వెదురుతో దుర్భేద్య బంకర్లు ఐఐటీ పరిశోధకుల పరిశోధన
బంకర్లు, రక్షణశాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకొచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో భారత పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ కలప, ఇనుము, లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించొచ్చు. గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దీన్ని భారత సైన్యం పరీక్షిస్తోంది.
స్వీయ బరువుతో పోలిస్తే అందించే అత్యుత్తమ బలం కారణంగా ఏరో స్పేస్, పౌర, నౌకాదళ రంగాల్లో గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, శాండ్విచ్ కాంపోజిట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ఉత్పత్తి, పారవేతలో పర్యావరణ సవాళ్లు గణనీయంగానే ఉన్నాయి. చెట్ల నరికివేతపై ఆంక్షలు, హరిత ప్రత్యామ్నాయాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. వెదురు ఆధారిత మిశ్రమ పదార్థాల రూపకల్పనపై గువాహటి ఐఐటీ శాస్త్ర వేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వెదురు చెట్టు వేగంగా పెరుగుతుంది. నాలుగైదేళ్లలోనే పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. సంప్రదాయ టేకు వంటి చెట్లకు ఇందుకు 30 ఏళ్లు పడుతుంది. వెదురుకు పునరుత్పాదక లక్షణం ఉంది. పైగా బరువు తక్కువ. పర్యావరణ అనుకూలం. స్థానికంగా లభ్యమవుతుంది. ఫర్నిచర్, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐఐటీ పరిశోధకులు తాజాగా రూపొందించిన వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం.. లోహాల తరహాలో వంపునకు వీలుగా ఉంటుంది. తూటాలనూ తట్టుకునేంత బలం దీని సొంతం. ఈ లక్షణాల దృష్ట్యా ఇది సైనిక అవసరాలకు బాగా అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు.















