ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

ఔషధ మొక్క…. కర్పూరం

కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.

సాధారణ నామం
క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్
శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర
కుటుంబం: లారేసి²

ఉపయోగాలు : ఔషధ రంగంలో …

  • ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్‌ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
  • సిన్న మోమం క్యాంఫొరా వెరైటి లినలూలిఫెరా, సిన్నమోమం క్యాంఫొరావెరైటి హోస్యో ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్స్ సైటోఫిలస్ జియామెయిస్‌పై ప్రయోగశాలలోను, మినిసైలోస్‌లోను వికర్షక చర్యను ప్రదర్శించాయి (కాన్సియన్, అతని అనుచరులు, 2015).
  • కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్‌లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
  • కర్పూర్ పొడి, ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం గ్రానేరియం, ట్రైబోలియం కాస్టానియంపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (నెనా అండ్ ఇబ్రహీం)
  • కర్పూర్ ఆకుల (100-300) పొడి నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ రోడిసియానస్ గుడ్లు పెట్టడాన్ని నిరోధించడం, గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గించాయి (రాజపాక్సె అండ్ వాన్‌మ్డెన్, 1997)
  • కర్పూర్ ఆకుల (10-50) పొడి నిల్వ ధాన్యం లోపల లార్వా, ప్యూపా బ్రతికి ఉండటం తగ్గించాయి (ధర్మసేన, అతని అనుచరులు, 1998).
  • కర్పూర్ మిథనాలిన్ ద్రావణాలు పీచ్‌పండు ఈగ బాక్ట్రోసిరా జోనేట ఆడ పురుగులను అదికంగా చంపాయి (సైరాఖాన్, అతని అనుచరులు, 2016).
  • సిన్నమోమం జీలానికం, సిన్నమోమం బుర్మాన్ని, సిన్నమోమం ఇనర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్టెమియ సలిన లార్వాలను అరికట్టాయి (నూర్ ఫెసిహ ఒంటిహసన్, 2011).
  • కర్పూర్ క్ౙెåలం ద్రావణాలు కోరియోలస్ వెర్సికలర్, గ్లియోఫిల్లం ట్రాబియం శిలీంద్రాలపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (లి, అతని అనుచరులు, 2014).
  • సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
  • రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… పంచ కజ్జాయం

చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడే ఎండుకొబ్బరి పొడి కోసం ఎండుకొబ్బరి చిప్పను తురిమి తయారుచేసేవారు. ఇప్పుడు ఇంకా సులభంగా చేసుకోవాలంటే ఎండుకొబ్బరి పొడి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దానితో కూడా చేసుకోవచ్చు.

తయారుచేయు విధానం: అన్ని ఒక బౌల్‌లో ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. పంచ కజ్ౙాయం తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • ఎండుకొబ్బరి తురుము లేదా పొడి – కావలసినంత.
  • చక్కెర – రుచికి తగినంత (నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది)
  • డ్రైఫ్రూట్స్-జీడిపప్పు, బాదం పప్పు వేశాను. (ఎన్ని రకాలు కావాలన్నా వేసుకోవచ్చు.)
  • యాలకుల పొడి – పదార్ధానికి తగినంత.
  • పచ్ౘ్కర్పూరం – చాలా చాలా కొంచెం.

రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్ : 9676797777 కు సంప్రదించండి.

Read More

పశువుల్లో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్)

దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణనష్టం అంతగా ఉండదు. ఎద్దులు వ్యవసాయ పనులు సరిగా చేయవు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధి ఎలా వస్తుంది?
వ్యాధి సోకిన ఆవులు, గేదెల పాలద్వారా దూడలకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

  • జ్వర తీవ్రత 104-106 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరిగి పశువులు నీరసించి పోతాయి.
  • పశువుల నోటిలో, చిగుళ్ళపై పొక్కులు ఏర్పడటం చేత పశువుల మేత, నీరు తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుండి చొంగకారుతూ ఉంటుంది.
  • నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 3, 4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మము గరుకుగా తయారవుతుంది.
  • పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
  • గిట్టలలో పుండ్లు ఏర్పడటం వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.
  • పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
  • వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను, గడ్డితో కాల్చివేయాలి.
  • చనిపోయిన పశువును, సున్నపు గోతిలో పూడ్చాలి
  • వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు త్రాగించకూడదు.
  • మార్చి – ఏప్రిల్ మరియు ఆగస్టు – సెప్టెంబరు మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

చికిత్స:

  • కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా నీమ్‌లెంట్, వేపనూనె పూయాలి.
  • నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి.
  • డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.

కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150

Read More

కీటకాల నాశిని… బోగన్‌విల్లియా ఆకుల కషాయం

సస్యరక్షణ : పురుగుల నివారణ : బోగన్ విల్లియా ఆకులలో ఉన్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశినిగాను, వికర్షిణిగాను పనిచేస్తాయి. బోగన్ విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను, పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్‌ని నివారిస్తాయి. బోగన్‌విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంటనాశించే రసంపీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తుంది.

తెగుళ్ళ నివారణ : బోగన్‌విల్లియా ఆకుల కషాయం పసుపు, పెసర వంటి పంటలనాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.

కషాయం తయారు చేసే విధానం :
కావలసిన పదార్థాలు : కలబంద ఆకులు – 1 కి.; బోగన్‌విల్లియా ఆకులు – 1కి.; బొప్పాయి ఆకులు – 1 కి.; పసుపుపొడి – 200 గ్రా.

పైన సూచించిన ఆకులను పై మోతాదులో తీసుకుని బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపుపొడిని కలిపి పొయ్యిపై పెట్టి, సన్నని సెగతో ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీ. నీరు కలిపి నిల్వ ఉంచకుండా వెంటనే ఒక ఎకరం పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
పంటకాలంలో పంట దశ, తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.

Read More

ఔషధ మొక్క… రాచ ఉసిరి

ఇది 4-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చిన్న చెట్టు. కొమ్మలు నిటారుగా చెట్టు అగ్రభాగంలో వస్తాయి. కాయలు నక్షత్రం ఆకారంలో ఉండి పుల్లగా ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. సంవత్సరంలో రెండుసార్లు (ఏప్రిల్-మే మరియు ఆగస్టు-సెప్టెంబరు) కాపు తీసుకోవచ్చు.

సాధారణ నామం : కంట్రిగూస్‌బెర్రి / స్టార్‌గూస్‌బెర్రి శాస్త్రీయ నామం : సిక్కా అసిడ కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దీనిలో కాయలు ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది.
  • ఇవి కామెర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రాచ ఉసిరిలో గ్లెåకోసైడ్, టానిన్, రెసిన్ వంటి రసాయనాలుంటాయి. దీని ద్రావణం బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ మెగాథీరియం, స్టెపైలోకోకస్‌టైఫి, స్టెఫైలోకోకస్ డీసెంటిరియేలపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (రెహ్మాన్, అతని అనుచరులు, 2011).
  • రాచ ఉసిరి ద్రావణం పైన్ వుడ్ నెమటోడ్, బర్సాఫెలెంకస్ క్ౙెåలోఫిలస్‌లపై బలమైన యాంటినెమటోడల్ చర్యను ప్రదర్శించింది (మకీన్, అతని అనుచరులు, 1997).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వాతావరణ మార్పులు – రైతుల సాగు విధానాల్లో మార్పులు అవసరం

వ్యవసాయం ప్రకృతిపై అత్యధికంగా ఆధారపడే రంగం. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ, సూర్యకాంతి వంటి వాతావరణ అంశాల్లో స్వల్ప మార్పులు కూడా పంటల పెరుగుదల, పుష్పించడం, కాయలు ఏర్పడడం, దిగుబడి మరియు నాణ్యతపై ప్రభావం చూపుతాయి. ఇటీవలి సంవత్సరాల్లో అకాల వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, తక్కువ వ్యవధిలో అధిక వర్షపాతం, వర్షాల విరామాలు వంటి వాతావరణ అస్థిరతలు వ్యవసాయంలో సవాళ్లను పెంచుతున్నాయి.

ఎల్‌నినో (El Niño) లాంటి పరిస్తితులు కూడా కొన్ని సంవత్సరాల్లో వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపి, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, ఎల్‌నినో ఒక్కటే ప్రతి ప్రాంతంలో ఒకే విధమైన వర్షాభావానికి కారణమవుతుందని భావించకూడదు. స్థానిక వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల   వ్యవస్థ, నేల స్వభావం, పంట కాలం మరియు సాగు విధానాలు కూడా పంటలపై ప్రభావం చూపుతాయి.

అందువల్ల “వాతావరణం మారినప్పుడు వ్యవసాయ విధానం కూడా మారాలి” అనే దృక్పథంతో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలి. వాతావరణ మార్పులను పూర్తిగా నియంత్రించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు (Climate-resilient agriculture) అవలంబించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు.

వాతావరణ మార్పులు పంటలపై ఎలా ప్రభావం చూపుతాయి?
పంటల పెరుగుదలలో ప్రతి దశకు నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు తేమ అవసరం. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడినప్పుడు మొక్కలలో ఆవిరిపోతనం (భాస్పోత్సేకం) మరియు నేల నుండి నీరు ఆవిరి అవ్వడం పెరుగుతుంది. ఫలితంగా నేలలోని నీరు వేగంగా తగ్గిపోతుంది. నీటి కొరత ఏర్పడినప్పుడు మొక్కలు తమ రంధ్రాలను మూసుకోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి, మొక్కల పెరుగుదల మందగిస్తుంది.

పుష్పించే దశలో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడితే పుష్పాలు రాలిపోవడం, పుప్పొడి జీవనశక్తి తగ్గడం, ఫలదీకరణలో అంతరాయం ఏర్పడటం వల్ల కాయధారణ మరియు గింజల సంఖ్య తగ్గవచ్చు. ముఖ్యంగా పుష్పించే మరియు గింజ పోసుకునే దశల్లో ఏర్పడే ఉష్ణోగ్రత ఒత్తిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే నేల కోత, నీటి నిల్వ, పోషకాలు కొట్టుకుపోవడం, వేర్లకు ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికి విరుద్ధంగా వర్షాల మధ్య ఎక్కువ విరామం ఏర్పడితే మట్టిలో తేమ కొరత (moisture stress) ఏర్పడి పంట పెరుగుదల దెబ్బతింటుంది. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో “ఎక్కువ నీరు వచ్చినప్పుడు సంరక్షించడం, తక్కువ నీరు వచ్చినప్పుడు సమర్థంగా వినియోగించడం” అనే రెండు వ్యూహాలు రైతులకు అత్యంత ముఖ్యమైనవి.

రైతుల సాగు విధానాల్లో చేయాల్సిన ముఖ్యమైన మార్పులు

  1. వాతావరణ ఆధారిత పంటల ప్రణాళిక
    విత్తనాలు వేయడానికి ముందు స్థానిక వాతావరణ సూచనలు, వర్షపాత అంచనాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/వ్యవసాయ శాఖలు అందించే వ్యవసాయ వాతావరణ సలహా సేవలను రైతులు పరిశీలించాలి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైతే వెంటనే సాధారణ పంటలనే వేయకుండా తక్కువ కాలంలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం కలిగిన పంటలు లేదా రకాలను ఎంపిక చేయడం మంచిది.

పంటల ఎంపికలో ప్రధానంగా:

  • తక్కువ కాల పరిమితి గల రకాలు
  • బెట్టను తట్టుకునే రకాలు
  • స్థానిక వాతావరణానికి అనుకూలమైన రకాలు
  • తక్కువ నీటి అవసరమున్న పంటలు
  • మిశ్రమ మరియు అంతర పంటలు ……….వంటి విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  1. నేలలో తేమను సంరక్షించాలి
    వాతావరణ మార్పుల సమయంలో నేలలో తేమ సంరక్షణ పంట ఉత్పాదకతకు కీలకం. వర్షం పడిన వెంటనే నీరు పొలాన్ని వదిలి వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు నీరు నేలలోకి చొచ్చుకుపోయేలా చర్యలు చేపట్టాలి. దీనికి:
  • పంట అవశేషాలను నేలపై ఉంచడం
  • మల్చింగ్ చేయడం
  • పొలంలో చిన్న కట్టలు/బండ్లు ఏర్పాటు చేయడం
  • కాంటూర్ బండింగ్
  • అవసరమైన ప్రాంతాల్లో వేసవి లోతు దుక్కులు చేపట్టడం
  • సేంద్రియ పదార్థాలు వేసి నేలను గుల్లబర్చడం
  • తక్కువ దుక్కి లేదా సంరక్షణ వ్యవసాయ పద్ధతులు వంటివి ఉపయోగపడతాయి.

పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం లేదా ఉపరితలంపై మల్చ్‌గా ఉపయోగించడం వల్ల నేల ఉష్ణోగ్రతల తీవ్ర మార్పులు తగ్గడంతో పాటు, నేల తేమ ఆవిరైపోవడం తగ్గుతుంది. దానితో పాటు కలుపు మొలకెత్తకుండా చూసుకోవచ్చు.

  1. నేల సారాన్ని పెంచడం – వాతావరణ ప్రతిఘటనకు పునాది
    సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల నేలలో సేంద్రియ కార్బన్ (Soil Organic Carbon) పెంపు వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కొనే ముఖ్యమైన వ్యూహం. పంట అవశేషాలు, పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, గొర్రెలు ఆపడం, పంటల అవశేషాల నిర్వహణ వంటి పద్ధతులను అవలంబించాలి.

అయితే కేవలం సేంద్రియ ఎరువులపైనే ఆధారపడకుండా సమీకృత పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) పాటించాలి. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అవసరమైన సూక్ష్మపోషకాలను సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా పొటాషియం మొక్కల నీటి సమతుల్యత, కణాల దృఢత్వం మరియు వివిధ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేల పరీక్ష ఆధారంగా పొటాషియం లోపం ఉన్న నేలల్లో తగిన మోతాదులో పొటాషియం ఎరువులు అందించడం ప్రయోజనకరం. కొన్ని నేలల్లో పోటాష్ ఎక్కువగా ఉన్నప్పటికీ మొక్కకు అందుబాటులోకి రాదు. ఇలాంటి పరిస్థితులలో పోటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా వంటివి ఉపయోగకరంగా ఉంటాయి.

  1. నీటి యాజమాన్యంలో మార్పులు
    వాతావరణ మార్పుల పరిస్థితుల్లో నీటిని అపరిమితంగా ఉపయోగించే సాగు విధానాలకు బదులుగా “More crop per drop” సూత్రాన్ని అనుసరించాలి.

సాధ్యమైన చోట:

  • డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతులు
  • పంట అవసరానికి అనుగుణంగా నీటిపారుదల
  • ఉదయం లేదా సాయంత్రం నీటి వినియోగం
  • నేల తేమ ఆధారంగా నీటి నిర్ణయం
  • పొలంలో వర్షపు నీటి సంరక్షణ పద్దతులైన కాంటూర్ గట్లు చేపట్టాలి.
    నీటి కొరత ఉన్న సమయంలో పంటకు అత్యంత కీలకమైన పుష్పించే, కాయఏర్పడే దశ మరియు గింజ నిండే దశల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతతో వినియోగించాలి.
  1. పంటల వైవిధ్యీకరణ – ఒకే పంటపై ఆధారపడకండి
    వాతావరణ అనిశ్చితి పెరిగినప్పుడు ఒకే పంటపై ఆధారపడటం రైతుకు అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల పంటల వైవిధ్యీకరణ (Crop diversification) అవసరం. ధాన్య పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు మరియు స్థానికంగా అనుకూలమైన పంటలను పంటల ప్రణాళికలో చేర్చాలి.
    ఉదాహరణకు వర్షాధార ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము వంటి పంటలు పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే అంతర పంటలు (Intercropping) కూడా ప్రతికూల వాతావరణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక పంట ప్రతికూల వాతావరణంతో నష్టపోయినా, మరో పంట ద్వారా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
  2. ఎరువుల వినియోగంలో సమతుల్యత
    వాతావరణ ఒత్తిడి సమయంలో అధిక నత్రజని వినియోగం ఎల్లప్పుడూ ప్రయోజనకరం కాదు. అధిక నత్రజని వల్ల మృదువైన, అధిక శాఖీయ పెరుగుదల ఏర్పడి, కొన్ని పరిస్థితుల్లో నీటి ఒత్తిడి మరియు పురుగు/తెగుళ్ల సమస్యలకు పంట సున్నితంగా మారవచ్చు. అందువల్ల నేల పరీక్ష ఆధారిత సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి.

వర్షాభావం ఉన్నప్పుడు నేలలో తగిన తేమ లేకుండా అధిక మోతాదులో ఎరువులు వేయడం నివారించాలి. తేమ అందుబాటులో ఉన్న సమయంలో సిఫార్సు చేసిన విధంగా ఎరువులను అందించాలి. అవసరాన్ని బట్టి శాస్త్రీయంగా సిఫార్సు చేసిన పంట పైన పోషక ద్రావణాలను కూడా పిచికారి చేసుకోవచ్చు. అయితే పంట, దశ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే వాటిని ఉపయోగించాలి.

  1. అధిక ఉష్ణోగ్రతల సమయంలో పంట రక్షణ
    ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు పంటలో నీటి నష్టం వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో:
    మల్చింగ్ + నేల తేమ సంరక్షణ + సరైన నీటి యాజమాన్యం + సమతుల్య పోషక యాజమాన్యం అనేవి అత్యంత ముఖ్యమైన సమగ్ర విధానం.
    పుష్పించే దశలో తీవ్ర వేడి ఉంటే పుష్పాలు రాలడం లేదా పరాగసంపర్కం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల పంటకు కీలక దశల్లో తేమ ఒత్తిడి రాకుండా ముందస్తు నీటి ప్రణాళిక అవసరం.
  2. అధిక వర్షాల సమయంలో కూడా ముందస్తు చర్యలు అవసరం
    వాతావరణ మార్పు అంటే కేవలం వర్షాభావం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలో అధిక వర్షపాతం కూడా పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

అందువల్ల పొలంలో:

  • అదనపు నీరు బయటకు వెళ్లే కాలువలు
  • సరైన డ్రైనేజీ
  • నీటి నిల్వను నివారించడం
  • నేల కోత నియంత్రణ
  • వర్షం తరువాత పోషక లోపాల నివారణ వంటి చర్యలు చేపట్టాలి.

నీరు ఎక్కువసేపు నిలిచే పరిస్థితుల్లో వేర్లకు ఆక్సిజన్ అందక వేరుకుళ్ళు మరియు ఇతర తెగుళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల తరువాత పొలాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

  1. పురుగులు మరియు తెగుళ్లపై నిరంతర నిఘా
    ఉష్ణోగ్రత మరియు తేమలో మార్పులు అనేక పురుగులు, తెగుళ్ల జీవచక్రాన్ని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల వాతావరణ మార్పుల నేపథ్యంలో సమీకృత తెగుళ్ల మరియు పురుగుల యాజమాన్యం మరింత ప్రాధాన్యం పొందుతుంది.

రైతులు వారానికి కనీసం ఒకసారి పొలాన్ని పరిశీలించి:

  • పురుగుల ఉనికి
  • గుడ్లు/లార్వా
  • ఆకుల నష్టం
  • తెగుళ్ల లక్షణాలు గుర్తించాలి
  • శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి.
  1. వాతావరణ సమాచారాన్ని రైతు నిర్ణయాల్లో భాగం చేయాలి
    ఈ రోజుల్లో వాతావరణ సమాచారం రైతులకు చాలా ఉపయోగకరమైన సాధనంగా మారింది. వర్ష సూచనలు, ఉష్ణోగ్రత, గాలివేగం, తేమ వంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని:
  • విత్తనాలు వేసే సమయం
  • ఎరువులు వేయడం
  • పురుగుమందుల పిచికారీ
  • నీటిపారుదల
  • కోత
  • పంట సంరక్షణ…….వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.

“వాతావరణ సూచనను తెలుసుకుని – వ్యవసాయ నిర్ణయం తీసుకోవడం” భవిష్యత్ వ్యవసాయంలో ముఖ్యమైన భాగం కావాలి.

రైతు మాత్రమే కాదు – శాస్త్రవేత్తల పాత్ర కూడా కీలకం

వాతావరణ మార్పులను ఎదుర్కోవడం రైతు బాధ్యత మాత్రమే కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ, వాతావరణ శాస్త్రవేత్తలు కలిసి స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను రైతులకు అందించాలి.

శాస్త్రవేత్తల స్థాయిలో:

  1. కరువు మరియు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాల అభివృద్ధి
  2. తక్కువ నీటితో అధిక ఉత్పాదకత సాధించే పద్ధతుల అభివృద్ధి
  3. వాతావరణ ఆధారిత పంటల సిఫార్సులు
  4. నేల తేమ సంరక్షణ సాంకేతికతల ప్రదర్శనలు
  5. పంటల వైవిధ్యీకరణ నమూనాలు
  6. వాతావరణ ఆధారిత పురుగు–తెగుళ్ల హెచ్చరిక వ్యవస్థలు
  7. గ్రామస్థాయిలో వ్యవసాయ సలహాలు అందించడం …….వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • చివరిగా….* వాతావరణ మార్పులు వ్యవసాయానికి ఒక దీర్ఘకాలిక సవాలు. అయితే శాస్త్రీయ పద్ధతులు, ముందస్తు ప్రణాళిక మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగు విధానాలను అవలంబించడం ద్వారా వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. సరైన పంట + సరైన రకం + సరైన సమయంలో విత్తడం + నేలలో తేమ సంరక్షణ + సమతుల్య పోషక యాజమాన్యం + సమర్థవంతమైన నీటి వినియోగం + సమగ్ర పంట రక్షణ + వాతావరణ ఆధారిత నిర్ణయాలు ఇవే వాతావరణ అనుకూల వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు. రైతులు వాతావరణ మార్పులను కేవలం సమస్యగా కాకుండా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కోవాల్సిన వ్యవసాయ ప్రమాదంగా చూడాలి. ఒకే పంట, ఒకే సాగు విధానం, ఒకే నీటి వనరుపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శాస్త్రీయ సలహాలను కలిపి అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత స్థిరమైనది, లాభదాయకమైనది మరియు వాతావరణ ప్రతిఘటన కలిగినదిగా మార్చవచ్చు.

“వాతావరణాన్ని మనం మార్చలేము; కానీ వాతావరణానికి అనుగుణంగా మన వ్యవసాయాన్ని మార్చుకోవచ్చు. ముందస్తు ప్రణాళికే రైతు నష్టాన్ని తగ్గించే మొదటి అడుగు.”

*డా. ఎస్. బాలాజీ నాయక్, 9177340314, సీనియర్ శాస్త్రవేత్త (భూసార శాస్త్రం)
డా. పి. సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త
ఏరువాక కేంద్రం, కర్నూలు

Read More

ఔషధ మొక్క…. రెడ్‌బడ్

ఇది ఒక చిన్న అలంకరణ చెట్టు. 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 మీ. వెడల్పు ఉంటుంది. ఒక సంవత్సరం లేదా ఎక్కువ వయసున్న చెట్టు, కాండంతో సహా ముదరు పింకు రంగు పూలను ఉత్పత్తి చేస్తుంది. పూలు ఏర్పడిన కొద్ది సమయం తర్వాత ఆకులు ఏర్పడతాయి. ఈ చెట్టు పొడవైన బల్లపరుపు కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెట్టు నుండి వ్రేలాడుతుంటాయి. పూలను తినవచ్ౘ్ు. ఇవి తీయని ఆమ్ల రుచి కలిగి ఉంటాయి.

సాధారణ నామం : జుడాస్ ట్రీ
శాస్త్రీయ నామం : సెర్సిస్ సిలిక్వాస్ట్రం
కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • రెడ్‌బడ్‌ని అనీమియా, నిస్సత్తువ చికిత్సలో ఉపయోగిస్తారు. శతాబ్దాల నుండి దీనిని మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, శ్వాసకోశ సమస్యలు, గర్భవతుల్లో కాళ్ళ వాపుల చికిత్సలో ఉపయోగిస్త్తున్నారు. మూత్ర వర్ధకంగా పనిచేస్తుంది.
  • పూలలో కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని పార్ల్సేతో కలిపి రక్తం, లివర్‌లోని కొవ్వు డిపాజిట్లను కరిగించడానికి ఉపయోగిస్తారు. మెత్తని క్రీం చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంది. 1 కప్పు పూలను 1 కప్పు నీరు కలిపిన క్రీంలో కలిపి 20 ని. ఉడికించాలి. వడపోసి పూలను తొలగించి 3 చెంచాల విటమిన్ ఇ నూనెని క్రీమ్‌కి కలిపి, బాగా కలియత్రిప్పి స్టెరిలైజ్ చేసిన జాడీలో పోయాలి. ఈ క్రీంని గోళ్ళు లేదా చర్మంపై సమస్య వున్న చోట పూసి మసాజ్ చేయాలి.
  • హెల్త్ టీ తయారు చేయడానికి పావుకప్పు తాజాపూలను ఒక పాత్రలో తీసుకుని వాటిపై ఒక కప్పు వేడి నీటిని పోసి 5 ని. నిల్వ ఉంచి వడపోయాలి. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అమెరికన్ ఇండియన్స్, రెడ్‌బడ్‌ని పంటి నొప్పి నుండి బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ వరకు, చర్మ మచ్ౘ్ల నుండి చీలిన కాలి గోర్ల వరకు అనేక సమస్యలకు పూలను నలగ్గొట్టి కట్టు కట్టడానికి లేదా లోషన్‌గా పూయడానికి, పూలను హెల్త్‌టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  • యూరోపియా ఖండంలో ప్రస్తుతం రెడ్‌బడ్ కషాయాన్ని విరేచనకారిగా ఉపయోగిస్తున్నారు. (రాబర్ట్స్, 2000)

వ్యవసాయరంగంలో

  • రెడ్‌బడ్ ఇథనాల్ ద్రావణం (30 మైక్రో లీటర్లు / మి.లీ.) లోని రసాయనాలు 12 రోజుల తామర పురుగులు, త్రిప్స్ టబాసి పై అత్యధిక విష ప్రభావాన్ని చూపాయి (నజ్‌మిజాడె, అతని అనుచరులు, 2013).
  • రెడ్‌బడ్ ద్రావణం { బదనికనల్లి, ఓరియస్ హోర్వాతి విడుదల వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ప్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ పిల్ల పురుగులపై మంచి ప్రభావాన్ని చూపాయి. రెడ్‌బడ్ ద్రావణం పిల్ల తామర పురుగులను చంపింది (రజావి అండ్ అహ్మరి, 2016). తామర పురుగులు సమర్ధవంతంగా నివారించబడ్డాయి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… క్యాబేజి, కీర పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • సన్నని క్యాబేజీ తురుము – 1 కప్పు
  • కీర తురుము – 1 కప్పు,
  • కమ్మని పెరుగు – 2 కప్పులు,
  • పచ్చిమిర్చి – 3 (మీ కారాన్ని బట్టి)
  • కొత్తిమీర తరుగు
  • జీలకర్ర పొడి
  • ఉప్పు

తయారుచేయు విధానం ముందుగా క్యాబేజీని బాగా సన్నగా బియ్యం గింజ సైజులో తురుము కోవాలి. తరువాత కీర కూడా సన్నగా తురుముకోవాలి.

3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒకసారి పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని, దానిలో క్యాబేజి తురుము, కీర తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, జీలకర్ర పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి.

దీన్ని రోటీల్లో తినొచ్చు. ఉత్తదే కప్పులో వేసుకుని పెరుగన్నం లాగా కూడా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు దీన్ని తరచుగా రోజు ఉదయం అల్పాహారం లాగా లేదా సాయంత్రం భోజనం బదులు తీసుకోవచ్చు.

  • దామ జ్యోతి, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధమొక్క… మండూకబ్రహ్మి / మండూక్‌బ్రమ్మి

ఇది ఒక నేల మీద ప్రాకే ఔషధ మొక్క. మొక్క కణుపు నుండి వేర్లు ఏర్పడతాయి. ఆకులు మెరుస్తూ వుంటాయి. మూత్రపిండం ఆకారంలో ఉంటాయి. కాడ చిన్నదిగా, అండాకారంలో ఉంటుంది. పూలు తెల్లగా వుంటాయి. ఒక్కొక్క పూ గుచ్ఛంలో 3-6 పూలు ఏర్పాడతాయి. పూలు కాయలు ఏప్రిల్ – జూన్‌లో ఏర్పడతాయి.

సాధారణ నామం : సెంటెల్లా శాస్త్రీయ నామం : సెంటెల్లా ఆసియాటిక కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • సెంటెల్లా మొక్క మొత్తం విటమిన్ బి, సి, కెరోటినాయిడ్ అధికంగా కలిగి ఉంటుంది. ఈ మొక్కని అన్ని పురాతన ఆయుర్వేదగ్రంథాలలో పేర్కొన్నారు. మొత్తం మొక్కని ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. దీనిని జ్ఞాపకశక్తి, స్పష్టత పెంచడానికి ఉపయోగిస్తారు.
  • సెంటెల్లా శరీరంలో రక్తప్రసరణను పెంచి, రక్తంలో తెల్లకణాలను వృద్ధి చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సెంటెల్లా యవ్వనకాలాన్ని పొడిగిస్తుంది. మూత్రవర్ధక స్వభావం వల్ల డిసూరియా చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని హిస్టీరియా, నిద్రలేమి, ఆందోళన, మూర్ఛ రోగం చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని బోదకాలు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. దీని పేస్టుని బోదకాలుపై పూస్తారు. ఇది మూత్రకోశ సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది.
  • చర్మ ఇన్‌ఫెక్షన్లు, చర్మవ్యాధులు, వాపులు, క్రానిక్ అల్సర్లు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. సెంటెల్లా జలుబు, దగ్గు, ఆస్త్మా, బొంగురు గొంతుని నయం చేస్తుంది. దీనిని క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. గాయాలను నయం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.
  • ఆర్థ్రెåటిస్, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో కాలిన గాయాలను నయం చేసి, గాయాల వల్ల కలిగిన మచ్ౘ్లను లేదా అమ్మవారు సోకినపుడు ఏర్పడే మచ్ౘ్లను నయం చేస్తుంది. కాలేయం, మూత్రపిండాల జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఇంటస్టెåనల్ సమస్యల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. జ్వరం వలన పెరిగిన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మహిళల్లో వ్యంధ్యత్వాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • సెంటెల్లా మలేరియా వాహకం, అనోఫెలిస్ స్టెఫెన్సి లార్వాలు, పెద్ద పురుగులపై నాశక చర్యలను ప్రదర్శించింది (సెంథిల్ కుమార్, అతని అనుచరులు, 2009).
  • సెంటెల్లా ఎసెన్షియల్ ఆయిల్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ (దోమ వాహకం) లార్వాలాను నాశనం చేసింది (రాజ్‌కుమార్ అండ్ జెబనేశన్, 2005).
  • 1కి. సెంటెల్లా ఆకుల రసాన్ని 3 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి మాగుడు తెగుళ్ళు, ఆకు ఎండు తెగులు, కాండం మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు, ఎండుతెగుళ్ళు, ఎర్లిబ్లెåట్ తెగుళ్ళను కల్గించే ఫ్యుజేరియం, హెల్మింతోస్పోరియం ఆల్గర్నేరియా శిలీంద్రాలను నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More