వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ ఛైర్మన్ హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
వ్యవసాయ పంటల ఉత్పత్తిలో ప్రస్తుతం 2 శాతం మాత్రమే ప్రైవేటు భాగస్వామ్యం ఉందని, దానిని మరింత పెంచే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) చైర్మన్ విజయ్పాల్ శర్మ సూచించారు. సాంకేతికత సహాయంతో పంట ఉత్పత్తులను పెంచుకోవాలన్నారు. 2024-26 మార్కెటింగ్ సీజన్కు మద్దతు ధరల విధానం ఖరారుపై శుక్రవారం హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంత అధికారులు, రైతు ప్రతినిధులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. కమిషన్ సభ్యులు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి, మార్కెటింగ్ సంచాలకుడు సురేంద్రమోహన్, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్పాల్ మాట్లాడుతూ ”స్థానిక అవసరాల మేరకు పంట నిల్వలకు సరిపడా గోదాములు నిర్మించడం ద్వారా రైతులకు పెట్టుబడి, వినియోగదారులకు కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చు. తద్వారా సరసమైన కనీస మద్దతు ధరలు నిర్ధారణ సులభతరం అవుతుంది. దక్షిణ రాష్ట్రాల్లో నేలలు, వాతావరణ అనుకూలతలతో పాటు తక్కువ నీటితో పండే శనగలు, కుసుమలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ పంటలను
పొలాలకు పైపులతో సాగునీటి సరఫరా ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లకు నీటిని అందించేలా ఎంకాడ్ (మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్) పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కర్నూలు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎర్రనేలల్లో గణనీయంగా పంటలు పండించడానికి వీలుగా ఎంకాడ్ పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఎర్రనేలలకు పైపుల ద్వారా నీటిని అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఐదు చోట్ల ఎర్రనేలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో బ్లాక్గా నిర్ణయించారు. ఒక్కో బ్లాక్ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్ల ఎర్రనేలలున్నాయి. ఐదు బ్లాకుల్లో కలిపి మొత్తం 25 వేల హెక్టార్లకు నీరు అందించడానికి అవకాశం ఉంది. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ నుంచి నీటిని తీసుకునేలా ఎంకాడ్ పథకానికి రూపకల్పన చేశారు. ఒక్కో బ్లాక్ దగ్గర ఒక్కో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. దీనికి సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వ్యయాన్ని భరిస్తుంది. నందికొట్కూరు, కృష్ణగిరి, పత్తికొండ, వెల్దుర్తి మండలాల పరిధిలో నీటిని అందించనున్నారు.*ప్రయోజనాలెన్నో..*- పీపీడబ్ల్యూఎస్ (ప్రెజరైజ్డ్ పైప్డ్ వాటర్ సప్లై) విధానంలో సాగునీటిని రైతులు పొలం దగ్గరికి పైపుల ద్వారా పంపుతారు. ఫలితంగా సాగునీటి వృథాకు అడ్డుకట్ట పడుతుంది. 90 శాతం నీరు సద్వినియోగం అవుతుంది.- పొలం దగ్గరికి పైపులైను వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి డ్రిప్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ‘ప్రెజరైజ్డ్ పైప్ ఇరిగేషన్ నెట్వర్క్’ (పీపీఐఎన్) పేరుతో ఒక్కో బ్లాక్ పరిధిలో ఉండే రైతులందరినీ ఇందులోకి తెచ్చి.. ప్రతి ఒక్కరికి తగిన పరిమాణంలో నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. – ఈ విధానంలో ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.- మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంకాడ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. – మోటార్లు ఉపయోగించి పైపుల్లో నీటిని పంపుతున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులకు నీరందదనే సమస్య ఉండదు.
దేశంలో వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఏటా 8 శాతానికి పైగా పెరుగుతున్నాయని 2040 నాటికి 17.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ) డాక్టర్ ఆర్సీ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు మానవ వనరులను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో శుక్రవారం ‘వ్యవసాయ విద్య, అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ”భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో వ్యవసాయాధారిత అంకుర పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయి. కృత్రిమ మేధతో భవిష్యత్తులో గ్రామీణ విప్లవం వస్తుంది. రైతుల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధారిత ఉత్పత్తులతో పరిశ్రమలు, వ్యాపారాలు పెద్దఎత్తున సాగుతాయి. వ్యవసాయ విద్యార్థులు కమ్యూనికేషన్స్, పారిశ్రామిక నైపుణ్యాలు సాధించాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలపై వివిధ ప్రచురణలను ఆవిష్కరించారు. రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్, శాస్త్రవేత్తలు, ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.
రోజువారి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి తుమ్మల
– ఈ రోజు మరో రెండు సంస్థలతో చర్చలు
– సాగులో ఉన్న భూమి, పంటల వారి విస్తీర్ణము మరియు ముందుగానే పంట చీడల గుర్తింపు, నివారణలో ఏఐ పరిజానాన్ని వాడుకొనే యోచనలో ప్రభుత్వం
వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను వాడుకునే దిశలో భాగంగా వివిధ ఏఐ సంస్థల ప్రతినిధులతో గత రెండు, మూడు రోజులుగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి, సీజన్ల వారిగా పంటల విస్తీర్ణము, పంట చీడ పీడల గుర్తింపులో మనుషుల వాడకాన్ని తగ్గించి ఏఐ సాంకేతికత వాడాలని రాష్ట్ర ప్రభుత్వము కృత నిశ్చయముతో ఉన్నదని, తద్వారా రైతాంగానికి సత్వర సేవలందించడానికి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఈ దిశగా ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము వారు గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్న పరిశోధనల ఫలితాలను ఆగ్రోనమి ప్రొ. డా. నీలిమ మంత్రికి తెలియజేశారు. ఇక్రిశాట్ నుండి హాజరైన ప్రతినిధులు తాము ప్రయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాల వివరాలు, దాని ఆధారంగా వివిధ రాష్ట్రాలకు అందిస్తున్న సేవలను ముఖ్యంగా పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో తాము అవలంబిస్తున్న పద్ధతులను మంత్రికి తెలియజేశారు. అగ్రివాస్ ప్రతినిధులు తాము ఉపయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాలు, వాటి ద్వారా పంటలకు వచ్చే తెగుళ్లు, క్రిమికీటకాలు మరియు నీటి ఎద్దడి పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతున్నాము, తమ పరిశోధనల ఫలితంగా రైతులు ఏ విధంగా ప్రయోజనం పొందిన విషయాలను మంత్రికి తెలియచేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో వ్యవసాయ రంగంలో కూడా ఏఐ సాంకేతికత ఉపయోగించుకొని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందే సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదన్నారు. ఈ వానాకాలం నుండి పైలట్ పద్ధతిలో అందుబాటులో ఉన్న అన్ని రకాల టెక్నాలజీని వాడుకొని, అన్నింటికంటే రైతులకు ప్రయోజనకరంగా ఉన్న పద్ధతులను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, వ్యవసాయ అధికారులు, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
9 రోజుల్లో వానాకాలం రైతుభరోసా సహాయానికి పూర్తి నిధులు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 5 వ రోజు 7 ఎకరాల వరకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ రోజు మరో 905.89 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసామని, దీని ద్వారా 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు. కేవలం 5 రోజుల లోనే 7310.59 కోట్లు విడుదల చేసామని, ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా రైతుభరోసా సహాయాన్ని అందచేస్తామని ఈ సందర్భముగా మంత్రి తెలిపారు.
రైతులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలిఅధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
హెచ్డీ బర్లీ పొగాకు, తోతాపురి మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు రూ.8 తగ్గకుండా చెల్లించేలా చూడాలని.. మరో రూ.4 ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. వీలైనంత వరకు రైతులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో పొగాకు, మామిడి, కోకో కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. మామిడి పల్ప్ (గుజ్జు) పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే విషయమై కేంద్రంతో మాట్లాడామని వివరించారు. దీనిపై కేంద్రప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడికి మార్కెట్ డిమాండ్పై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. సాగు ప్రణాళికపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు.
*53 మిలియన్ కిలోల పొగాకును త్వరగా కొనాలి*
రాష్ట్రంలో ఈ ఏడాది 80 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకు ఉత్పత్తి వచ్చిందని.. ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 33 మిలియన్ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. మరో 20 మిలియన్ కిలోలను మార్క్ఫెడ్ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. బాపట్లలో 3, గుంటూరులో 2, పల్నాడులో 1, ప్రకాశంలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని.. గురువారం నుంచి కొనుగోలు మొదలవుతుందని చెప్పారు. రైతుల వద్ద ఉన్న 53 మిలియన్ కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు.
*జులై మొదటి వారానికి కోకో మొత్తం కొనాలి*
ఈ ఏడాది 12 వేల టన్నుల కోకో ఉత్పత్తి వచ్చిందని.. ఇందులో 10వేల టన్నుల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రోజూ 80 నుంచి 100 టన్నులు సేకరిస్తున్నారని తెలిపారు. జులై మొదటి వారానికి రైతుల వద్ద మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని సూచించారు
నియోజకవర్గాల వారిగా కేటాయింపులకు సన్నాహాలు చేయవల్సిందిగా వ్యవసాయశాఖను ఆదేశించిన మంత్రి తుమ్మల-
త్వరలో మహిళసంఘాలకు 381 డ్రోన్ల పంపిణీ – మంత్రి తుమ్మల- ఎరువుల సరఫరాపై సమీక్షించిన మంత్రి తుమ్మల.-
జొన్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలి – మంత్రి తుమ్మల –
రేపు జరగనున్న సిఎసిపి దక్షిణ ప్రాంతీయ సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి దిశా నిర్ధేశం చేసిన మంత్రి తుమ్మల
రాష్ట్రంలో 2025-26 కి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన మరియు డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిని సబ్సిడీపై రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలవారీగా, నియోజకవర్గాల వారీగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కేటాయింపులు జరిపి, సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకంలో సన్న, చిన్న కారు మరియు మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ”నమో డ్రోన్ దీదీ” కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళాసంఘాలకు అందించాల్సిందిగా సూచించారు. ఈ వానాకాలం సీజన్కి నెల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులు, రాష్ట్రానికి సరఫరా అయిన ఎరువుల వివరాలు మంత్రికి అధికారులు తెలియజేయగా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో నిత్యం సంప్రదింపులు జరపుకుంటూ, రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు సకాలంలో వచ్చేటట్టు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి జెపి నడ్డాకి లేఖ రాయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో జులై వరకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఆగస్టు మాసానికి సరిపడా ఎరువులను తెప్పించడానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు, జొన్న వివరాలు మరియు రైతుల చెల్లింపులపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నడూ లేని విధంగా ఈ సారి 1,55,257 మెట్రిక్ టన్నుల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా సేకరించడం జరిగిందని, దీనికి సంబంధించి 91 వేల మెట్రిక్ టన్నులకు గాను రూ. 302 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా పొద్దుతిరుగుడు సంబంధించి 4,333 టన్నులు సేకరించగా, అందుకు సంబంధించిన రూ. 31 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో అత్యధికంగా 35 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా సేకరించగా, దానికి మూడింతలు మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సేకరించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు నిర్దేశించే వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ యొక్క దక్షిణ ప్రాంతీయ సమావేశాన్ని రేపు హైదరాబాద్, మారిగోల్డ్ హోటల్లో నిర్వహించనున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ శాఖ అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొని, వారి సూచనలు, సలహాలు తెలియజేయనున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పెరిగిన సాగు ఖర్చులను ప్రతిబింబింపచేసి రైతులకు ఇచ్చే మద్ధతు ధరలను డా. స్వామినాథన్ కమిటీ సిఫారస్ల మేరకు సిఎసిపి కేంద్ర ప్రభుత్వానికి సూచించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రిగారు ఆదేశించారు.
సమగ్ర విత్తన చట్టంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని, విత్తన కంపెనీలనూ కట్టడి చేయొచ్చని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. వ్యవసాయరంగం సమస్యలపై జస్టిస్ నవాబ్సింగ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ కమిటీ సమావేశం బుధవారం హరియాణా రాష్ట్రంలోని పంచకులలో జరిగింది. ఇందులో కోదండరెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీ, రైతుభరోసా, సన్నాలకు బోనస్, రాయితీలపై వ్యవసాయ పరికరాలు తదితర పథకాలను వివరించారు. విత్తన కంపెనీల మోసాలతో రైతులు మోసపోతున్నారని, ఇటీవల ములుగులో వెలుగు చూసిన ఉదంతాన్ని తెలిపారు. కేంద్రం సమగ్ర విత్తన చట్టాన్ని తేవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం విత్తన చట్టం తెస్తోందని, దీనికి సహకరించాలని కోరారు. సమావేశం అనంతరం… కోదండరెడ్డి బృందం పంచకుల సమీపంలోని హరిపుర్ గ్రామంలో పర్యటించింది
అమెరికాలోని కాన్సస్ స్టేట్ యూనివర్సిటీతో తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు బుధవారం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి అల్దాస్ జానయ్య, కాన్సస్ వర్సిటీ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్లు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం… డిజిటల్ వ్యవసాయ కేంద్రం ఏర్పాటుకు, సహజ వనరులు, పర్యావరణంపై పరిశోధనకు, ఏఐతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి సహకరిస్తుందని జానయ్య తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో… వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, కాన్సస్ విశ్వవిద్యాలయ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్లు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కొత్త కంది వంగడంతో ఏటా మూడు పంటలు ఎకరాకు టన్ను దిగుబడితో రూ.2.70 లక్షల రాబడి నూతన వంగడం రూపకర్త, ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్
హైదరాబాద్లో కొత్తగా ఆవిష్కరించిన కంది వంగడం దేశ పప్పుదినుసుల రంగంలో విప్లవాత్మక మార్పులు తేనుంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాక.. రైతుల రాబడి పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రస్తుత ధరలకంటే తక్కువకే కంది పప్పు లభిస్తుందని ఐసీపీవీ 25444 వంగడం సృష్టికర్త హైదరాబాద్లోని ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాశ్ భరోసా ఇస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆయన జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్లో పీహెచ్డీ చేశారు. ఇక్రిశాట్లో పదేళ్లుగా పనిచేస్తున్న ప్రకాశ్ పలు అంతర్జాతీయ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. తాజాగా ఆయన రూపొందించిన కంది రకం భారత్తో సహా పలు దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వంగడం విడుదల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.
స్పీడ్ బ్రీడ్ విధానాన్ని పాటించాం ‘మనదేశంలో 1.13 కోట్ల ఎకరాల్లో, తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో, ఏపీలో నాలుగు లక్షల ఎకరాల్లో కంది సాగవుతోంది. అదేసమయంలో ఇతర ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ల లో దీని సాగు యేటేటా పెరుగుతోంది. ఈ దేశాలతో పోలిస్తే మన దిగుబడి తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్లో కందిపై 2021లో పరిశోధనలు ప్రారంభించాం. సంప్రదాయ విధానంలో కొత్త వంగడం రూపకల్పనకు 15 సంవత్సరాలు పడుతుంది. దీనికి భిన్నంగా స్పీడ్ బ్రీడ్ విధానాన్ని ప్రపంచంలో తొలిసారిగా వినియోగించి ఐసీపీవీ 25444 వంగడాన్ని తయారు చేశాం. తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలలో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి పెట్టుబడితోపాటు ఎరువులు, నీటి వినియోగం తక్కువ. దిగుబడి ఎక్కువ. ప్రతి 120 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి మూడు పంటలు వేయవచ్చు. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు చాలు. తక్కువ ఎత్తు ఉండడంతో ఎకరం విస్తీర్ణంలో సాధారణ పంట కంటే 30% అధికంగా మొక్కలను వేయొచ్చు. దాంతో ఎకరానికి టన్ను దిగుబడి వస్తుంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9 వేల చొప్పున కందికి ధర ఉండగా… ఎకరాకి 90 వేల మేరకు ఆదాయం రైతుకు ఒక పంటకు వస్తుంది. మూడు పంటలతో రూ.2.70 లక్షల మేరకు రాబడి పొందొచ్చు. దేశంలో ఏటా 3.5 మిలియన్ టన్నుల కందుల ఉత్పత్తి జరుగుతుంది. దేశీయ అవసరాలకు యేటా 1.5 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. కొత్త వంగడంతో దేశంలో ఉత్పత్తి సామర్థ్యం మరో పది లక్షల టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. తద్వారా దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశీమారక ద్రవ్యం మిగులుతుంది. కొత్త విత్తనాలను తెలుగు రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం అని ప్రకాశ్ అన్నారు.