పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలు కావొద్దని మిల్లెట్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఖాదర్‌ వలీ సూచించారు. ”సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు రోజూ రెండు పూటలు తినడం ద్వారా అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా చిరుధాన్యాలు వర్షాభావ ప్రాంతాల్లోనూ పండుతాయి. వరి, గోధుమల సాగుకు నీటి వనరులు ఎక్కువగా అవసరమవడమే కాకుండా… వీటిని పరిమితికి మించి తిన్నవారి శరీరంలోని రక్తంలో క్రమంగా గ్లూకోజ్‌ పెరుగుతుంది. తిండికి, ఆరోగ్యానికి, వ్యవసాయానికి సంబంధం ఉన్నప్పుడు దీనిపై ఎందుకు ఎవరూ అంతగా మాట్లాడటం లేదు. ఏదో ఒకటి తిని మాత్రలు మింగాల్సిన పరిస్థితి రాకూడదంటే రోజూ చిరుధాన్యాలు తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకర జీవనం సాగించవచ్చు” అని కర్ణాటకలోని సేడంలో జరుగుతున్న ఏడో భారతీయ సంస్కృతి ఉత్సవంలో డా|| ఖాదర్‌ వలీ పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో ఆహార ఆరోగ్య సదస్సును కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆదివారం ప్రారంభించారు.