పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. భారత పౌల్ట్రీ పరికరాల తయారీ సంఘం ఈ విషయం వెల్లడించింది. ఒక దేశం-ఒక గుడ్డు నినాదంతో నిర్వహించే ఈ అంతర్జాతీయ ప్రదర్శనకు 50 దేశాల నుంచి 500 మందికి పైగా ప్రదర్శకులు, 40,000 మందికి పైగా సందర్శకులు, అంతర్జాతీయ నిపుణులు, ఉత్పత్తిదారులు హాజరవుతారని తెలిపింది. దక్షిణాసియాలోనే ఇది అతి పెద్ద ప్రదర్శన అని పేర్కొంది. బుధవారం హైదరాబాద్లో ప్రదర్శన గోడపత్రికను వివిధ సంఘాల నేతలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. “వికసిత్ భారత్ దిశగా పౌల్ట్రీ రంగ సుస్థిర భవిష్యత్ కోసం వరుసగా 17వ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. 25న హైటెక్స్ నోవోటెల్ హోటల్లో నాలెడ్జ్ చేతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. పౌల్ట్రీరంగ సమస్యల పరిష్కారం, కృత్రిమ మేధ, ఆటోమేషన్ సాంకేతికత, పౌల్ట్రీ వ్యాధుల నివారణ, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చా గోష్టులు నిర్వహిస్తాం” అని తెలిపారు. వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజ్ ఆనంద్, శ్రీనివాస ఫార్మా ఎండీ చిట్టూరి సురేష్ రాయుడు, నేషనల్ ఎగ్, చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు బాలస్వామి, రాష్ట్ర పార్టీ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, భాస్కరరావు, నెద్ హైదరాబాద్ జోన్ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలు అనిల్ ధుమాల్, చక్రధరరావు, నరసింహారెడ్డి, వలసన్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.