రసాయన ఎరువులు- మందులు వినియోగించకుండా.. సహజ పద్ధతుల్లో సేద్యంతో పర్యావరణానికి, రైతులకు, ఆయా ఉత్పత్తుల వినియోగంతో ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన విజయవాడకు చెందిన వైద్య దంపతులు డాక్టర్‌ చదలవాడ సుధ, డాక్టర్‌ నాగేశ్వరరావులు ఈ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు తమవంతు సేవలు అందించాలని, 11 ఏళ్ల క్రితం ఏపీలోని నూజివీడు సమీప కొండపర్వ గ్రామంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అక్కడ 38 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వేర్వేరు పంటలు పండిస్తున్నారు. రసాయనాలు విని యోగించకుండా సాగుచేయడం, ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. దేశవిదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. విషపూరిత రసాయనాలతో వ్యవసాయం చేయకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఈ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్‌కు అనుబంధంగా కృష్ణసుధా అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీని స్థాపించారు. కొండపర్వలోనే అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశా లను అందుబాటులోకి తెచ్చారు.
”సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పటివరకు సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌, ఆగ్రో ఫారెస్ట్రీ, ట్రీ-హబ్‌, స్విట్జర్లాండ్‌లోని ది రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ సంస్థలతో.. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాం” అని చదలవాడ సుధ తెలిపారు. శిక్షణ కోసం 85002 83300 నంబరులో సంప్రదించాలని సూచించారు. https://Krishnasudha academy.org / లోనూ సంప్రదించవచ్చు.