34,196 టన్నుల పంట ఉత్పత్తులు కిసాన్‌ రైళ్ల ద్వారా రవాణా

బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నకు కిసాన్‌ రైల్‌ పథకాన్ని 2020 ఆగస్టు 7న ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 116 సర్వీసుల ద్వారా 34,196 టన్నుల పంట ఉత్పత్తులను రవాణా చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అస్సాం, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, త్రిపురలకు అరటి, మామిడి, ఉల్లితోపాటు మరికొన్ని పంట ఉత్పత్తులు రవాణా చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నడిపిన 2,364 కిసాన్‌ రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నులు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ రైలు సేవల ద్వారా రూ.318.68 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

Read More

యాసంగిలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు

బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివమ్‌) సమావేశం ఈఎన్సీ అంజద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన జరిపి యాసంగి పంట కాలంలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని ఇందులో నిర్ణయించారు. సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.

  • రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల లభ్యత ఉంది. దీన్ని దాదాపు 43 లక్షల ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.
  • ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, నిజాంసాగర్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టుల్లో జూన్‌ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు పోను 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 30.97 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన చేశారు.
  • చిన్నతరహా ప్రాజెక్టుల పరిధిలో 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
  • మధ్యతరహా ప్రాజెక్టుల్లో 28.95 టీఎంసీలు ఉన్నాయి. వీటి ద్వారా 2.78 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
  • 24.61 లక్షల ఎకరాల తరి, 18.45 లక్షల ఎకరాల ఆరుతడి పంటకు నీరు ఇవ్వనున్నారు.
Read More

ఉల్లి రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలి

ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్‌ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్‌ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్‌ చైన్‌ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

Read More