మంగళగిరిలో ఆహారశుద్ధి సొసైటీ, ఏపీటీపీసీ కార్యాలయాలు

ప్రారంభించిన మంత్రి టీజీ భరత్‌ ఆహారశుద్ధి రంగంలో ఐదేళ్లలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఈ రంగంలో యూనిట్ల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆటోనగర్‌ (పీవీఎస్‌ ల్యాండ్‌మార్క్‌)లో ఆహారశుద్ధి సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) కార్యాలయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జా బాబూరావు, ఆహారశుద్ధి శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆహారశుద్ధి సొసైటీ ఎండీ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఖరీఫ్‌ పంటలకు సరిపడా ఎరువుల నిల్వ

ఖరీఫ్‌ పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. రైతులకు ఇబ్బందులు రానివ్వమని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. శుక్రవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 11.09 లక్షల టన్నుల నిల్వ ఎరువులకు గాను 2 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లోని గోదాముల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెలకు సంబంధించి 2.35 లక్షల టన్నుల ఎరువులు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఎమ్మార్పీ ధరకే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

Read More

తెలంగాణాలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల

లారాస్‌ ఛారిటబుల్‌ ట్రస్టుతో కలిసి హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ రైతుల కోసం సంచార భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించింది. రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల. ఇప్పటివరకు రైతులు ప్రయోగశాలలకు వెళ్లి మట్టి పరీక్షలు చేయించుకోవడం, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు తీసుకొని ప్రయోగశాలకు పంపే పద్ధతులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌ సంచార భూసార పరీక్ష ప్రయోగశాల రైతులకు ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ వాహనం మొదటగా మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని 22 గ్రామాలకు సేవలందిస్తుంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. ఈ ప్రయోగశాలలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు. పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని 13 సూక్ష్మపోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తారు. నీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పర్యావరణ పరిరక్షణ, పంటల సాగు లాభదాయకమయ్యేలా చేసేందుకు తెలంగాణలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించామని ఇక్రిశాట్‌ డీజీ హిమాన్షు పాఠక్‌ ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ ద్వారా 2023 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు 2,400 మట్టి నమూనాలను పరీక్షించామని తెలిపారు.

Read More

ఆర్మూర్‌ పసుపు రకానికి భౌగోళిక గుర్తింపుకు సన్నాహాలు

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో పండించే పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో గురువారం అధ్యయనం ప్రారంభమైంది. విశ్వ విద్యాలయ ప్రధాన పరిశోధకులు పిడిగం సైదయ్య నేతృత్వంలో కమ్మర్‌పల్లి లోని పసుపు పరిశోధన స్థానం అధిపతి బి. మహేందర్‌, నాబార్డు నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి అధికారి ప్రవీణ్‌, రైతులతో కూడిన బృందం.. ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, నందిపేట మండలాల్లో పర్యటించింది. సాగు భూములు, పసుపు రకాలు, వాటి లక్షణాలు, పంట విత్తుకొనే దూరం, సాగుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఎరువులు, సాగునీటి పారుదల తదితర అంశాలపై సమగ్ర సమాచారం సేకరించింది. నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సందర్శించి పసుపు ధరలు, కొనుగోళ్ల తీరును తెలుసుకుంది.

Read More

తోటకూర విత్తనాల్లో పోషకాలు మెండు

తోటకూర మొక్కకున్న లేత ఆకులు తెంపుకొని.. గింజ థకు రాగానే తొలగించేస్తాం. కానీ, గింజలే అసలైన పోషకాల గనులంటున్నారు.. శాస్త్రవేత్తలు. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా మన మెనూలో తోటకూర ధాన్యం చేర్చాలంటున్నారు. ఇలా చేస్తే పోష కాహార లోపం, అధిక బరువు వంటి సమస్యలు తప్పుతాయని ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధనా స్థాన శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సుపరిచితమైన తోటకూర గింజల(కింగ్‌ సీడ్‌) పై ఇక్కడి శాస్త్రవేత్తలు ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వీటిని సాగుచేస్తూ, ఆహారంగా తీసుకుంటున్నారని గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన రకాలు ఎంపిక చేసే పనిలోపడ్డారు. గింజల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, సాగుకు ప్రణాళికలు వేస్తున్నారు. ”బియ్యం, మొక్కజొన్న, గోధుమల మాదిరిగానే తోటకూర గింజల్లో 14-16% ప్రొటీన్లు ఉంటాయి. నాణ్యమైన లైసిన్‌లు, అమైనోయాసిడ్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, బీటా కెరోటిన్‌కు కొదవలేదు. వీటితో ఐరన్‌, విటమిన్‌-ఏ లోపాన్ని అధిగమించవచ్చు. గింజలను వేయించి పొడిగా మార్చి లడ్డూ, చిక్కీలు, పిండి వంటలతోపాటు బేకరీ ఉత్పత్తులు చేయొచ్చు. త్వరగా జీర్ణం అవుతాయి. మెక్సికన్‌ సంప్రదాయ మిఠాయి అలెగ్రియా ఈ పొడితోనే చేస్తారు” అని సీనియర్‌ శాస్త్రవేత్త మువ్వ రవీంద్రబాబు వివరించారు.

Read More

పొగాకు, మామిడి, కోకో రైతులకు ఊరట

నేటి నుంచి 7 మార్కెట్‌ యార్డుల్లో హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు

ప్రాసెసింగ్‌ మామిడి రకాలకు కిలో రూ.12 – కోకో కిలో ధర రూ.500..- సీఎం సమీక్షలో నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు మార్కెట్‌ యార్డుల ద్వారా హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు. ఇక, ప్రాసెసింగ్‌ రకం మామిడికి కిలో రూ.12 చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహారశుద్ధి పరిశ్రమలు, ట్రేడర్లను ఆదేశించింది. ఇందులో వ్యాపారులు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున భరించాలని నిర్ణయించింది. కోకో రైతులకు కిలోకు రూ.500 దక్కేలా… వ్యాపారులు రూ.450, ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లించనుంది. పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 550 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. *సీఎం సమీక్షలోని ప్రధానాంశాలు*- హెచ్‌డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ సంస్థలు కలిపి 25 మిలియన్‌ కిలోలు, చిన్న కంపెనీలు 20 మిలియన్‌ కిలోల చొప్పున కొనాలి. రెండు, మూడు గ్రేడ్ల రకాలు కొనేలా కంపెనీలతో మాట్లాడాలి. ప్రధాన రకాన్ని క్వింటాలుకు రూ.12 వేలకు తగ్గకుండా సేకరించాలి. మిగతా రెండు రకాలకు పరిస్థితులను బట్టి ధర నిర్ణయిస్తాం. ఈ పొగాకు కొనుగోళ్లతో ప్రభుత్వం పై రూ.300-350 కోట్ల భారం పడనుంది.- ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 5.5 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది. ఇదంతా ప్రాసెసింగ్‌ రకం, ఇప్పటికే ప్రాసెసింగ్‌ సంస్థల వద్ద 43 వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. పార్లే ఆగ్రో, కోకకోలా, పెప్సికో సంస్థల నుంచి ఆర్డర్లు రాకపోవడమే సమస్యకు కారణం, రైతులు, ట్రేడింగ్‌ కంపెనీలు, ప్రాసెసర్లను రిజిస్టర్‌ చేయాలి. రికార్డులు నిర్వహించాలి. కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తే, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా కిలోకు రూ.4 చొప్పున జమ చేస్తుంది. ఇందుకు రూ.100-150 కోట్ల వరకు భరించనుంది.- రైతుల నుంచి ఇప్పటికే 465 టన్నుల కోకో కోనుగోలు చేశారు. ఇంకా 745 టన్నుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి. కనీసం కిలోకు రూ.500 దక్కేలా చేసేందుకు ప్రభుత్వం కిలోకు రూ. 50 చొప్పున చెల్లించనుంది. మొత్తం రూ.10.50 కోట్లు ఖర్చవుతుంది. – రాష్ట్రంలో కోకో పాలసీ తీసుకురావాలి. నాణ్యత కలిగిన ఉత్పత్తులు వచ్చేలా రైతుల్ని చైతన్యపరచాలి. రైతుబజార్లను 116 నుంచి 200కు పెంచాలి. మొబైల్‌ మార్కెట్లు తీసుకురావాలి.- పీఎం కిసాన్‌ డేటాకు అనుగుణంగా అన్నదాతా సుఖీభవ లబ్దిదారుల జాబితా రూపొందించాలి.- పామోలిన్‌ పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలి.- ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే.

Read More

విజయవంతంగా ముగిసిన గ్రామగ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.

Read More

ప్రకృతి వ్యవసాయంతో సమగ్ర పరిష్కారాలు

– వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌

వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమగ్ర పరిష్కారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయటాన్ని అభినందించారు. ఈ సమావేశంలో రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రసాయనాల వాడకంతో ఆహారంలో పోషకాలు తగ్గుతున్నాయని తెలిపారు. భూసారం పెరగడానికి, రైతు శ్రేయస్సుకు ప్రకృతి వ్యవసాయం అవసరమని వివరించారు. దీనిలో సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా నూతక్కి రైతు శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడెం రైతు హేమలత విజయాలను అధికారులు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, రైతు సాధికార సంస్థ సీఈఓ బి. రామారావు పాల్గొన్నారు.

Read More

అమెరికాలోకి ప్రమాదకర ఫంగస్‌.. ఇద్దరు చైనీయుల అరెస్టు

ఆహార ధాన్యాల పంటలకు విస్తృత నష్టం కలిగించడంతోపాటు మనుషుల్లో, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే ఒక ప్రమాదకర ఫంగస్‌ను అమెరికాలోకి ప్రవేశ పెట్టిన ఇద్దరు చైనా జాతీయుల్ని అరెస్టు చేసినట్టు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) సంస్థ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ వెల్లడించారు. ”ఫ్యుసేరియం గ్రామినేరియం” అనే ఈ ఫంగస్‌.. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటల్లో ”తల తెగులు”(హెడ్‌ బ్రైట్‌) అనే వ్యాధిని కలిగిస్తుంది. మొక్కల పూతను ఈ వ్యాధి దెబ్బతీసి దిగుబడిని నాశనం చేస్తుంది. తెగులు సోకిన ఆహారధాన్యాలు సేవించిన మనుషులు, జంతువుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫంగస్‌ను చైనా నుంచి అమెరికాలోకి తీసుకొచ్చిన యున్‌కింగ్‌ జియాన్‌ అనే మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకురాలిని, ఆమె స్నేహితుడు జుయోంగ్‌ లియులను అరెస్టు చేశామని కాష్‌ పటేల్‌ చెప్పారు. అత్యంత ప్రమాదకర వ్యాధికారకమైన ఫంగస్‌పై మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిపేందుకు దాన్ని అమెరికాలోకి తీసుకొచ్చినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి జియాన్‌ విధేయురాలని, ఆమె ఈ వ్యాధి కారకంపై గతంలో చైనాలో కూడా పరిశోధన జరిపేందుకు నిధులు పొందారని పటేల్‌ తెలిపారు. ఫంగస్‌ నమూనాను అమెరికాలోకి తేవడంలో తన ప్రమేయం లేదని తొలుత బుకాయించిన చైనా పరిశోధకురాలు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించారని పటేల్‌ వివరించారు. ఈ చర్యను ఆగ్రో టెర్రరిజంగా అభివర్ణించారు.

Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More