తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29.10 లక్షల వ్యవసాయ బోర్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా అవుతోంది. వీటితో పాటు భవిష్యత్తులో ఇచ్చే కనెక్షన్లకు కూడా కలిపి అన్నింటికీ వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి నాలు గేళ్ల పాటు ఇదే పథకం రెండో థ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు, ప్రతి పాదనలు పంపాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు వ్యక్తిగతంగా తమ పొలంలో ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో రాయితీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. ఇలా వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఒక విద్యుత్‌ ఫీడర్‌ ప్రాంతంలో పొలాలు ఉండి వాటిలో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు కలిగిన రైతులు సంఘంగా ఏర్పడి ఒకచోట సోలార్‌ ప్లాంటు పెట్టుకుంటే ఆ కరెంటును కొనేందుకు కేంద్రం అనుమతిస్తుంది. ఇలా వచ్చే నాలుగేళ్లలో మొత్తం 4,500 మెగావాట్ల ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటు చేయించేందుకు అనుమతించాలని రాష్ట్రం కోరింది.రూ.15 వేల కోట్ల మిగులు: ప్రస్తుతం ఏటా రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రాయితీగా డిస్కంలకు ఇస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఇది రూ.15 వేల కోట్లను దాటుతుందని అంచనా. పీఎం కుసుమ్‌ కింద వ్యవసాయ బోర్లన్నింటికీ సోలర్‌ ఏర్పాటుచేస్తే ఈ సొమ్ము మిగులుతుందని ప్రభుత్వ అంచనా. పొలాల్లో 24,500 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి డిస్కంకు కరెంటు విక్రయించడం వల్ల ప్రతి రైతుకు కచ్చితమైన ఆదాయం వస్తుందని అంచనా.