‘కర్ల-18’ చెరకు రకంతో పలు ప్రయోజనాలు

అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండి, మంచి దిగుబడినిచ్చే కొత్తరకం చెరకు వంగడం ‘కర్ణ-18 (సీవో-18022)’ను హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న సుగర్‌కేన్‌ బ్రీడింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ కేంద్రం అభివృద్ధి చేసింది. అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే వాయవ్య భారతంలోని రైతులకు కర్ణ-18 రకం చెరకు వంగడం మంచి బహుమతి లాంటిదని ఈ కేంద్ర సీనియర్‌ శాస్త్రవేత్త ఎం. ఆర్‌. మీనా తెలిపారు. ఇది లవణీయత, కరవు పరిస్థితులను కూడా తట్టుకొంటుందని.. చెరకును పట్టి పీడించే ఎర్ర, టాప్‌ బోరర్‌ వంటి తెగుళ్ల బెడద కూడా ఉండదన్నారు. ఇది రాటూన్‌ క్రాప్‌నకు (ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలిపోయిన వేర్లు/మొద్దుల నుంచి వచ్చే ద్వితీయపంట) కూడా అనుకూలమన్నారు. ఈ రకం చెరకు దిగుబడి హెక్టారుకు 98.6 టన్నులుగా.. చక్కెర మిల్లుల వద్ద రికవరీ దాదాపు 11 శాతంతో హెక్టారుకు 12.6 టన్నుల పంచదార ఉత్పత్తి ఉంటుందని మీనా తెలిపారు.

Read More

80 ఎకరాలలో ఐస్‌బర్గ్‌ లెట్యూస్‌ సాగు

హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన బిన్వంత్‌ సింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ సొంతూరిపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగం వదులుకొని 2003లో స్వగ్రామానికి వచ్చేశారు. వ్యవసాయంలో ఏముంది అని తండ్రి వారించినా.. చైనా, జపాన్‌ వంటి దేశాల్లో అధ్యయనం చేసి మరీ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడప్పుడే భారత్‌లో విస్తరిస్తున్న మెక్‌ డొనాల్డ్స్‌ కంపెనీకి ‘ఐస్‌బర్గ్‌ లెట్యూస్‌’ అనే సలాడ్‌ ఆకుకూర అవసరమని గ్రహించి, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఆకులను సలాడ్లు, శాండ్‌విచ్‌లు, బర్గర్లలో విరివిగా వాడుతారు. 80 ఎకరాల్లో ఈ ఆకుకూరను సాగు చేస్తున్నారు. పొలంలో ఏర్పాటుచేసిన వ్యాక్యూమ్‌ ప్రీ కూలింగ్‌ సదుపాయంతో కోసిన 20 నిమిషాల్లోనే ఆకు కూరల ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరి పాడవకుండా తాజాగా ఉంటాయి. ఈ సాగుతో 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

Read More

తెలంగాణ స్టేట్‌ సీడ్‌ & ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అడపా కిరణ్‌కుమార్‌కు ‘రైతునేస్తం’ అభినందన

రైతునేస్తం పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ అడపా కిరణ్‌ కుమార్‌ గారు ఈరోజు తెలంగాణ స్టేట్‌ సీడ్‌ అండ్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రైతునేస్తం వేంకటేశ్వరరావు, కిరణ్‌కుమార్‌గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More

మొక్కజొన్న పంట సాగు, దిగుబడులు పెరగాలి

మొక్కజొన్నను ఇథనాల్‌ ఉత్పత్తికి వాడటము వలన డిమాండ్‌ భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా సాగు, దిగుబడులు పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ జాట్‌ తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ (నార్మ్‌)లో ‘మొక్కజొన్న పరిశోధనలో డేటా సేకరణ, విశ్లేషణ’ అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పరిశోధన విధానాలు మొక్కజొన్న సాగు విస్తరణలో కీలకపాత్ర పోషిస్తాయి. మొక్కజొన్నలు ఇథనాల్‌ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అధికశాతం ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి’ అని సూచించారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రీసెర్చ్‌ ఛటర్జీ, అగ్రివర్సిటీ సీడ్స్‌ డైరెక్టర్‌ నగేశ్‌కుమార్‌ లుథియానా వ్యవసాయ శాస్త్రవేత్త సునిల్‌ పాల్గొన్నారు.

Read More

పొగాకు పంటను ఫసల్‌ బీమా యోజనలో చేర్చేలా కృషి

గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో పొగాకు బోర్డు 50వ వసంతాల వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన యశ్వంత్‌ కుమార్‌ మాట్లాడుతూ 1976లో అప్పటి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య, ఆచార్య ఎన్‌.జి. రంగా తదితర నాయకుల కృషితో గుంటూరులో ఏర్పాటైన పొగాకు బోర్డు రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 50 సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. భారత్‌ నుంచి 100 మిలియన్‌ కిలోల పొగాకును విదేశాలకు విక్రయిస్తుంటే.. అనధికారికంగా 30 మిలియన్‌ కిలోలను విక్రయించడం వల్ల రూ.750 కోట్లు కోల్పోతుండటంతో అనధికారిక విక్రయాలను నివారించేలా ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రానున్న రబీ సీజన్‌ నాటికి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పొగాకు పంటను చేర్చేలా చూస్తాం’ అని భారత పొగాకు బోర్డు ఛైర్మన్‌ చిడిపోతు యశ్వంతకుమార్‌ అన్నారు. పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) బి. విశ్వశ్రీ మాట్లాడుతూ సంపూర్ణ ఆన్‌లైన్‌ విధానంలో రైతుల పేర్ల నమోదు, యాప్‌ను తీసుకొస్తున్నామని వివరించారు. పొగాకు బోర్డు వేలం విభాగం సంచాలకుడు శ్రీనివాస్‌, ఐసీఏఆర్‌-నిర్కా సంచాలకుడు ఎం. శేషుమాధవ్‌, ఐటీఏ కార్యదర్శి వై. అంకమ్మచౌదరి ప్రసంగించారు. బ్యారన్‌ ఎన్యుమరేషన్‌ యాప్‌తోపాటు తెలుగు, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో పొగాకు బోర్డు వెబ్‌సైట్లను అతిథులు ప్రారంభించారు. ఈడీ విశ్వశ్రీ పొగాకు బోర్డు 2026 డైరీని, తెలుగుభాషలో గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ పుస్తకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 26 మంది ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. సమావేశంలో పొగాకు బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్‌, మాజీ ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, పాలకమండలి సభ్యులు, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Read More

పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి

ఉద్యాన పంటలు, పప్పుదినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని.. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, దీని కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు కమిషన్‌కు తెలిపారు. శుక్రవారం కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్‌, కేవీఎన్‌ రెడ్డి, భవాని, గోపాల్‌రెడ్డి, సునీల్‌లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల సాగు పెరగాలి. సంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలి. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలి. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుంది” అని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి కోరారు.

Read More

సబ్సిడీపై పాడి పశువులు

తెలంగాణా రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు / ఆవులను ఇందిరా డెయిరీ ప్రాజెక్టు కింద పంపిణీ చేయనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్‌ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమవుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం ఇందిరా డెయిరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని మూడు జోన్లుగా విభజిస్తారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్‌ ధరతో రెండు పాడి గేదెలు/ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. షెడ్లకు సౌరవిద్యుత్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు.
మధిర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి బీసీ సంక్షేమశాఖ ద్వారా ఇప్పటికే రూ.286 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. మరో రూ.370 కోట్ల మేరకు నిధులు విడుదల కావాల్సి ఉంది.

Read More

34.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము

ప్రస్తుత ఖరీఫ్‌లో 34.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గతేడాది కంటే ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నులు అదనం అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5.59 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,206 కోట్లు చెల్లించాం. రైతులు నష్టపోకుండా మద్దతుధర అందించాం. ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.50 వేల కోట్లు పింఛన్ల కింద ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం తాజాగా రూ.2,500 కోట్లు కేటాయించాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. డేటా లేక్‌ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది’ అని మనోహర్‌ వివరించారు.

Read More

సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More