ANGRAU – DAATTC MOBILEAPP

ANGRAU – DAATTC MOBILE APP – రైతులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుళ్లు – పురుగుల నివారణ, పోషక యాజమాన్యం, వాతావరణ ఆధారిత సూచనలు మరియు విశ్వవిద్యాలయం అందించే తాజా సాంకేతిక వేదిక.

పరిచయం:
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందించడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనిఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Acharya N.G. Ranga Agricultural University – ANGRAU) పరిధిలోని District Agricultural Advisory and Transfer of Technology Centre (DAATTC) ఆధ్వర్యంలో ANGRAU DAATTC App అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ను డా.పి.బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (Transfer of Technology) & కోఆర్డినేటర్, DAATTC, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపొందించారు.
ఈ మొబైల్ యాప్ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, విస్తరణ సిబ్బంది మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సమగ్ర డిజిటల్ సమాచార వేదికగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన తాజా సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సిఫార్సులు మరియు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు సులభంగా చేరవేయడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ లో పంటల వారీగా శాస్త్రీయ సాగు విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, విత్తనాల ఎంపిక, భూమి తయారీ, విత్తే సమయం, విత్తన మోతాదు, నాటే దూరం, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నియంత్రణ, సమగ్ర పురుగుల మరియు తెగుళ్ల నివారణ పద్ధతులు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రధాన ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఎంతో అవసరం. ఈ యాప్ ద్వారా పంటల వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాభావం లేదా అధిక వర్షాల సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలను రక్షించుకునే మార్గాలు వంటి విలువైన సూచనలు అందించబడతాయి. దీని ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం
ఉంటుంది.

ANGRAU DAATTC_App ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పూర్తిగా ANGRAU శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు అధికారిక సమాచారం సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల రైతులకు విశ్వసనీయమైన, శాస్త్రీయమైన మరియు ప్రామాణికమైన సమాచారం అందుతుంది. అదనంగా రైతుల శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ ప్రదర్శనలు, సాంకేతిక వీడియోలు, ప్రచురణలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఈ యాప్ కేవలం రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతు సేవా కేంద్రాల (RSKs)సిబ్బందికి, కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs)శాస్త్రవేత్తలకు, వ్యవసాయ పాలిటెక్నిక్ మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా ఒక ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్స్ వేదికగా ఉపయోగపడుతుంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో, రైతు సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు సాంకేతిక సలహాలు అందించే సందర్భాల్లో ఈ యాప్ సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.

ఈ యాప్ యొక్క మరో ముఖ్యమైన విశేషం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సులభమైన వినియోగాన్ని అందించడం. గ్రామీణ ప్రాంత రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా సరళమైన రూపకల్పన (User-Friendly Interface) కలిగి ఉండటం వల్ల ప్రతి రైతు తన మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని పొందగలుగుతున్నాడు. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతుల చేతికి చేరుతుంది.

డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు శాస్త్రీయ సమాచారం, సకాలంలో వ్యవసాయ సూచనలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికలో అందించే ANGRAU DAATTC Appనేటి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ గా నిలుస్తుంది. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత వృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రధాన ప్రయోజనాలు:
• రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.
పంటల వారీగా సమగ్ర సాగు యాజమాన్య సమాచారాన్ని అందిస్తుంది.
• పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాల నివారణకు నిపుణుల సూచనలు అందిస్తుంది.
• వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్ గా పనిచేస్తుంది.
• శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతుంది.
డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తుంది.

ముగింపు:
ANGRAU DAATTC App అనేది కేవలం ఒక మొబైల్ యాప్ మాత్రమే కాదు, రైతులకు శాస్త్రీయ వ్యవసాయ జ్ఞానాన్ని అందించే డిజిటల్ విజ్ఞాన వేదిక. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేసి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, లాభదాయకత మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఒక వినూత్న ప్రయత్నంగా ఈ యాప్ నిలుస్తోంది. ప్రతి రైతు, వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త మరియు వ్యవసాయ విద్యార్థి తమ మొబైల్లో ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును.

డా. పి. బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త &కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024
డా.డి.ఆదిలక్ష్మీ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ph: 9550506498
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా– 531111

Read More

పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచే కొమ్ము సిలికా (501)

దీనిని భూమిలో నుండి తీసిన స్వచ్ఛమైన ఒక దినుసు శిల పటకాన్ని ఆవు కొమ్ములో నింపి సారవంతమైన నేలలో ఆకులు రాలు కాలం లేదా వసంత ఋతువులో పాతి పెట్టి తయారు చేస్తారు. ఒక గ్రాము కొమ్ము సిలికాను సరిపడా నీటిలో కలిపి ఒక గంట సేపు సవ్యదిశలో కలియత్రిప్పి పొలంలోని అన్నిపంటలు, పశుగ్రాసాలపై ఉదయం వేళ పిచికారి చేయాలి. కొమ్ము సిలికా భూమిలో సిలికాతో కలిపి పనిచేసి సూర్యకాంతి శక్తిని నేలకందిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు, భూమిలోనుండి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల కందడానికి కూడా సహాయపడుతుంది. ఇది పంట ఉత్పత్తుల నాణ్యతను (పక్వదశ, తీపిదనం, రుచి, వాసన, నిల్వశక్తి, పీచు పరిమాణం) పెంచుతుంది. పశుగ్రాసాల రుచిని, హెర్బల్ మొక్కలలో నూనెలను, గింజలలో ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుతుంది. కొమ్ము ఎరువు భూమిపై పిచికారి చేసిన తర్వాత కొమ్ము సిలికాని సంవత్సరానికి కనీసం రెండు సార్లు, వసంత ఋతువులో ఒకసారి, ఆకులు రాల్చే కాలంలో ఒకసారి పంటలపై పిచికారి చేయాలి. ఇది అసలైన బయోడైనమిక్ పంటపై చల్లే పిచికారి ద్రావణం.

Read More

ఎల్‌నినో ప్రభావం: పంటలపై కీటకాల ఉధృతి — రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు

వాతావరణ మార్పులతో మారుతున్న కీటకాల ప్రవర్తనను అర్థం చేసుకొని, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంతో నష్టాలను నివారిద్దాం

పరిచయం
వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. విజయవంతమైన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం, సకాలంలో వర్షాలు, సరైన ఉష్ణోగ్రతలు, తగిన నేల తేమ వంటి అంశాలు అత్యంత కీలకం. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు (Climate Change) వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, దీర్ఘకాలిక కరువు, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వడగాడ్పులు (Heat Waves) వంటి పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు దోహదపడే ప్రధాన కారణాల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి. ఎల్‌నినో ప్రభావం పంటల పెరుగుదలపైనే కాక, పంటలను ఆశించే కీటకాల జీవన చక్రం, సంతానోత్పత్తి రేటు, వ్యాప్తి, హానికారకత్వంపై కూడా గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. కొన్ని కీటకాలు అసాధారణంగా విజృంభించి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తే, మరికొన్నింటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.

కాబట్టి “ఎల్‌నినో సంవత్సరాల్లో ఏ కీటకాలు ఎక్కువగా విజృంభిస్తాయి? ఏ పంటల్లో ఎక్కువ నష్టం సంభవించే అవకాశం ఉంది? రైతులు ఎలాంటి ముందస్తు, సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి?” అనే అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండటం నేటి పరిస్థితుల్లో అత్యవసరం.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 0.5°C లేదా అంతకంటే ఎక్కువ పెరిగి, ఆ పరిస్థితి కనీసం ఐదు వరుస నెలలపాటు కొనసాగినప్పుడు నిర్ధారించే ఒక సహజ సముద్ర-వాతావరణ దృగ్విషయం (ENSO వ్యవస్థలో వెచ్చని దశ).
సాధారణ పరిస్థితుల్లో తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు (Trade Winds) వెచ్చని ఉపరితల జలాలను ఇండోనేషియా వైపుకు నెట్టివేస్తాయి. ఎల్‌నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటం వల్ల వెచ్చని నీరు మధ్య-తూర్పు పసిఫిక్‌లోనే పేరుకుపోయి, ప్రపంచ వాతావరణ ప్రసరణ మార్గాల్లో మార్పులకు కారణమవుతుంది.

ఈ మార్పుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై, ముఖ్యంగా భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ కింది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ:
• సాధారణం కంటే తక్కువ, అనిశ్చిత వర్షపాతం
• నైరుతి రుతుపవనాల బలహీనత లేదా ఆలస్యం
• పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు
• నేల తేమ తగ్గుదల
• దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు

గమనిక: ఇవి సంభావ్యతలు మాత్రమే — ఎల్‌నినో ఉన్న ప్రతి సంవత్సరం భారతదేశంలో కరువు తప్పనిసరిగా వస్తుందని కాదు; స్థానిక భౌగోళిక అంశాలు, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి ఇతర అంశాలు కూడా తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో కీటకాలపై ఎలా ప్రభావం చూపుతుంది?
కీటకాలు శీతల రక్త జీవులు (Poikilothermic/Cold-blooded organisms) — వాటి శరీర ఉష్ణోగ్రత పరిసర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాతావరణంలో స్వల్ప మార్పులు కూడా వాటి పెరుగుదల రేటు, జీవిత చక్రంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు:
• గుడ్లు వేగంగా పొదుగుతాయి
• లార్వా దశ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది
• ప్యూపా దశ కాలం తగ్గుతుంది
• పెద్ద పురుగులు త్వరగా లైంగిక పరిపక్వత చెంది సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి
• ఒకే పంట కాలంలో ఎక్కువ తరాలు (generations) అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది

తక్కువ వర్షపాతం వల్ల:
• భారీ వర్షాల ద్వారా సహజంగా కొట్టుకుపోయే పురుగుల మరణాల రేటు తగ్గుతుంది
• ఆకులపై నివసించే చిన్న, మృదుకాయ కీటకాలు సులభంగా మనుగడ సాగిస్తాయి
• అధిక తేమ అవసరమయ్యే కీటక-పరాన్నజీవి శిలీంధ్రాలు (entomopathogenic fungi వంటివి) సమర్థంగా వృద్ధి చెందక, కీటకాల సహజ మరణాల రేటు తగ్గుతుంది
ఫలితంగా కొన్ని కీటక జాతుల జనాభా వేగంగా పెరిగి, ఆర్థిక నష్టపు గరిష్ఠ స్థాయిని (Economic Threshold Level) దాటే అవకాశం ఏర్పడుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో ఎక్కువగా విజృంభించే కీటకాలు
ఎల్‌నినో ప్రభావంతో అన్ని కీటకాలు ఒకేలా పెరగవు. ప్రధానంగా వేడి, పొడి వాతావరణానికి అనుకూలంగా ఉండే జాతులు మాత్రమే వేగంగా విస్తరిస్తాయి.

  1. రసం పీల్చే పురుగులు (Sap-Sucking Insects)
    ఎల్‌నినో పరిస్థితుల్లో అత్యధికంగా పెరిగే కీటక సమూహం ఇదే. ఇందులో తెల్లదోమలు, తామర పురుగులు (Thrips), పేనుబంక (Aphids), జాసిడ్లు, మీలీబగ్స్, స్కేల్ కీటకాలు ప్రధానమైనవి. ఇవి మొక్కల ఆకులు, లేత కొమ్మలు, పూతలు, పిందెల నుండి కణరసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి.
    ఎక్కువగా పెరగడానికి కారణాలు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ సాపేక్ష ఆర్ద్రత, వేగవంతమైన జీవితచక్రం, అధిక సంతానోత్పత్తి సామర్థ్యం.
    కలిగించే నష్టం: మొక్కల పెరుగుదల మందగించడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం, పూత-పిందె రాలిపోవడం, దిగుబడి తగ్గుదల, వైరస్ వ్యాధుల వేగవంతమైన వ్యాప్తి.
  2. తామర పురుగులు (Thrips)
    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో సంవత్సరాల్లో అధికంగా నమోదయ్యే కీటకాల్లో ఇవి ముఖ్యమైనవి. మిరప, ఉల్లి, వేరుశెనగ, పత్తి, ద్రాక్ష, పూల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. త్రిప్స్ ఆకు ఉపరితలాన్ని గీరి కణరసాన్ని పీల్చడం వల్ల ఆకులపై వెండి-బూడిద రంగు మచ్చలు/గీతలు (silvering) కనిపిస్తాయి. తీవ్ర ఉధృతిలో ఆకులు ఎండిపోయి పంట పెరుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మిరపలో ఇవి “ఆకుముడత” (leaf curl) వ్యాధి వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
  3. తెల్లదోమ (Whitefly)
    తెల్లదోమ అనేక మొక్కల వైరస్ వ్యాధులకు (ముఖ్యంగా బిగోమోవైరస్‌లకు) ప్రధాన వాహకం. ఎల్‌నినో పరిస్థితుల్లో వీటి జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పత్తి, టమాట, బెండ, మిరప, సోయాబీన్ పంటల్లో అధిక నష్టం కలిగిస్తుంది — ప్రత్యక్ష రసం పీల్చడం ద్వారానే కాక, వైరస్ వ్యాప్తి ద్వారా కూడా.
  4. పచ్చ నల్లి / స్పైడర్ మైట్స్ (Spider Mites)
    సాంకేతికంగా మైట్స్ కీటకాలు (Insecta) కాదు — ఇవి అష్టపాద జాతికి (Arachnida) చెందినవి. అయినప్పటికీ వ్యవసాయ సస్యరక్షణలో వీటిని హానికర కీటకాలతో పాటే పరిగణిస్తారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణంలో వీటి అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. పత్తి, మిరప, వంకాయ, కూరగాయలు, పండ్ల తోటల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి.
  5. మీలీబగ్స్ (Mealybugs)
    మామిడి, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పత్తి వంటి పంటల్లో ఎల్‌నినో సంవత్సరాల్లో మీలీబగ్స్ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటి తీపి విసర్జనం (honeydew) మీద నల్లటి బూజు తెగులు (Sooty mold) ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
  6. ఫాల్ ఆర్మీవార్మ్ మరియు స్పోడోప్టెరా జాతులు
    ఫాల్ ఆర్మీవార్మ్ (Spodoptera frugiperda) మరియు టుబాకో కాటర్‌పిల్లర్ (Spodoptera litura) వంటి ఆకుతినే పురుగుల తీవ్రత ఎల్‌నినో ఒక్క కారణం వల్లనే పెరుగుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరికాదు. అయితే దీర్ఘకాలిక పొడి వాతావరణం వల్ల మొక్కలపై ఒత్తిడి (Plant stress) పెరగడం, సహజ శత్రు కీటకాల (parasitoids, predators) సంఖ్య తగ్గడం, ఆలస్యంగా వచ్చే వర్షాలు వంటి పరోక్ష కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న, వేరుశెనగ, సోయాబీన్, కూరగాయల పంటల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం.

రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌నినో సంవత్సరాల్లో కీటకాల ఉధృతిని పూర్తిగా నివారించలేకపోయినా, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం (Integrated Pest Management – IPM) ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు
    • తట్టుకునే/తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం
    • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేపట్టడం (సిఫారసు చేసిన శిలీంధ్రనాశక/కీటకనాశక మోతాదులతో)
    • భూసార పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల
    • పంట మార్పిడి (Crop rotation) పాటించడం
    • పంట చుట్టూ ట్రాప్ పంటలు (marigold, castor వంటివి) వేయడం
  2. పంట పెరుగుదల దశలో నిరంతర పర్యవేక్షణ
    • ప్రతి వారం పొలాన్ని పరిశీలించి కీటకాల ఉనికిని గుర్తించడం
    • పసుపు/నీలం రంగు జిగురు అట్టలు (Yellow/Blue sticky traps) – తెల్లదోమ, తామర పురుగుల పర్యవేక్షణకు
    • లింగాకర్షక బుట్టలు (Pheromone traps) – ఆకుతినే పురుగుల ముందస్తు హెచ్చరికకు
    • ఆర్థిక నష్టపు స్థాయి (Economic Threshold Level – ETL) దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం — ముందుగానే మందులు వాడకపోవడం
  3. నీటి యాజమాన్యం
    • అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ, డ్రిప్/స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా తేమ నిర్వహణ
    • తేలికపాటి తుంపర్లు (light irrigation/sprinkling) ఇవ్వడం ద్వారా ఆకులపై పేరుకున్న కొన్ని రసం పీల్చే పురుగులను తగ్గించుకోవచ్చు
    • నీటి ఎద్దడి (moisture stress) లేకుండా చూసుకోవడం, ఎందుకంటే ఒత్తిడికి గురైన మొక్కలు కీటకాలకు మరింత లోబడతాయి
  4. జీవ నియంత్రణ (Biological Control) ప్రోత్సాహం
    • క్రైసోపెర్ల, లేడీబర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రు కీటకాలను సంరక్షించడం
    • NPV, బ్యూవేరియా బాసియానా వంటి జీవ కీటకనాశకాలను తగిన పరిస్థితుల్లో వినియోగించడం
  5. సమగ్ర రసాయన యాజమాన్యం
    • స్థానిక వ్యవసాయ శాఖ / కృషి విజ్ఞాన కేంద్రం సిఫారసులను పాటించడం
    • పురుగుల, తెగుళ్ల నిరోధకత (resistance) ఏర్పడకుండా జాగ్రత్త పడటం
    • పిచికారీకి ముందు వాతావరణ సూచనలు పరిశీలించడం — ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్న వేళల్లో పిచికారీ మానుకోవడం
  6. సమాచార వినియోగం
    • భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర వ్యవసాయ శాఖల ముందస్తు హెచ్చరికలను నిరంతరం అనుసరించడం
    • సమీప కృషి విజ్ఞాన కేంద్రం (KVK) నిపుణుల సలహాలు తీసుకోవడం
    • తోటి రైతులతో అనుభవాలు పంచుకుంటూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం

ముగింపు
ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు రైతుల నియంత్రణలో లేనప్పటికీ, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. నిరంతర పర్యవేక్షణ, సకాలంలో నిర్ణయాలు, జీవ-రసాయన నియంత్రణ పద్ధతుల సమతుల్య వినియోగం ద్వారా రైతులు ఎల్‌నినో సంవత్సరాల్లో కూడా తమ పంటలను సురక్షితంగా కాపాడుకోగలరు.

ఈ వ్యాసంలోని సూచనలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. నిర్దిష్ట పంట, ప్రాంతం, తెగుళ్ల తీవ్రతను బట్టి స్థానిక వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

డా. టి. నరేష్, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) మరియు డా. హరీషా ఎన్. , సహాయ ఆచార్యులు (వ్యవసాయ విస్తరణ శాస్త్రం), విజ్ఞాన్ వ్యవసాయ మరియు సాంకేతిక సంస్థ విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, గుంటూరు.

Read More

ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

బయోచార్ తయారీ, వినియోగం మరియు వ్యవసాయంలో ప్రయోజనాలు

రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.

రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

  ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.

డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.

ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.

నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.

డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

మొక్క జీవితకాలం పెంపుకు ఐ.యం.ఓ. ద్రావణం

మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్‌లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.

గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.

Read More

ఔషధ మొక్క…. దవనం

దవనం ఒక వార్షిక, నిలువుగా పెరిగే, కొమ్మలు కలిగిన సువాసన గల మొక్క. ఇది 40-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు నీలిఆకుపచ్చ రంగులో, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకులు కాడ కలిగి ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉంటాయి. దీనిని దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచుతారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ‘దవననూనె’ అని పిలుస్తారు..

సాధారణ నామం : దవన శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా పాల్లెన్స్ కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దవనం ఎసెన్షియల్ ఆయిల్ అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది.
  • వైరల్ రోగాలకి సమర్ధవంతమైన రక్షణ కవచం నిర్మిస్తుంది. శరీర అంతర, బాహ్య గాయాలను మాన్పుతుంది.
  • దవనం యొక్క శక్తివంతమైన ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ఫెక్షన్స్ కలిగించే బాక్టీరియా, సూక్ష్మజీవులు, శిలీంద్రాలు, వైరస్‌లతో పోరాడి అవి కల్గించే వ్యాధులను నయం చేస్తుంది.
  • మహిళలలో రుతుచక్రాలను క్రమబద్ధీకరిస్తుంది. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
  • దవనం ఎసెన్షియల్ ఆయిల్ శరీరంలోని కండరాలు, రక్తనాళాలను వదులు చేసి మెదడు, నరాల వ్యవస్థకు కూడా విశ్రాంతినిస్తుంది. తద్వారా ఆందోళన, వత్తిడి, డిప్రెషన్, కోపాన్ని అదుపులో ఉంచుతుంది. దీనివలన మంచి నిద్రపోవచ్చు. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.

వ్యవసాయరంగంలో :

  • దవనం (ఆర్టెమిసియా జొడైకా) ఎసెన్షియల్ ఆయిల్ (50%, 40%)తో శుద్ధి చేసిన 72 గంటల తర్వాత కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ (అలసంద వీవిల్) పెద్ద పురుగులను అతి సమర్ధవంతంగా అరికట్టింది. ఎసెన్షియల్ ఆయిల్‌లోని పైపర్టోన్ (32.4%), కాంఫర్ (20.6%), (ఇ) ఇథైల్‌సిన్నమేట్ కీటకనాశక లక్షణాలు కలిగి ఉన్నాయి. (అబ్డఎలక్షహాడి, 2012).
  • దవనం వేర్లలో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి.
  • దవనం ఎసెన్షియల్ ఆయిల్‌లని పెస్టాసోలైడ్ ‘ఎ’, స్పైరో అజఫిలోన్‌డెరివేటివ్ క్యాండిడా ఆల్బికాన్స్, జియోట్రైకం కాండిడం, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
  • దవనం (ఆర్టెమిసియా హెర్బా ఆల్బా) ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, ప్రత్యేకంగా రైజోపెర్తా డామినిక పురుగులను నివారించే శక్తి కలిగి ఉంది (పరిషియాన్, అతని అనుచరులు, 2012).
  • దవనం (ఆర్టెమిసియా వుల్గారిస్) కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఈడెన్ ఈజిప్టి దోమ లార్వాలపై లార్వానాశక చర్యను ప్రదర్శించింది. సహజ పురుగు మందులనుపయోగించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. (సుజాత అండ్ రంచితకుమారి, 2012).
  • బ్రిటిష్ కొలంబియాలో కుందేళ్ళు, కోళ్ళనాశించే పరాన్నజీవుల చికిత్సకు దవనం మొక్కనుపయోగిస్తారు (లాన్స్ అండ్ టర్నర్, 2011)
  • దవనం (ఆర్టెమిసియా యాన్యువ) ఎండిన ఆకులు (2% పొడి / 250 గ్రా. అలసంద గింజలకు) బ్రూచిడ్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (బ్రిసిబె, అతని అనుచరులు, 2011).
  • దవనం మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల పొడి కుళ్ళు కల్గించే ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టి దుంపలను పొడికుళ్ళు ఆశించకుండా కాపాడింది. (జాకర్, 2014).
  • దవనం (ఆర్టెమిసియా పార్విఫ్లోరా) క్రూడ్ ద్రావణం సజ్ౙలో వెర్రికంకి తెగులు కల్గించే స్ల్కీరోస్పోరా గ్రామినికోలా శిలీంద్ర బీజాలుండే స్పొరాంజియా ఏర్పడకుండా పూర్తిగా నివారించింది (దీపక్, అతని అనుచరులు, 2007).

దవనం ఎసెన్షియల్ ఆయిల్స్ నివారించే ధాన్యంలో ఆశించే పురుగులు

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More