ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ఇటీవలనే హైదరాబాదులోని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు. మార్చిలో బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా భాద్యతలు చేపట్టనున్న డా.పాఠక్‌ను, ఉపకులపతి జానయ్య ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే కాలంలో ఇక్రిశాట్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచి నూనె గింజలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంటల సాగు పెంపొందించేందుకు తగు సాంకేతిక సహాయాన్ని అందించాలని జానయ్య కోరారు. దీనికి డాక్టర్‌ పాఠక్‌ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపకులపతి జానయ్య,డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌లు ఐసిఏఆర్‌ లో ఏ.ఆర్‌.ఎస్‌ లో తాము ఇద్దరూ బ్యాచ్‌మేట్‌ లు కావడం మరియు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానంలో సహ శాస్త్రవేత్తలుగా పని చేసిన వారు కావడంతో కలిసి పని చేసిన ఆనాటి రోజులను,అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.