ఎన్ఐఆర్డీలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు కేంద్రం బాధ్యతలు
హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ) లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’కు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.కృత్రిమ మేధ: అభివృద్ధి చెందిన పలు దేశాల్లో అన్ని రంగాల్లో కృత్రిమ మేధను వాడుతున్నారు. ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం.. కాలానికి తగిన పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వాడకంలోనూ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అల్గందం వాడకం వల్ల కచ్చితమైన విశ్లేషణ లభిస్తుంది. మెషిన్ లెర్నింగ్తో పంటల నుంచి కలుపు మొక్కలను తొలగించడానికి ఆకులు పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్ విజన్ విశ్లేషిస్తుంది.
*వివిధ దేశాల్లో ఇలా…*
డ్రోన్లు: విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు మొక్కల వ్యాధులను గుర్తించడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. దిగుబడి అంచనాలు.. గ్రేడింగ్: పంట దిగుబడులను తెలుసుకునేందుకు రియల్ టైమ్లోఏఐ.. అల్గరిదంలను ఉపయోగిస్తుంది. 3డీ మ్యాపింగ్, సెన్సర్లు, డ్రోన్ల నుంచి డేటాను విశ్లేషించి కచ్చితమైన దిగుబడిని అంచనా వేస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో పంట ఉత్పత్తులను పరిమాణం, రంగు ఆధారంగా గ్రేడింగ్ చేయవచ్చు.పంటలకు రక్షణ: దొంగలు, జంతువులు, పకక్షుల నుంచి పంటల రక్షణకు ఏఐ ద్వారా వీడియో సర్వైలెన్స్ సిస్టమ్.. కంప్యూటర్ విజన్తో పశువులు, దొంగల ప్రవేశాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
*మన దేశంలో ఇప్పుడిప్పుడే..*
కేంద్ర ప్రభుత్వం రూ.2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఏర్పాటు చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, బిగ్ డేటా, రిమోట్ సెన్సింగ్లతో సహా సరికొత్త సాంకేతికతలను ఇందులో పొందుపరిచింది. అన్ని రాష్ట్రాల్లో ఏఐ ప్రాజెక్టుల నిర్వహణకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళా సంఘాల ద్వారా 15 వేల డ్రోన్లను మంజూరు చేసింది. దేశంలో ఇప్పటికే ఏఐ సాయంతో తయారు చేసిన ‘కిసాన్ సువిధ’ లాంటి యాప్లు రైతులకు సేవలందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో సంస్థలతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికత, మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్దఎత్తున పంట వృథా అవుతోంది. కృత్రిమమేధ సాయంతో ఆ సమస్యను పరిష్కరించి, దిగుబడినీ పెంచాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. దీనికోసం ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని కేంద్రం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్ వంద గ్రామాల్లో పని ప్రారంభించగా, అమెజాన్ మొబైల్ యాప్తో రైతులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఈ చర్యలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గత ఏడాది 30 శాతం అధిక దిగుబడి సాధించినట్లు ‘నీతి ఆయోగ్’ పేర్కొంది.
*ఏఐ విస్తరణకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాయం*
కేంద్రం మాకు కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై ఇటీవలే అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో వర్క్షాపు ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాం. ఏఐ విస్తరణకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాయం అందిస్తుంది. విస్తృత పరిశోధనలు చేపట్టడంతోపాటు, అంకురాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో వినూత్న ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రయోగాత్మకంగా వాటిని అమలు చేస్తాం.- ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్