తెలంగాణా నుంచి పెరగనున్న బియ్యం ఎగుమతులు పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

బియ్యం ఎగుమతులను తెలంగాణ నుంచి విదేశాలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పౌరసరఫరాల శాఖలు తెలంగాణ బియ్యం స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని రవీంద్ర ప్రారంభించారు. ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 118, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఫిలిప్పీన్సుకు ఎగుమతి చేస్తున్నామని, త్వరలోనే ఆఫ్రికా తదితర దేశాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర చెప్పారు. కువైట్‌ తదితర దేశాల ప్రతినిధులు, ఇండియన్‌ రైస్‌ ఎక్స్పోర్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యకక్షుడు ప్రేమ్‌ గార్గ్‌ స్టాల్‌ను సందర్శించారు.

Read More

తడిసిన ధాన్యం కొంటాం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని, ప్రతి రైతునూ ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కాలనీలు, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయి… అక్కడి నుంచి మున్నేరుకు భారీగా వరద వస్తుండటంతో ఖమ్మంలోని కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.

Read More

రాజస్థాన్‌లో ఆవులకు గోపాష్టమి పూజలు

రాజస్థాన్‌ పశుసంసవర్ధక శాఖతోపాటు గోధామం నిర్వాహకులు స్వామి రాజేంద్రదాస్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని డీగ్‌ జిల్లాలో గల శ్రీ జడ్‌ఖోర్‌ గోధామంలో బుధవారం గోపాష్టమి పూజలు మొదలయ్యాయి. సూర్యోదయంతో గంటల మోతలు, శంఖ నాదాలు, ఆవుల అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందంగా అలంకరించిన గోశాల వద్ద భక్తులు హారతి పళ్లేలతో ‘జై గోమాత’, ‘జై గోపాల్‌’ అంటూ నినదించారు. గోధామంలోని 10 వేల ఆవులకు ఏక కాలంలో పూజలు జరిగాయి. ఇందులో 9 వేల గోవులు స్మగ్లర్ల నుంచి రక్షించి గోధామంలో ఆశ్రయం కల్పించినవి కావడం విశేషం. పవిత్ర గోమాత ‘సురభి’ దర్శనంతో మొదలైన వేడుకల్లో భక్తులు వేలాది ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోరక్షా సంకల్పం పేరుతో అందరూ ప్రమాణం చేశారు.

Read More

వెల్లుల్లి సాగుతో మంచి ఆదాయం

అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసిన హరియాణా యువరైతు రవి పూనియా (27) వ్యవసాయాన్నే తన వృత్తిగా ఎంచుకొన్నారు. అధిక పెట్టుబడితో, తక్కువ లాభాలను ఇచ్చే వరి, గోధుమ, ఆవాల వంటి సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి.. సేంద్రియ పద్ధతిలో సొరకాయలు, కశ్మీరీ వెల్లుల్లి (గోల్డెన్‌ గార్లిక్‌) సాగు చేసి రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. ఫతేహాబాద్‌ జిల్లాలోని భూథన్‌ ఖుర్ద్‌ గ్రామానికి చెందిన రవి తాను సాగుచేస్తున్న ఆరడుగుల సొరకాయలతో ఎకరానికి ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ఔషధాల తయారీలో వినియోగించే కశ్మీరీ వెల్లుల్లి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చి ఖర్చులు పోగా, రూ. 15 లక్షల ఆదాయం సాధించి పెడుతోంది. మరో వైపు.. అఫ్గాన్‌కు చెందిన జీవన్‌ రకం వెల్లుల్లిని కూడా సాగు చేస్తున్నారు.

Read More

‘తెలంగాణ రైస్‌’ ఎగుమతులు పెరగాలి

బియ్యం ఎగుమతుల నిపుణుడు, వరల్డ్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీత సమరేందు మహంతి తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు మరింతగా పెరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్‌లో మంగళవారం బియ్యం ఎగుమతులపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 2014-2024 మధ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పటికే ‘తెలంగాణ రైస్‌’ అనే బ్రాండ్‌ పేరుతో ఇక్కడి బియ్యం ఫిలిప్పైన్స్‌కి ఎగుమతి అవుతున్నాయి. దాన్ని మరింత పెంచాలి’ అని సూచించారు. దీనికై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వ్యవసాయ సంచాలకుడు గోపి, పౌరసరఫరాల శాఖ సంచాలకులు హనుమంత్‌ కొండిబ, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

వెటర్నరీ వర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 253 బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగా, ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యక్ష నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పశుసంవర్ధక శాఖ) బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ 253 ఉద్యోగాల్లో 81 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆచార్యులు-56, సంయుక్త ఆచార్యులు-78, సహాయ ఆచార్యులు-119 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించింది.

Read More

పాడిరైతులకు రాయితీపై పశుగ్రాసం పంపిణీ

దారిద్య్ర రేఖకు (బీపీఎల్‌) దిగువనున్న సన్నకారు, పాడి రైతులకు రబీ కరవు సమయంలో 50 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని సరఫరా చేసేందుకు రూ. 25.16 కోట్ల మంజూరుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన నిబంధనలను అనుసరించి ఈ పంపిణీ చేయాలని సూచించారు.

Read More

ధరల మద్దతు పథకం కింద తెలంగాణలో పంటదిగుబడుల సేకరణ

2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణలో ఉత్పత్తి అయిన మినుము పంటలో 100%, పెసర, సోయాబీన్‌ పంటలో 25% చొప్పున కనీస మద్దతు ధరతో ప్రధానమంత్రి అన్నదాత ఆదాయ సంరక్షణ పథకం కింద సేకరించడానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పప్పు దినుసులు, నూనెగింజల పంటల సేకరణపై ఆయా రాష్ట్రాల మంత్రులు, సీనియర్‌ అధికారులతో సోమవారం కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి ఈ మేరకు హామీ ఇచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో ఆయా పంటల సేకరణకుగానూ రూ. 15,095 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉత్పత్తి అయిన పెసర పంటలో 25% (దాదాపు 4,430 టన్నులు) ధరల మద్దతు పథకం కింద కొనుగోలు చేస్తారు. నాఫెడ్‌ ద్వారా కంది, మినుము, మసూర్‌ పప్పు 100% కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Read More

పంటవ్యర్థాలు దహనం చేయని రైతులకు నగదు ప్రోత్సాహం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను (వరిగడ్డి) పొలాల్లోనే కాల్చడం వలన ఉత్పన్నమయ్యే పలు రకాల సమస్యల పరిష్కారానికి పంజాబ్‌లోని బర్నాలా జిల్లా అధికారులు చక్కటి యోచన చేశారు. పంట వ్యర్థాలను దహనం చేయని రైతులను ప్రోత్సహించడానికి రూ.7 లక్షల కేటాయింపుతో ‘లక్కీ డ్రా’ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి వారం 25 మంది రైతులను విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు. ప్రథమస్థానంలో నిలిచిన రైతుకు రూ.20,000, రెండో స్థానానికి రూ.15,000, మూడోస్థానానికి రూ. 10,000 అందజేస్తారు. మరో 22 మంది రైతులకు రూ.2,500 చొప్పున ఇస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించిన బర్నాలా డిప్యూటీ కమీషనరు టి. బెనిత్‌ మొదటివారం విజేతలు 25 మందిని నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

Read More

మొంథా’ తుపాను ప్రభావంతో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగు తోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాలపూర్‌ (ఒడిశా)కు 900 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి, తర్వాత బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది.

Read More