జలధారతో కరవు తీరింది

కరవుతో ఇబ్బందులు ఎదుర్కొనే అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని రైతులు ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జలధారలో భాగంగా హంద్రీనీవా నీటిని వెలిగల్లు జలాశయానికి మళ్లించడంతో పాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సుమారు 900 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో టమాటా, ఇతర కూరగాయలు పండిస్తు న్నారు. డ్రోన్‌తో ఫొటో తీసిన క్రమంలో మల్చింగ్ పేపర్లతో ఆ ప్రాంతమంతా ఈ విధంగా కనిపించింది.

Read More

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో 11 ప్రాజెక్టులు పూర్తి

ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు రాబోయే రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘2021లో వంశధార ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును గెజిట్ ప్రచురణ చేయించడంలో సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తి అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారు. ఫలితంగా నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో జలవనరులశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఓఎస్డీ కె.వి.ఎల్.ఎన్. చౌదరి, ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

4 మేక పిల్లలు…. ఒకే ఈతలో

సాధారణంగా మేకలు రెండు, మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధికి చెందిన అన్వర్ పెంచుకుంటున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను ఈనింది. దీంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. ‘చాలా అరుదుగా మాత్రమే ఇలా నాలుగు పిల్లలను పెడతాయి’ అని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. అందులో ఏదైనా మేక పిల్ల బలహీనంగా ఉంటే జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందన్నారు.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More

బస్తా నిమ్మకాయల ధర రూ. 4,350/-

హైదరాబాద్ (షరీఫ్) మార్కెట్‌లో గురువారం నిమ్మకాయలు బస్తా ధర రూ.4,350 పలికింది. వేసవి తీవ్రమవడంతో డిమాండ్ పెరగడం, ఖరీఫ్ సీజన్ ముగింపు సమయంలో కురిసిన భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో తామెన్నడూ ఇలాంటిది చూడలేదని కనగల్ మండలం మంచినీళ్లబావి గ్రామానికి చెందిన రైతు బోదనపు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంచి ధర దక్కించుకున్న రైతులు మురిసిపోతున్నారు.

Read More

నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం

భూమి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ దిగుబడిని పొందడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. కాబట్టి తెలంగాణలోని రైతులందరికీ నేల ఆరోగ్య కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాం, ఒక్కో వాలంటీరు 10 మంది రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తారు’ అని తెలిపారు. సమావేశానికి అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అధ్యక్షత వహించగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి పాల్గొన్నారు.

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More

పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More