తాగునీటి చెరువులు నింపేందుకు కసరత్తు ఏప్రిల్ 15 వరకు 17.2 టీఎంసీల విడుదల
కృష్ణా డెల్టా పరిధిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో వేసవిలో నీటి కొరత రాకుండా జలవనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలో సాగులో ఉన్న పంటలకు నీరిస్తూనే… తాగు అవసరాలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో నిల్వ నీటిని సమర్థంగా ఉపయోగిస్తూనే.. వచ్చే ఖరీఫ్లో పంటల సాగుకు ప్రారంభంలో నీటి విడుదలకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
తూర్పు డెల్టాలోని పంటలు తుదిథకు చేరుకున్నాయి. ఇక్కడ పెద్దగా సాగునీటి అవసరాలు లేవు. పశ్చిమ డెల్టా పరిధిలో మొక్కజొన్న, జొన్న సాగు ఎక్కువగా ఉండటం, కొంత ఆలస్యంగా రబీలో పంటలు వేయడంతో మార్చి నెలాఖరు వరకు సాగు నీటి అవసరాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 15 వరకు తూర్పు డెల్టా కాలువలకు 8.6 టీఎంసీలు, పశ్చిమ డెల్టా కాలువలకు 8.6 టీఎంసీలు కలిపి బ్యారేజీ నుంచి 17.2 టీఎంసీల నీరిచ్చేలా రోజువారీ ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి చెరువులను నింపుతూ నీటి విడుదల ఆపే నాటికి వంద శాతం నీటినిల్వ సామర్థ్యంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాగునీటి చెరువుల్లో నిల్వ చేసిన నీరు సగటున 90 రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ లెక్కన జులై నెలలో మళ్లీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు
. *37 టీఎంసీల నీటి లభ్యత…*
పులిచింతల ప్రాజెక్టులో 34.24 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీలో 3.03 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతున్న వాటితో లెక్కిస్తే ఏప్రిల్ 15 నాటికి పులిచింతలలో 20 టీఎంసీల నీరు ఉంటుంది. దీనిని నిల్వచేసి రాబోయే ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా నారుమళ్లు వేసుకోవడానికి, వర్షాలు ఆలస్యమైతే తాగునీటి అవసరాలకు అనుగుణంగా విడుదల చేయనున్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో వేసవిలో సైతం నీటిని నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలకు లోటుండదు. ప్రభుత్వం ముందుచూపుతో గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి పులిచింతలలో నీటినిల్వలు తగ్గకుండా చూడటంతో ఇప్పుడు అవసరాలకు పులిచింతల నీరు అక్కరకు వస్తోంది.
*రెండు పంటలకు పుష్కల నీరు..*
కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్, రబీ సీజన్లో పుష్కలంగా సాగునీరు సరఫరా చేశారు. కృష్ణానదికి గతేడాది నీటిప్రవాహం ఉండటం, అవసరమైనప్పుడు గోదావరి నది నీటిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలించి పంటలకు సాగునీరు అందించారు. సాగునీటి సమస్య లేకపోవడంతో ఈసారి ఆయిల్ఇంజిన్లు పెట్టి పంటలకు నీరందించాల్సిన దుస్థితి తప్పి… పెట్టుబడి వ్యయమూ తగ్గింది. రబీ లోనూ పంటలు పూర్తయ్యే వరకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రైతులకు కలిసొచ్చింది. ప్రస్తుతం మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నాయి. కాలువల చివర, సముద్రతీర ప్రాంత ఆక్వా చెరువులకు కూడా ఈసారి నీటిసమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో నీటి వనరులు సద్వినియోగంతో అన్నదాతల కష్టాలు తొలిగాయి.