తెలంగాణాలో ఇప్ప పవ్వు ఆహార ఉత్పత్తులు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పపువ్వు లడ్డూ యూనిట్లను స్థాపించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన భీంబాయి ఆది వాసీ మహిళా సహకార సంఘం ఇప్పపువ్వు లడ్డూలను విక్రయించి రూ.1.27 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించి, రూ. 36 లక్షల ఆదాయాన్ని పొందింది. ఈ ఏడాది మార్చిలో మన్కీబాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఈ సంఘం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పపువ్వు, దాని అనుబంధ ఆహార ఉత్పత్తుల యూనిట్లను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్)ను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కుమ్రభాగుబాయి నేతృత్వంలోని భీంబాయి ఆదివాసీ మహిళ సంఘంతో సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ లడ్డూల తయారీ యూనిట్ను మంజూరు చేయించారు. ఈ సంఘం బహిరంగ మార్కెట్లో విక్రయాలతో పాటు ఐటీడీఏ పరిధిలో 77 ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. ఇంకా ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్, బాలాపూర్లో సంఘం విక్రయ కేంద్రాల్లో లడ్డూలు అమ్ముతున్నారు. ఆదివాసీ మహిళల సాధికారతను తెలుసుకున్న మంత్రి సీతక్క, ఇలాంటి యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా సెర్ఫ్ ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సంఘాలకు సబ్సిడీలతో పాటు ప్రభుత్వం రుణసాయం అందించనుంది.

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More

కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ

తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్‌ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

Read More

ఉల్లి రైతులకు హెక్టారుకి 50 వేల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు నష్టపోకూడదనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు హెక్టారుకు రూ.50 వేల చొప్పున ప్రకటించారని, ఉల్లి రైతులకు త్వరలో ఆర్థికసాయం అందిస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో మొత్తం 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల లబ్ది కలగనుందని పేర్కొన్నారు. క్వింటాలు ఉల్లి రూ.1,200 చొప్పున మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.18 కోట్ల విలువైన సరకు కొనుగోలు చేశామని, ఇప్పటికి రూ.10 కోట్లు చెల్లించామని వివరించారు. మిగిలిన రూ.8 కోట్లు త్వరలో అందిస్తామన్నారు.

Read More

4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేసిన కోదండరెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేశారు రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబంధించిన అధికారికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ హర్షన్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్‌, కమిషన్‌ అధికారి హరివెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read More

14 నుంచి 16 వరకుతిరుపతిలో పంచగవ్య జాతీయ వైద్యసదస్సు

ఈ నెల 14 నుంచి 16 వరకు పంచగవ్య జాతీయ 13వ వైద్య సదస్సు.. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో పంచగవ్య, సంప్రదాయ, గోఆధారిత వైద్యం, స్థిరమైన జీవనంపై చేసిన పరిశోధనలను పంచుకునేందుకు, చర్చించేందుకు జాతీయ స్థాయిలో ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు రానున్నట్లు వివరించారు. https://www.gavyasid- dh.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 89500 95000, 94449 61723, 94450 66626 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Read More

పంట నష్టం నమోదు గడువు మరో రెండురోజులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టం నమోదును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వంద శాతం పూర్తిచేశామని తెలిపారు.

Read More

హైటెక్స్ లో పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన

పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. భారత పౌల్ట్రీ పరికరాల తయారీ సంఘం ఈ విషయం వెల్లడించింది. ఒక దేశం-ఒక గుడ్డు నినాదంతో నిర్వహించే ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు 50 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రదర్శకులు, 40,000 మందికి పైగా సందర్శకులు, అంతర్జాతీయ నిపుణులు, ఉత్పత్తిదారులు హాజరవుతారని తెలిపింది. దక్షిణాసియాలోనే ఇది అతి పెద్ద ప్రదర్శన అని పేర్కొంది. బుధవారం హైదరాబాద్లో ప్రదర్శన గోడపత్రికను వివిధ సంఘాల నేతలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. “వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ రంగ సుస్థిర భవిష్యత్ కోసం వరుసగా 17వ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. 25న హైటెక్స్ నోవోటెల్ హోటల్లో నాలెడ్జ్ చేతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. పౌల్ట్రీరంగ సమస్యల పరిష్కారం, కృత్రిమ మేధ, ఆటోమేషన్ సాంకేతికత, పౌల్ట్రీ వ్యాధుల నివారణ, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చా గోష్టులు నిర్వహిస్తాం” అని తెలిపారు. వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజ్ ఆనంద్, శ్రీనివాస ఫార్మా ఎండీ చిట్టూరి సురేష్ రాయుడు, నేషనల్ ఎగ్, చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు బాలస్వామి, రాష్ట్ర పార్టీ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, భాస్కరరావు, నెద్ హైదరాబాద్ జోన్ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలు అనిల్ ధుమాల్, చక్రధరరావు, నరసింహారెడ్డి, వలసన్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More