సస్యరక్షణ : పురుగుల నివారణ : బోగన్ విల్లియా ఆకులలో ఉన్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశినిగాను, వికర్షిణిగాను పనిచేస్తాయి. బోగన్ విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను, పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్‌ని నివారిస్తాయి. బోగన్‌విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంటనాశించే రసంపీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తుంది.

తెగుళ్ళ నివారణ : బోగన్‌విల్లియా ఆకుల కషాయం పసుపు, పెసర వంటి పంటలనాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.

కషాయం తయారు చేసే విధానం :
కావలసిన పదార్థాలు : కలబంద ఆకులు – 1 కి.; బోగన్‌విల్లియా ఆకులు – 1కి.; బొప్పాయి ఆకులు – 1 కి.; పసుపుపొడి – 200 గ్రా.

పైన సూచించిన ఆకులను పై మోతాదులో తీసుకుని బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపుపొడిని కలిపి పొయ్యిపై పెట్టి, సన్నని సెగతో ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీ. నీరు కలిపి నిల్వ ఉంచకుండా వెంటనే ఒక ఎకరం పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
పంటకాలంలో పంట దశ, తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.