నవంబరు 1 నుండి ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ 20.01 శాతం

తెలంగాణాలో ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్‌పామ్‌ ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్‌ యాస్మిన్‌ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మహేశ్‌, బండి భాస్కర్‌, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్‌ ఆయిల్‌పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్‌ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్‌ ఫెడ్‌ జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత టమాటో వాల్యూచైన్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టి.జి. భరత్‌ కేంద్ర మంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను ఆయన దిల్లీలో కలిసి సమీకృత టమాటో వాల్యూ చైన్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాల పైనా ఆయనతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలోని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పివో)లను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలి. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్ర్‌ప్రైజెన్‌ పథకం కింద స్టార్టప్‌లు, సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు వీలుగా తిరుపతి, బాపట్ల, లాం, పులివెందుల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కల్పించేందుకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి యూనిట్లను బలోపేతం చేయడంలో కేంద్రం సహకరించాలి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు” అని వెల్లడించారు.

Read More

సౌర విద్యుత్‌ రైతుకి ఆదాయం

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29.10 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అవుతోంది. వీటితో పాటు భవిష్యత్తులో ఇచ్చే కనెక్షన్లకు కూడా కలిపి అన్నింటికీ వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి నాలు గేళ్ల పాటు ఇదే పథకం రెండో థ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు, ప్రతి పాదనలు పంపాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు వ్యక్తిగతంగా తమ పొలంలో ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో రాయితీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ఇలా వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఒక విద్యుత్‌ ఫీడర్‌ ప్రాంతంలో పొలాలు ఉండి వాటిలో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు కలిగిన రైతులు సంఘంగా ఏర్పడి ఒకచోట సోలార్‌ ప్లాంటు పెట్టుకుంటే ఆ కరెంటును కొనేందుకు కేంద్రం అనుమతిస్తుంది. ఇలా వచ్చే నాలుగేళ్లలో మొత్తం 4,500 మెగావాట్ల ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటు చేయించేందుకు అనుమతించాలని రాష్ట్రం కోరింది.రూ.15 వేల కోట్ల మిగులు: ప్రస్తుతం ఏటా రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రాయితీగా డిస్కంలకు ఇస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఇది రూ.15 వేల కోట్లను దాటుతుందని అంచనా. పీఎం కుసుమ్‌ కింద వ్యవసాయ బోర్లన్నింటికీ సోలర్‌ ఏర్పాటుచేస్తే ఈ సొమ్ము మిగులుతుందని ప్రభుత్వ అంచనా. పొలాల్లో 24,500 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి డిస్కంకు కరెంటు విక్రయించడం వల్ల ప్రతి రైతుకు కచ్చితమైన ఆదాయం వస్తుందని అంచనా.

Read More

రాయలసీమ పంటలు అంతర్జాతీయ మార్కెట్‌కు

పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి కల్పించేలా రూ.40 వేల కోట్లతో కార్యాచరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్‌ రోడ్ల లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పూర్వోదయ పథకంలో రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. ప్రపంచబ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. ”ప్రపంచంలో డిమాండ్‌ ఉన్న ఉద్యానపంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతున్నాయి. ఉద్యాన రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. రాయలసీమను ఉద్యానపంటల హబ్‌ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్‌, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. రాయలసీమలో 65 రకాల ఉద్యానపంటలు పండుతుంటే 18రకాల పంటలకు మంచి డిమాండ్‌ ఉంది. వీటిపై రైతులను ప్రోత్సహించాలి. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్‌ పంటల కంటే భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాలి” అని సూచించారు.

.*ఇతర దేశాలకు ఉత్పత్తులు* ”50 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటల ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యాన పంటలకు రవాణా, మార్కెటింగ్‌, కోల్డ్‌ చైన్‌ తదితర సదుపాయాలు కల్పించాలి. దుబాయ్‌ లాంటి ప్రాంతాలకు విమానాల్లో పంపితే, అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పంపొచ్చు. రాయలసీమకు మంచి రహదారులు వచ్చాయి. మారుమూల ప్రాంతాలను కలుపుతూ మరికొన్ని రహదారులు రావాలి. దీంతో మార్కెటింగ్‌ మెరుగుపడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలుకుని మార్కెటింగ్‌ వరకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇందులో రాయితీ రూపంలో రూ. 9వేల కోట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అరటి, చీనీ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమాటా, మిరప, నిమ్మ లాంటి పంటలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్‌ వెరైటీలను పండించి వాటికి విలువ జోడించాలి. అప్పుడు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఆక్వారంగంలాగే ఉద్యాన రంగం సైతం భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరుతుంది” అని తెలిపారు. హంద్రీనీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేయడంతో సీమలో ఉద్యానసాగు గతంతో పోల్చుకుంటే సులభతరమైందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. పంటలు చక్కగా పండడంతో రైతులకు ఆదాయం రావడంతో పాటు భూముల ధరలు పెరిగాయని దీనికి తమ అనంతపురం జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన చెప్పారు.

Read More

జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాలని ఆదేశం

తెలంగాణా రాష్ట్రంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ మరియు సీసీఐ అధికారులను వ్యవసాయాశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యకక్షుడు రవీందర్‌తో కూడా మాట్లాడిన మంత్రి, మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.

Read More

గనోడెర్మా పుట్టగొడుగుల సాగు

హరియాణాలోని బడియాల్‌ గ్రామానికి చెందిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా పుట్టగొడుగులను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వీటి పెంపకంపై సోలన్‌లోని మష్రూమ్‌ రీసెర్చ్‌ డైరెక్టరేట్‌లో వీరేంద్ర శిక్షణ పొందారు. గనోడెర్మా పుట్ట గొడుగులకు ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ‘మ్యాజికల్‌ మష్రూమ్‌’ అని పిలుస్తారు. ఈ పుట్టగొడుగు నుంచి తయారైన ఉత్పత్తులు షుగర్‌ నియంత్రణ, క్యాన్సర్‌, అల్సర్లు, చర్మ వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ‘వీఎండబ్ల్యూ న్యూట్రాస్యూటికల్స్‌’ అనే కంపెనీని స్థాపించిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా, శిటాకే, కార్డి సెప్స్‌ వంటి హెర్బల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తన ఉత్పత్తులను 28 దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బజ్వాన్‌ తెలిపారు. కొన్నిదేశాలకు ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైందని.. మరికొన్నింటిలో లైసెన్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గనోడెర్మా పౌడర్‌ను కిలో రూ.21,000లకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సాగులో మంచి ఫలితాలు సాధించిన వీరేంద్రను 2025 ఆగస్టు 21న హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సత్కరించారు. హిస్సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రగతిశీల రైతు అవార్డును పొందారు. అంతేకాదు పుట్టగొడుగుల ప్రచార కమిటీలో వీరేంద్రను సభ్యుడిగా నియమిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి పెంపకంపై లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించింది.

Read More

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

రైతునేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చించారు. రైతువేదికల ద్వారా అనేక జిల్లాల నుండి అధికసంఖ్యలో రైతులు హజరైనారు. ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఎం పథకంలో భాగంగా విత్తనాల సరఫరా మరియు పంట అవశేషాలు కాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌ కొదండరెడ్డి, తెలంగాణ సీడ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More

నిరుద్యోగులకు వ్యవసాయ, అనుబంధ రకాలు దన్నుగా నిలిచాయి

తెలంగాణా రాష్ట్రంలో గత మూడు నెలల్లో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది.. తయారీ, సేవారంగాల్లో ఉపాధి స్వల్పంగా నెమ్మదించినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలు దన్నుగా నిలిచినట్లు కార్మిక బలగం సర్వే (జులై-సెప్టెంబరు, 2025) నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లోనే ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం స్థిరంగా 20.2 శాతంగా (యువతుల్లో 21.7%, యువకుల్లో 19.5%) నమోదైనట్లు వెల్లడించింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం 18.0 శాతం ఉంటే.. పట్టణాల్లో 22.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంటే.. పట్టణ మహిళల్లో ఎక్కువగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నవారు జూన్‌ నాటికి 32.9% మంది ఉంటే.. ప్రస్తుతం 40.5% ఉన్నారు. వర్షాలు పడటం, సాగు విస్తీర్ణం పెరగడంతో మూడు నెలల్లో ఈ రంగంపై ఆధారపడిన గ్రామీణుల శాతం 50.1 (ఏప్రిల్లో) నుంచి 60.1కి (సెప్టెంబరు నాటికి) చేరింది.
పట్టణాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికుల వాటా మూడు నెలల క్రితం 4.1% ఉంటే.. ఇటీవల 6.2 శాతానికి చేరింది.
రాష్ట్రంలో తయారీ, క్వారీ, మైనింగ్‌ రంగాల్లో ఉపాధి తగ్గింది. జూన్‌ నాటికి ఈ రంగాల్లో 29.1% ఉంటే.. సెప్టెంబరు నాటికి 22.2 శాతానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలోనూ స్వల్పంగా 38 నుంచి 37.3 శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సేవా రంగాల్లో ఉపాధి రేటు 20.8 నుంచి 21.3 శాతానికి పెరిగింది.
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే స్వయంఉపాధి పొందుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్‌ నాటికి 39% మంది స్వయంఉపాధి పొందుతుండగా.. సెప్టెంబరు నాటికి అది 40.6 శాతానికి చేరింది. పురుషుల్లో 41.3 నుంచి 43.2 శాతానికి పెరిగింది.

Read More

రైతన్నా మీ కోసం’ తొలి రోజు 4.07 లక్షల కుటుంబాల వద్దకు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ వారోత్సవాల మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా వ్యవసాయ / ఉద్యాన/పట్టు సహాయకుడు, పశుసంవర్ధక/మత్స్య సహాయకుడు, గ్రామ రెవెన్యూ అధికారి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఎనర్జీ అసిస్టెంట్‌, అభ్యుదయ రైతు, సహకార పరపతి సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, మార్కెట్‌ కమిటీల సభ్యులు బృందంగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ‘సీఎం చంద్రబాబు రాసిన లేఖ అందించడంతోపాటు రైతు సంక్షేమంపై కరపత్రాలు, పంచసూత్రాలతో పాటు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ వివరాలు రైతులకు తెలియజేయాలి. ప్రతి ఆర్‌ఎస్‌కే బృందం ఆరు రోజుల్లో 540 కుటుంబాల్ని చేరుకోవాలి. 24 నుంచి 29వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం చేయాలి. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు రైతు కుటుంబాల వారీగా సమాచారం సేకరించాలి. డిసెంబరు 3న సదస్సు నిర్వహించి 2026-27 వార్షిక ప్రణాళిక తయారుచేయాలి’ అని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.58 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం 8,451 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 11. 93 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. 4.07 లక్షల కుటుంబాల వద్దకు బృందాలు వెళ్లాయి. అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో లక్ష్యంలో 50% పైగా సాధించారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో లక్ష్యంలో 30% లోపే ఉంది.

Read More

పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి. గుడిపాడులో గతంలో ఎక్కువ మంది వాణిజ్య పంటలు సాగు చేనే వారు. వస్తే అధిక లాభాలు.. లేదంటే తీవ్ర నష్టాలతో సతమతమయ్యేవారు. రెండు థాబ్దాల క్రితం కొంతమంది రైతులకు వచ్చిన ఆలోచన ప్రస్తుతం ఆ గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. పందిరి విధానంలో కూరగాయలు సాగు చేస్తూ వారి ఆర్థిక స్వయం సమృద్ధికి బాటలు వేసింది. స్థిరమైన ఆదాయం కోసం వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించగా పందిరి విధానంలో కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. దీంతో కొందరు కర్షకులు పందిరి సాగులో ప్రసిద్ధి చెందిన నారాకోడూరు వెళ్లి పరిశీలించారు. అనంతరం పి.గుడిపాడులో తొలుత 20 ఎకరాల్లో కర్ర పందిరితో దొండ, కాకర సాగు చేశారు. వాటిలో లాభాలు రావడంతో మిగిలినవారూ దీనివైపు మొగ్గు చూపారు. 2014లో ప్రభుత్వం రాళ్లతో కూడిన శాశ్వత పందిళ్లకు రాయితీ అందించింది. ప్రస్తుతం గ్రామంలో 550కు పైగా ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా అందులో 480 ఎకరాల్లో పందిరి సాగు చేస్తు న్నారు. దీని ద్వారా దొండ, కాకర, సొర, బీర పండిస్తున్నారు.

Read More