ఆయిల్ పామ్ తోటలలో పరాగసంపర్కం చేసే వీవిల్స్ (ఎలైడోబియస్ కామెరూనికస్) విడుదల యొక్క విధి విధానాలు

పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.

కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్

ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు
కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.

కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్‌ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.

మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు
A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు

వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.

ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు
• భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
• మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి.
• వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి.
• వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి.
• విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు.
• రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
• వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి.
• వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి.
• అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.

ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.

ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్
భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435
ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301

Read More

ఔషధ మొక్క… గురివింద

ఇది దాదాపు 10 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు సంయుక్తమై ఉంటాయి. పత్రకాలు దాదాపు 20 -40 వరకు వుండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో గాని, తెల్లగా గాని ఉండి నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఫలాలు చిన్న చిక్కుడు కాయల వలే ఉంటాయి. గింజలు అండాకారంలో కోలగా, ఎర్రగా లేదా తెల్లగా ఒక చివర నల్లని మచ్చ కలిగి ఉంటాయి. తెల్లపూలు వచ్చే తీగలకు గింజలు తెల్లగా ఉంటాయి, ఈ గింజలు ఫిబ్రవరి నుండి జూన్ వరకు లభిస్తాయి. గురివింద విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొదల మీద ప్రాకుతూ కన్పిస్తుంది.

సాధారణనామం : ఇండియన్ లిఖోరిస్ శాస్త్రీయ నామం: ఆబ్రస్ ప్రికటోరియస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • గింజలు, వేర్లు, ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేర్లు, ఆకులలో గ్లైకోరైజిన్ అనే రసాయనముంటుంది. గింజలలో యాబ్రిన్, ఇండోల్ అనే ఆల్కలాయిడ్లు, ఆంథోసయనిన్ ఉంటాయి. యాబ్రిన్ విషపూరితం.
  • గ్లైకోరైజిన్ కఫాన్ని తొలగించడమే గాకుండా వాపులను, అలర్జీలను తగ్గిస్తుంది.
    గురివింద గింజ విషతుల్యం. క్రిమిసంహారక, గర్భనిరోధక శక్తి కలిగి ఉంది. కేశ వృద్ధికరం.
  • ఆకులు, వేర్లు వీర్యవృద్ధికరం. మూత్ర విసర్జనకు, వాపులకు, గాయాలకు, ఉబ్బసం, బొల్లి తదితర చర్మవ్యాధులు, తీవ్ర దాహార్తి నివారణకు ఉపయోగపడుతుంది.
  • వేర్లను ఆవు పాలలో కలిపి మిశ్రమం తయారు చేసి అతిసారం మరియు రక్తవిరేచనాల నివారణకుపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • గురివింద ఆకులు, గింజల నీటి, మిథనాల్ ఆధారిత ద్రావణాలు కోపోటెర్మెస్ జెస్ట్రాయ్ మరణశాతాన్ని గణనీయంగా పెంచాయి (ప్రసాద్,అతని అనుచరులు, 2016)
  • గురివింద గింజలలోని అబ్రిన్ అనే రసాయనం పిండినల్లి, మాకోనెల్లికోకస్ హిర్సూటస్‌లో సుగర్స్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రోటీన్ పరిమాణాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. సుగర్స్, ప్రోటీన్, లిపిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా అబ్రిన్ పిండి నల్లుల సంఖ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపింది (అనిత, ఆమె అనుచరులు, 1998).
  • గురివింద నీటి ద్రావణాన్ని వర్మ్స్ నివారణలో ఉపయోగిస్తారు. ఉగాండ రైతులు గురివింద ఆకులు, కాండాలను పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (నువగచి, 2016)
  • గురివింద గింజ మిథనాల్ ద్రావణం రాల్‌స్టోనియా సొలనేసియారం, స్ట్రెప్టోమెసిస్ స్కాబీస్‌పై కన్నా పెక్టోబాక్టీరియం కరటోవోరంపై అధిక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. గురివింద గింజలోని ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రెసిన్స్, ఫినాల్స్, గ్లైకోసైడ్స్, స్టిరాల్స్, ట్రైటెర్పిన్స్ యాంటి బాక్టీరియల్ ప్రభావాన్ని చూపించవచ్చు. ఇథైల్ ఎసిటేట్ఇథనాల్ మిశ్రమ (80:20) ద్రావణం స్ట్రెప్టోమైసిన్ స్కాబీస్‌పై అధిక శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది. గింజల ద్రావణంలో ఉన్న డై (2ఇథైల్ హెక్సైల్) ఫ్తాలేట్ స్ట్రెప్టోమైసిస్ స్కాబీస్‌పై అధిక బాక్టీరియా నాశక చర్యను ప్రదర్శించింది (అబ్బాసి, అతని అనుచరులు, 2016).
  • గురివింద గింజల నీటి ద్రావణం, ఇథైల్ ఆల్కహాల్ ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానైకస్ ఉర్టికె పెద్ద ఆడ పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం గుడ్డు దశపై సమర్థవంతంగా పనిచేస్తుంది (అమర్, అతని అనుచరులు, 1989).
  • గురువింద ఆకులు, కాండాలు కీటకనాశక లక్షణాలు కలిగి వున్నాయి (ఓక్యుటె, 2012).
    గురువింద గింజల క్రూడ్ ద్రావణం ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. ఈ ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను కూడా అరికట్టింది (యాస్మిన్, ఆమె అనుచరులు, 2015).
  • గురివింద పెట్రోలియం ఈథర్ ద్రావణాలు మానవుల తలలోని పేలు, పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్‌ని సమర్ధవంతంగా నివారించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011).
  • గురివింద మిథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర గుడ్లపై 100% గుడ్లనాశక చర్యను ప్రదర్శించాయి. మిథనాల్ ద్రావణం (500 పిపియం) గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (ఎలుమలైకుప్పుసామి, అతని అనుచరులు, 2015), బోడయ్య, అతని అనుచరులు, 2016).
  • ఈడిస్ ఈజిప్టి చికెన్‌గునియా, యెల్లో మరియు డెంగ్యు జ్వరాల ముఖ్య వాహకం. గురివింద గింజల ద్రావణం ఈడెస్ ఈజిప్టి లార్వాలపై అదిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అడెబాజొ, అతని అనుచరులు, 2014).
Read More

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)

సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.

వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము

  • తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
  • తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
  • అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
  • అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.

గుర్తించకొనదగిన విషయాలు (Points to consider)
తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.

ప్రవాసము చేయు స్థలము ఎంపిక

  • తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
  • తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
  • ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
  • తేనెపట్టులు పెట్టుకున్న ప్రాంతంనుండి ఎంతదూరంలో తేనెటీగలకు పుప్పొడిని, మకరందాన్నిచ్చే పుష్పజాతులు ఉన్నవో అంచనా వేసుకొనాలి.
  • తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.

తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట

  • బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
  • తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి.
    కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.

తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration)
తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).

తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies)
తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.

తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి

  • తేనెపట్టులను శుభ్రపరచాలి.
  • అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
  • తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
  • చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
  • సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
  • వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
  • కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.

తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)

  • తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
  • సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
  • తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
  • తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
  • వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
  • వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
  • గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
  • ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
  • పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
  • ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
  • పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

Read More

చౌడును తట్టుకునే వరి విత్తనం

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది.
ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.

Read More

సహకార రంగాన్ని తెలంగాణాలో బలోపేతం చేస్తాం

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More

సర్ ర్థర్ కాటన్‌పై అభిమానంతో శ్రామికులకు రూ.20 లక్షల సాయం

ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కొన్నేళ్లుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రామికులకు రూ.20 లక్షలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. కాటన్‌పై అభిమానంతో తన ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఏటా కాటన్ జయంతికి వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించి, ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా యథావిధిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి, ఏళ్ల తరబడి తన వద్ద పనిచేస్తున్న పది కుటుంబాలకు రూ. రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు. రైతుల ప్రగతిలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.

Read More

వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు

ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.

Read More

వ్యవసాయంలో రోబోటెక్ సేవలు

కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం చేసే రోబోలు వచ్చేశాయని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఆ రోబో చూడటానికి ఎద్దు మాదిరే ఉంది. భూములు దున్నేందుకు దాన్ని వినియోగిస్తున్నారు. ఒక చిన్న సూట్‌కేస్ పెట్టి తీసుకెళ్లొచ్చు. పొలం లోకి వెళ్లి, ఆన్ చేసి పనిచేయించి.. మళ్లీ సూట్‌కేసులో పెట్టి తీసుకోచ్చేయొచ్చు. సాంకేతికత ఆ స్థితికి వచ్చేసింది’ అని పేర్కొన్నారు. రోబో పని తీరు వీడియోను తన కార్యాలయంలో చూశానని తెలిపారు. దాన్ని మీకు షేర్ చేశానని.. చూశారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ను అడిగారు. సాంకేతికత ఆ స్థాయికి వచ్చేసిందని, ఇక కూలీలు దొరకడం లేదని మీరు అనకూడదని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. అది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉందని రాజశేఖర్ అనడంతో.. సీఎం స్పందిస్తూ.. ఏఐ జెనరేటెడ్ అయ్యుండొచ్చేమో చూసుకోండి.. అదే అయితే ఐ డోంట్ మైండ్ అని నవ్వారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రోబోటిక్ సేవలు ప్రవేశిస్తున్నాయని పునరుద్ఘాటించారు.

Read More

సాయిల్ హెల్త్ పాలసీపై మేథోమథనం

దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలల సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ, సంతోష్‌నగర్, హైదరాబాద్‌లో జరిగిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీపై జరిగిన వర్క్‌షాప్‌లో రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ప, ద్మశ్రీ పురస్కార గ్రహీత డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు. నేలలో సేంద్రియ కర్బనం పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చిరొట్ట పైర్ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, జీవామృతం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడేటట్లు చేయడం, పంట మార్పిడి విధానాలు అమలు చేయడం, మిశ్రమ సాగు పంటలను ప్రోత్సహించడం విధిగా చేయాలని వేంకటేశ్వరరావు తెలియచేశారు ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతులు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు పాల్గొని నేలల సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

Read More

సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు యాప్

సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్‌లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

Read More