తెలంగాణ రాష్ట్రంలో ఇప్పపువ్వు లడ్డూ యూనిట్లను స్థాపించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన భీంబాయి ఆది వాసీ మహిళా సహకార సంఘం ఇప్పపువ్వు లడ్డూలను విక్రయించి రూ.1.27 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించి, రూ. 36 లక్షల ఆదాయాన్ని పొందింది. ఈ ఏడాది మార్చిలో మన్కీబాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఈ సంఘం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పపువ్వు, దాని అనుబంధ ఆహార ఉత్పత్తుల యూనిట్లను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్)ను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కుమ్రభాగుబాయి నేతృత్వంలోని భీంబాయి ఆదివాసీ మహిళ సంఘంతో సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ లడ్డూల తయారీ యూనిట్ను మంజూరు చేయించారు. ఈ సంఘం బహిరంగ మార్కెట్లో విక్రయాలతో పాటు ఐటీడీఏ పరిధిలో 77 ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. ఇంకా ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్, బాలాపూర్లో సంఘం విక్రయ కేంద్రాల్లో లడ్డూలు అమ్ముతున్నారు. ఆదివాసీ మహిళల సాధికారతను తెలుసుకున్న మంత్రి సీతక్క, ఇలాంటి యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా సెర్ఫ్ ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సంఘాలకు సబ్సిడీలతో పాటు ప్రభుత్వం రుణసాయం అందించనుంది.

10 Nov, 2025
