ఆయిల్‌ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టన్ను ఆయిల్‌ పాం గెలల ధర రూ. 21000లకి చేరిందని, దీని ద్వారా 64,582 మంది ఆయిల్‌ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి వివిధ పథకాలను రైతులకు అందిచడం ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంటనూనెల డిమాండును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ సందర్భంగా ఆయన తెలియజేశారు.


రాష్ట్రంలోని (31) జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ తోటల యాజమాన్యం మరియు అంతర పంటల సాగు కొరకు 45,548 మంది రైతుల ఖాతాలలోకి రు.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని, రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని అన్నారు.


ముడి పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్‌ ఆయిల్‌ రైతులను ప్రోత్సహించుటకు చర్యలను తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముడి పామ్‌ ఆయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 27.5%కు పెంచింది. 2023 మార్చిలో టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,174/- గా ఉండగా, ఈ నెల టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.21,000/- కు పెరిగిందని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.