసెసింగ్
  2. పాల ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ ఆదాయం
    రైతు ఇంట్లో ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు ఆదాయం వస్తుంది.
    పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్
    తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది.పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి.
  3. తేనెటీగల పెంపకం – తేనెతో పాటు పంట దిగుబడీ పెరుగుతుంది
    తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు.
    దీని ద్వారా తేనె , బీస్‌వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి.
    అంతేకాదు, తేనెటీగలు పరాగసంపర్కం చేయడం వల్ల ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు, పండ్ల పంటల దిగుబడి బాగా పెరుగుతుంది.
  4. పుట్టగొడుగుల సాగు – చిన్న గదిలో పెద్ద ఆదాయం
    వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు.
    చిన్న గదిలోనే సాగు చేయవచ్చు.ఈ వ్యాపారం మహిళలకు, యువతకు , స్వయం సహాయక సంఘాలకు
    అత్యంత అనుకూలంగా ఉంటుంది.
  5. చేపల పెంపకం – నీటి వనరులతో అదనపు ఆదాయం
    వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్ పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు.
    వరి సాగుతో పాటు చేపల పెంపకం (Rice-Fish Farming) చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయం పొందవచ్చు.
  6. పశుపోషణ – రైతుకు నమ్మకమైన ఆదాయం
    వ్యవసాయం మరియు పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి.
    పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
    పశువుల పేడ : వర్మీకంపోస్ట్ ,బయోగ్యాస్ ,సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
  7. కోళ్ల పెంపకం – తక్కువ పెట్టుబడి, త్వరగా ఆదాయం
    పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బతింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. గుడ్లు, మాంసం సొంత అవసరాల వినియోగానికే కాకుండా అమ్మకాలతో ఆదాయం కూడా పొందవచ్చు. గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా మార్కెట్ ఉంటుంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు. గిరిరాజ, వనరాజ, గ్రామ ప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను పెంచుకోవచ్చు

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75-80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవ త్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

  1. వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చండి
    చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవశేషాలను కాల్చివేస్తారు.
    అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్ , కంపోస్ట్ ,బయోగ్యాస్ ,బయోచార్ ,పుట్టగొడుగుల సాగు , పశుగ్రాసం తయారు చేయవచ్చు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతుంది.
  2. పూలు, ఔషధ మొక్కలు – తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం
    మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
  3. నర్సరీలు మరియు విత్తన ఉత్పత్తి
    నాణ్యమైన నారు మొక్కలు, ధృవీకరించిన విత్తనాలకు రైతుల్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కూరగాయల నారు , పండ్ల మొక్కలు, పూల మొక్కలు ,అటవీ మొక్కలు తయారు చేసి విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

స్వపరాగసంపర్క పంటల్లో వరి , శనగ ,పెసర , మినుము ,ఉలవలు మరియు వేరుశెనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. ధృవీకరించిన విత్తన ఉత్పత్తి, శుభ్రపరచడం, గ్రేడింగ్, విత్తన శుద్ధి, ప్యాకింగ్, బ్రాండింగ్ వంటి విలువ జోడింపు చర్యలను చేపట్టడం ద్వారా రైతులు సాధారణ ధాన్యం విక్రయంతో పోలిస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది రైతుల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పెంపుకు మరియు నాణ్యమైన విత్తనాల లభ్యతకు ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది.

  1. అగ్రో టూరిజం – వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా మార్చండి
    ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభవించడానికి ఆసక్తి చూపుతున్నారు.
    రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు , గ్రామీణ ఆహారం ,పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  2. రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే అనుబంధ ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలు:
    టెర్రస్ వ్యవసాయం (Terrace Farming) : ఇళ్ల పైకప్పులపై (Terrace) కుండీలు, గ్రో బ్యాగులు, ట్రేలు లేదా ఎత్తైన బెడ్లలో కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, పూలు మరియు ఔషధ మొక్కలను సాగు చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం అంటారు. పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత ఉన్నప్పటికీ, పైకప్పు స్థలాన్ని సద్వినియోగం చేసుకొని తాజా, సురక్షితమైన మరియు రసాయన అవశేషాలు తక్కువగా ఉండే కూరగాయలను ఉత్పత్తి చేయవచ్చు. టెర్రస్‌లో పండించిన ఉత్పత్తులను సేంద్రియ కూరగాయలుగా విక్రయించడం, నారు మొక్కలు తయారు చేసి అమ్మడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, విలువ జోడింపు చేసి ప్యాకింగ్ చేయడం
    ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.

కిచెన్ గార్డెన్ (Kitchen Garden / పోషక తోట)
ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కలను పండించే తోటను కిచెన్ గార్డెన్ లేదా పోషక తోట అంటారు.
దీని ప్రధాన లక్ష్యం కుటుంబానికి ఏడాది పొడవునా తాజా పోషకాహారాన్ని అందించడం.

పండించే పంటలు : టమాట, వంకాయ, బెండ, మిరప, పాలకూర, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగ, బొప్పాయి

కిచెన్ గార్డెన్ ద్వారా ఉత్పత్తి చేసిన అదనపు కూరగాయలు, నారు మొక్కలు లేదా విత్తనాలను విక్రయించడం ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంట్లో తయారుచేసిన కంపోస్ట్, వర్మీకంపోస్ట్, జీవామృతం వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ పథకాల వినియోగం
రైతులు ఈ పథకాల ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు.
• ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)
• వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (Agriculture Infrastructure Fund)
• జాతీయ తేనెటీగల మరియు తేనె మిషన్
• డెయిరీ అభివృద్ధి పథకాలు
• NABARD గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు

నేటి వ్యవసాయ పరిస్థితుల్లో “పంట పండించడం మాత్రమే కాదు… పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం.” ద్వితీయ వ్యవసాయం ద్వారా రైతులు పంటలతో పాటు పాలు, తేనె, పుట్టగొడుగులు, చేపలు, కోళ్లు, సేంద్రియ ఎరువులు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు, నర్సరీలు వంటి అనేక ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబానికి సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ప్రతి రైతు తన వ్యవసాయానికి అనువైన కనీసం ఒకటి లేదా రెండు ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టి “ఉత్పత్తిదారుడు” నుండి “వ్యవసాయ పారిశ్రామికవేత్త”గా ఎదగడానికి కృషి చేయాలి.”వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

డా. కె.తేజస్వర రావు మరియు డా . బి. సహదేవ రెడ్డి
ఆచార్య N G రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయము

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

కోతులు… బాబోయ్… కోతులు

మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న  కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్‌లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!

కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.

మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.

కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.

కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.

పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్‌హౌస్‌లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.

ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును  పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు. 

ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్‌రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.

కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు. 

మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు. 

కోతుల సంతాన నియంత్రణః
కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.

అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్‌ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్‌ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు.  ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!

అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.

పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

డా. యం.వి.జి. అహోబలరావు, ఫోన్: 9393055611

Read More

తేనెటీగలు కుట్టకుండా కాపాడుకోవడం ఎలా?

వివిధ జాగ్రత్తలు తీసుకొనినప్పటికిని తేనెటీగలను పెంచుకునేవారు, తేనెటీగల కాట్లకు (stings) అలవాటు పడిపోతారు. అయినప్పటికిని, పరిశ్రమలోవున్న వారందరును, వీటినుండి తప్పించుకొనుట ఎలా అను విషయమును తెలుసుకొనవలెను. కొన్ని సామాన్య నియమములు వున్నవి. వీటిని పాటించి కనీసము, కుట్టు సమయములను తగ్గించుకొనవచ్చును.

• తేలిక రంగు, మృదువుగా గల వస్త్రములను ధరించుకొనవలెను. ఇలాంటి వస్త్రములు ధరించుకున్నపుడు కుట్టే అన్నికీటికములు కూడా తక్కువగా కుడతాయి.

• తలకు రాసుకునే హెయిర్ ఆయిల్, గడ్డము గీచుకున్న తరువాత వాడు లోషన్లు (after shaves) పరిమళాలు (perfumes) మరియు ఇతర ఇంపైన సువాసనలు (sweet smellings) వెదజల్లు పదార్ధములను వాడరాదు. ఇవి కుట్టే కీటకములను ఆకర్షిస్తాయి. తీయటి వాసనలుగల, సువాసనలు వెదజల్లు పుష్పములమీద ఆహారము సేకరించుకునే కీటకములు, పరిమళములు పూసుకున్న వ్యక్తి వద్దకు పొరపాటున ఆహారమూలమని (food) ఆకర్షించబడతాయి.

• ప్రతిదినము స్నానము చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించవలెను. కుట్టేకీటకములకు చెమట, చికాకును కల్గిస్తుంది. తేనెటీగల పెంపకదారులు గమనించినదేమనగా తేనెటీగలు చాల తరచుగా, చెమటతో నిండిన చేతిగడియారము ప్రాంతములో కుట్టడము.

• శరీరమును సాధ్యమైనంత పూర్తిగా కప్పుకొనవలెను. పొలములో నడిచేటపుడు మోకాళ్ళ వరకు వుండే బూట్లు ధరించడము మంచిది. లేక తెలుపు కాటన్ సాక్సులు ధరించవలెను. తలను, వెంట్రుకలను గడ్డిటోపీతో (straw hat) లేక తేలికరంగులో వున్న చేతి రుమాలుతో కప్పుకొనవలెను. ఇలా చేసినట్లయితే కుట్టే తేనెటీగలు తలవెంట్రుకలలో చిక్కుకొనకుండా ఆపుచేయవచ్చును.

• వెచ్చని దినములలో కొత్త స్థలములో కూర్చొని, భూమిమీద మరియు చెట్లపైన కందిరీగల గూళ్ళు వున్నవేమోనని, ఎగురుచున్న కందిరీగలను గమనించవలెను. వసంత కాలములో సాంఘిక జీవనము చేయు కందిరీగలు వాటి గూళ్ళను కట్టుకుంటాయి. వర్షానంతరము కల్లా ఒకేఒక అడకీటకము ప్రారంభించిన గూటిలో అనేక వేల కందిరీగలు వుండవచ్చును. సంఖ్య పెరిగేకొలది ఎగిరే కీటకముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కసారి వెచ్చని వాతావరణము వచ్చిన తోడనే పెద్దసంఖ్యలో కందిరీగలను కనిపెట్టవచ్చును. మరియు నాశనము చేయవచ్చును.

• వదిలివేయబడిన ఆహారమును, చెత్తను తొలగించవలెను. లేనిచో కందిరీగలు వాటిని ఆహారముగా తీసుకుంటాయి. అనేక సాంఘిక జీవనము చేయు కందిరీగలు పట్టణాలలో నివసిస్తాయి. వయోజన కందిరీగలు, సోడా, పాలు, జామ్ మొదలగువాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఇవి రొట్టెను, ఇతర వదిలివేయబడిన ఆహారములను వాటి లద్దెపురుగుల కొరకు సేకరించుకుంటాయి.

• ఒక వ్యక్తి అనేక కుట్టే కీటకములచే ఒకేసారి దాడిచేయబడినప్పుడు పరుగెత్తవలెను. ఒక పట్టును కలవరపరచినపుడు లేక విరుగగొట్టిన సమయములో మాత్రమే ఇలాంటి దాడి మనుషుల మీద వుంటుంది. తలుపులు మూసివున్నగదిలోనికి గాని లేక ఇతర ఏస్థలము కనబడని పక్షములో నీటిలోనికి దుమకవలెను. అవకాశముంటే బహిరంగస్థలముకంటే గూడ నీడగల ప్రదేశములోనికి పరుగెత్తుట ఉత్తమము. కోపముతో నిండిన కుట్టే కీటకములకు పొదలలోగాని అరణ్యములోనికిగాని వెంటబడి తరుముట కష్టము.

• ఒకే ఒక కుట్టే కీటకము వెంబడిస్తూ వున్నట్లయితే మఖమును క్రిందకు పెట్టుకొని నేలమీద పడుకొనవలెను. కందిరీగలు మరియు తేనెటీగలు కళ్ళు, ముక్కు మరియు చెవుల చుట్టూ కుట్టడానికి ఎక్కువ అవకాశములుంటాయి. ఎందుకనగా వీటిని కదులుతూ లేక కదులుతూవున్న ఛాయచిత్ర రూపములుగా తేనెటీగలు కనుగొంటాయి.

• కారు అద్దం గుండా కుట్టే ఈగ ప్రవేశించినట్లయితే కారును ఆపుచేయవలెను. కందిరీగగాని లేదా తేనెటీగ గాని, కదిలే కారులోనికి ప్రవేశిస్తే, అది కుట్టడం కన్నా, కారు నుండి తప్పించుకొనడానికే ప్రయత్నిస్తుంది. అలాంటపుడు కారును నెమ్మదిగా ఆపి, రోడ్డు మార్జిన్లో దించి, సాధ్యమైనంతవరకు కదలకుండా వుండవలెను. కారును ఆపిన తరువాత అన్ని అద్దాలను తెరవవలెను. ఆ కీటకము త్వరగా తప్పించుకొనుటకు మార్గమును కనుగొంటుంది.

First aid for bee stings – తేనెటీగల కాటుకు ప్రాధమిక చికిత్స
ఒక కూలిఈగ కుట్టినపుడు, దాని యొక్క ఉదరపు (tip of the abdomen) కొన తన మిగతా శరీరభాగములకు సమాంతరముగా ఉండి తన శత్రువును కుట్టినపుడు ముల్లు (sting) యొక్క పొడవులో కనీసము సగభాగము, శత్రువు శరీరములోనికి దించి తిరిగి వెనుకకు లాగుకుంటుంది. భౌతికముగా ముల్లు శరీరంలోకి దిగినందు వలన మరియు తేనెటీగలో ఉన్న విషం వలన నొప్పి వెను వెంటనే కలుగుతుంది.

ప్రాధమిక చికిత్సలో భాగముగా శరీరము నుండి ముల్లును వెంటనే తీసి వేయవలెను. ఎక్కువ మంది తేనెటీగల పెంపకము దారులు ముల్లును శరీరము నుండి వదిలించు కొనుటకుగాను, హైవ్ టూల్ లేదా గోటితో తీసివేస్తుంటారు. కొంత సమయం తీసుకొని కత్తికొరకు వెదకి ముల్లును తీసివేయుట కొరకు సమయాన్ని వృధా చేయడం అనవసరము. తేనెటీగలను పట్టుకొని బలవంతముగా ముల్లును బయటకు లాగి గోరుమీద ఉంచినట్లయితే విషమంతా వెంటనే వేగముగా దాదాపు బయటకు రావడము కన్పిస్తుంది. తేనెటీగ విషము అనేక సంక్లిష్ట పదార్దములు అనగా నొప్పిని, వాపును మరియు దురదను, అనేక దినముల వరకు కలుగజేయు విధముగా రూపొందించబడింది. ఒక్కసారి విషము శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని తొలగించు మార్గము లేదు, విషప్రభావమును తొలగించు పదార్ధములు గాని విరుగుడు గాని లేదు. ప్రాధమిక చికిత్సలో భాగముగా, శరీరంలో కలిగే నొప్పిని ఉపశమనం పొందుటకును గాయమునకు సూక్ష్మజీవులు సంక్రమించకుండా (Infection) గురికాకుండా చేసికొనవలెను.

తేనెటీగ కుట్టినపుడు మంచుగడ్డ (ice)ను ఆ భాగము మీద ఉంచినట్లయితే బాగా ఉపశమనము పొందవచ్చును, ఇతర ఏ రకమైన చికిత్సల కంటే కూడ, ఆల్కహాల్ ను రుద్దడము ద్వారా ఆల్కహాలు ఆవిరయ్యి చల్లదనమును శరీరము మీద కలుగజేస్తుంది. దీనిని కూడా ప్రాధమిక చికిత్సలో భాగంగా చెప్పుకొనవచ్చును. వ్యాపార పరంగా తేనెటీగలను పెంచుకొనువారికి దాదాపుగా ప్రతిరోజు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి. వారు తేనెటీగల విషానికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటారు.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.

Read More

అధిక పోషక పదార్థాలు గల ‘నాడెప్ కంపోస్ట్

నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.

కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.

కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :

  • పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
  • పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
  • జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
  • నీరు – 1350-1400 లీ.
    కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
  • మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
  • రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
  • మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.

పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.

కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Read More

‘ఎల్ నినో’ ముప్పు: వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లు – నివారణ చర్యలు

ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:

  1. El Niño (వేడి దశ),
  2. La Niña (చల్లని దశ) మరియు
  3. Neutral (సాధారణ స్థితి).

ఎల్ నినో లక్షణాలు:
• సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ)
• గాలుల నమూనాలలో మార్పులు
• వర్షపాత నమూనాలలో మార్పులు
• దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు
• ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు

ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే).
భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు

భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.

  1. వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
  2. పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
  3. నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
  4. కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

నివారణ చర్యలు

  1. కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
  2. నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
  3. సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
  4. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
  5. పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.

రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు
జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:

వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం
• నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది.
• విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు.
• కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
• భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

సారాంశం
ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)

Read More

వర్షాకాల ఒత్తిడి పాల దిగుబడిపై ఎలా ప్రభావం చూపుతుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?

  1. అధిక తేమ ప్రభావం
    వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
  2. మేత వినియోగం తగ్గడం
    పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  3. తడి మరియు బురద వాతావరణం
    బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
  4. వ్యాధుల పెరుగుదల
    వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది.
  5. పొదుగు వాపు వ్యాధి ప్రభావం
    వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు.
  6. పరాన్నజీవుల దాడి
    వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
  7. కలుషితమైన మేత
    వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది.
  8. తాగునీటి సమస్య
    వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు.
    కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.

వర్షాకాల ఒత్తిడి లక్షణాలు
రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు:

• పాల ఉత్పత్తి తగ్గడం
• మేత తక్కువగా తినడం
• నీరసం
• ఎక్కువసేపు నిలబడటం
• బరువు తగ్గడం
• పొదుగు సమస్యలు
• జ్వరాలు
• తరచుగా వ్యాధులు రావడం

రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు

  1. షెడ్ నిర్వహణ
    వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి
  2. పొడి పరుపు ఏర్పాటు
    పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు.
  3. పరిశుభ్రత పాటించాలి
    రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి
  4. పొదుగు వాపు వ్యాధి నివారణ
    పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。
  5. నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి
    వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి
  6. ఖనిజ మిశ్రమాలు
    పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్
    అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
  7. పరాన్నజీవుల నియంత్రణ
    క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి.
  8. టీకాలు వేయించాలి
    వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.

ముగింపు
వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.

డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి
పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834

Read More

ఆయిల్ పామ్ తోటలలో పరాగసంపర్కం చేసే వీవిల్స్ (ఎలైడోబియస్ కామెరూనికస్) విడుదల యొక్క విధి విధానాలు

పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.

కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్

ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు
కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్‌ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.

మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు
A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు

వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.

ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
• మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి.
• వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి.
• వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి.
• విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు.
• రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
• వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి.
• వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి.
• అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.

ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.

ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్
భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435
ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301

Read More