కోకోకు అంతర్జాతీయ ధరలపై 5-10% అధికంగా ఇవ్వాలి
- ప్రాసెసింగ్ సంస్థలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
స్థానిక రైతుల నుంచి నాణ్యమైన కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే 5% నుంచి 10% అధికంగా చెల్లించి కొనాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాసెసింగ్ సంస్థలను ఆదేశించారు. ఆఫ్ సీజన్ కోకో బీన్స్కు ఎంత చెల్లిస్తారో కూడా ముందే తెలియజేయాలని సూచించారు. ప్రాసెసింగ్ సంస్థలు దీనిపై సోమవారం లోపు తమ నిర్ణయాన్ని చెప్పాలన్నారు. కోకో రైతులు, ప్రాసెసింగ్ సంస్థల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. 700 టన్నుల ఆఫ్ సీజన్ కోకో బీన్స్ నిల్వలున్నాయని, వాటిని ముందు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు మంత్రిని కోరారు. నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో రూ.680-720 ఉండగా, రాష్ట్రంలో రూ.550 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. 25 ఏళ్లుగా లేని నాణ్యత, గ్రేడింగ్ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కోకోలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.










