104 కోట్లతో వ్యవసాయ యాంత్రికరణ

నియోజకవర్గాల వారిగా కేటాయింపులకు సన్నాహాలు చేయవల్సిందిగా వ్యవసాయశాఖను ఆదేశించిన మంత్రి తుమ్మల-

త్వరలో మహిళసంఘాలకు 381 డ్రోన్ల పంపిణీ – మంత్రి తుమ్మల- ఎరువుల సరఫరాపై సమీక్షించిన మంత్రి తుమ్మల.-

జొన్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలి – మంత్రి తుమ్మల –

రేపు జరగనున్న సిఎసిపి దక్షిణ ప్రాంతీయ సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి దిశా నిర్ధేశం చేసిన మంత్రి తుమ్మల

రాష్ట్రంలో 2025-26 కి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన మరియు డిమాండ్‌ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిని సబ్సిడీపై రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలవారీగా, నియోజకవర్గాల వారీగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కేటాయింపులు జరిపి, సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకంలో సన్న, చిన్న కారు మరియు మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ”నమో డ్రోన్‌ దీదీ” కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళాసంఘాలకు అందించాల్సిందిగా సూచించారు. ఈ వానాకాలం సీజన్‌కి నెల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులు, రాష్ట్రానికి సరఫరా అయిన ఎరువుల వివరాలు మంత్రికి అధికారులు తెలియజేయగా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం సంప్రదింపులు జరపుకుంటూ, రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేటట్టు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు కేంద్ర మంత్రి జెపి నడ్డాకి లేఖ రాయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో జులై వరకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఆగస్టు మాసానికి సరిపడా ఎరువులను తెప్పించడానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు, జొన్న వివరాలు మరియు రైతుల చెల్లింపులపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1,55,257 మెట్రిక్‌ టన్నుల జొన్నలను మార్క్‌ ఫెడ్‌ ద్వారా సేకరించడం జరిగిందని, దీనికి సంబంధించి 91 వేల మెట్రిక్‌ టన్నులకు గాను రూ. 302 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా పొద్దుతిరుగుడు సంబంధించి 4,333 టన్నులు సేకరించగా, అందుకు సంబంధించిన రూ. 31 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా 35 వేల మెట్రిక్‌ టన్నుల జొన్నలను మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరించగా, దానికి మూడింతలు మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సేకరించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు నిర్దేశించే వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్‌ యొక్క దక్షిణ ప్రాంతీయ సమావేశాన్ని రేపు హైదరాబాద్‌, మారిగోల్డ్‌ హోటల్లో నిర్వహించనున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ శాఖ అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొని, వారి సూచనలు, సలహాలు తెలియజేయనున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పెరిగిన సాగు ఖర్చులను ప్రతిబింబింపచేసి రైతులకు ఇచ్చే మద్ధతు ధరలను డా. స్వామినాథన్‌ కమిటీ సిఫారస్‌ల మేరకు సిఎసిపి కేంద్ర ప్రభుత్వానికి సూచించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రిగారు ఆదేశించారు.

Read More

సమగ్ర విత్తనచట్టంతోనే రైతులకు న్యాయం: కోదండరెడ్డి

సమగ్ర విత్తన చట్టంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని, విత్తన కంపెనీలనూ కట్టడి చేయొచ్చని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. వ్యవసాయరంగం సమస్యలపై జస్టిస్‌ నవాబ్‌సింగ్‌ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం బుధవారం హరియాణా రాష్ట్రంలోని పంచకులలో జరిగింది. ఇందులో కోదండరెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీ, రైతుభరోసా, సన్నాలకు బోనస్‌, రాయితీలపై వ్యవసాయ పరికరాలు తదితర పథకాలను వివరించారు. విత్తన కంపెనీల మోసాలతో రైతులు మోసపోతున్నారని, ఇటీవల ములుగులో వెలుగు చూసిన ఉదంతాన్ని తెలిపారు. కేంద్రం సమగ్ర విత్తన చట్టాన్ని తేవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం విత్తన చట్టం తెస్తోందని, దీనికి సహకరించాలని కోరారు. సమావేశం అనంతరం… కోదండరెడ్డి బృందం పంచకుల సమీపంలోని హరిపుర్‌ గ్రామంలో పర్యటించింది

Read More

కాన్సస్‌ వర్సిటీతో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఒప్పందాలు

అమెరికాలోని కాన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీతో తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు బుధవారం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, కాన్సస్‌ వర్సిటీ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్‌లు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం… డిజిటల్‌ వ్యవసాయ కేంద్రం ఏర్పాటుకు, సహజ వనరులు, పర్యావరణంపై పరిశోధనకు, ఏఐతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి సహకరిస్తుందని జానయ్య తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో… వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, కాన్సస్‌ విశ్వవిద్యాలయ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్‌లు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Read More

రైతుకు లాభం… దేశానికి దన్ను!

కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు
ఎకరాకు టన్ను దిగుబడితో రూ.2.70 లక్షల రాబడి
నూతన వంగడం రూపకర్త, ఇక్రిశాట్‌ ప్రధాన శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌

హైదరాబాద్‌లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాక.. రైతుల రాబడి పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రస్తుత ధరలకంటే తక్కువకే కంది పప్పు లభిస్తుందని ఐసీపీవీ 25444 వంగడం సృష్టికర్త హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సీనియర్‌ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్‌ భరోసా ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆయన జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక్రిశాట్‌లో పదేళ్లుగా పనిచేస్తున్న ప్రకాశ్‌ పలు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన కంది రకం భారత్‌తో సహా పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంగడం విడుదల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని పాటించాం
‘మనదేశంలో 1.13 కోట్ల ఎకరాల్లో, తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో, ఏపీలో నాలుగు లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. అదేసమయంలో ఇతర ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల లో దీని సాగు యేటేటా పెరుగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో కందిపై 2021లో పరిశోధనలు ప్రారంభించాం. సంప్రదాయ విధానంలో కొత్త వంగడం రూపకల్పనకు 15 సంవత్సరాలు పడుతుంది. దీనికి భిన్నంగా స్పీడ్‌ బ్రీడ్‌ విధానాన్ని ప్రపంచంలో తొలిసారిగా వినియోగించి ఐసీపీవీ 25444 వంగడాన్ని తయారు చేశాం. తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలలో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి పెట్టుబడితోపాటు ఎరువులు, నీటి వినియోగం తక్కువ. దిగుబడి ఎక్కువ. ప్రతి 120 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు చాలు. తక్కువ ఎత్తు ఉండడంతో ఎకరం విస్తీర్ణంలో సాధారణ పంట కంటే 30% అధికంగా మొక్కలను వేయొచ్చు. దాంతో ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9 వేల చొప్పున కందికి ధర ఉండగా… ఎకరాకి 90 వేల మేరకు ఆదాయం రైతుకు ఒక పంటకు వస్తుంది. మూడు పంటలతో రూ.2.70 లక్షల మేరకు రాబడి పొందొచ్చు. దేశంలో ఏటా 3.5 మిలియన్‌ టన్నుల కందుల ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాలకు యేటా 1.5 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త వంగడంతో దేశంలో ఉత్పత్తి సామర్థ్యం మరో పది లక్షల టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. తద్వారా దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశీమారక ద్రవ్యం మిగులుతుంది. కొత్త విత్తనాలను తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం అని ప్రకాశ్‌ అన్నారు.

Read More

మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం

21న తొలి విడత చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రమిచ్చే రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి ఈ నెల 21న తొలివిడతలో రూ.7 వేలు జమ చేస్తామన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏరువాక పౌర్ణమిని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి అయిన మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని కంటెయినర్లను చైనా అధికారులు తిరస్కరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయాలి” అని వెల్లడించారు.

కోకో రైతులకు న్యాయం చేస్తాం
పెదవేగిలో సాగవుతున్న కోకో, పామాయిల్‌ పంటలను మంత్రి పరిశీలించి రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పామాయిల్‌ తరహాలోనే కోకో గింజల కొనుగోలుకు విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. సరకు నాణ్యతతోనే గిట్టుబాటు ధరలు సాధ్యమవుతాయని స్పష్టంచేశారు. కంపెనీలు సాగు సమయంలో చెప్పే మాటలు ఆచరణలో విస్మరిస్తున్నాయని రైతులు మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీపై పరికరాలివ్వాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కోరారు. ఏలూరు మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.

Read More

ధాన్యం కొనుగోళ్లలో ‘సాంకేతిక పరిజ్ఞానం’

  • దక్షిణాదిలో తొలిసారి 800 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల వినియోగం
  • తాలు, తరుగు, తేమ సమస్యలు తగ్గాయంటున్న అధికారులు
  • వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం
  • తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌ ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 800 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను ఉపయోగించారు. వీటి వాడకంతో తాలు, తరుగు, తేమ వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని.. దక్షిణాదిలో ఈ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మిగతా కేంద్రాల్లోనూ ప్యాడీ క్లీనర్లను ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ని ఉపయోగించి వర్షం పడే ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం

  • డీఎస్‌ చౌహాన్‌, పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌
    ధాన్యం కొనుగోళ్లు వీలైనంత సాఫీగా జరిగేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. ప్యాడీ క్లీనర్లు వినియోగించి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం. ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వాతావరణ ముందస్తు హెచ్చరికల్ని ప్రభావిత కేంద్రాలకు పంపి ధాన్యం తడవకుండా వీలైనంత మేరకు తగ్గించాం. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపడుతున్న సంస్కరణల్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలూ రానున్నాయి.

ఆసక్తి కనబరుస్తున్న ఇతర రాష్ట్రాలు
తేమ శాతం నిబంధనల్ని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మిల్లర్లకు గ్యారంటీ, బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం తదితర విధానాలను అవలంబించింది. ఈ పరిణామాలు, సంస్కరణల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

Read More

ఏటా మూడు పంటలు పండాలి

వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు

ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.

వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.

ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.

పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్‌ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read More

120 రోజుల్లోనే కంది పంట

  • ఏటా మూడు పంటలు.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
  • కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌). 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం.. చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంటకాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘యాక్సిలరేటెడ్‌ క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’ డైరెక్టర్‌ సీన్‌ మేయెస్‌, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా.. 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 2.01 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించారు.

పది లక్షల టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం
నూతన వంగడంతో దేశంలో కంది సాగు, ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీని ద్వారా అదనంగా పది లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంది. అన్నదాతల ఆదాయం మూడురెట్లు పెరుగుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

  • హిమాన్షి పాఠక్‌, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
Read More

విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌ సీజన్‌లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్‌ విశ్రాంతి భవనంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రైతులంతా ఒకేరకమైన పంటలు వేయడంతో ధరల్లో తేడాలు వస్తున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు సి. చిన్నమ్మ తల్లి, వి. సన్యాసినాయుడు, ఆర్‌. ఈశ్వరరావు, పి. మహేష్‌ తదితరులు మంత్రిని సన్మానించారు.

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం

ఏపీ ప్రభుత్వం మరో సలహాదారును నియమించింది. కొమ్మెర అంకారావు అలియాస్‌ కొమ్మెర జాజిని అడవుల పెంపకం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవిలో ప్లాస్టిక్‌ ఏరివేత ఒక యజ్ఞంలా నిర్వహించిన చరిత్ర ఈయనకి ఉంది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు.

Read More