రైతు భరోసా, పంటల బీమాకు…ఏఐ పరిజ్ఞానం కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ

రైతు భరోసా,, పంటల బీమా పథకాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) పరిజ్ఞానం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఉన్నతాధికారులు.. ఈ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతల పెట్టిన రైతుభరోసా, పంటల బీమా పథకాల అమలులో ఏఐ పరిజ్ఞానం వాడాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి కమతంలో రైతులు వేసిన పంటలను గుర్తించి, దాన్ని ఫొటో తీసి, వ్యవసాయ విస్తరణాధికారులు యాప్‌లో నమోదు చేస్తుండగా ఆ వివరాలను ధ్రువీకరణ చేసుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. శనివారం ఒక ప్రైవేట్‌ సంస్థ ప్రతినిధులు ఒక మండలంలో ఏఐ సహకారంతో పంటల విస్తీర్ణం, సర్వే నంబర్ల వారీగా పంటల సాగు, గత ఐదేళ్ల కాలంలో సాగు వివరాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వివిధ పంటల స్థితి, చీడపీడల తాకిడి వంటి విధానాలను వృద్ధి చేసిన అల్గారిథమ్‌ ప్రదర్శనను సైతం మంత్రి తుమ్మల తిలకించారు. ఇప్పటికే ఇక్రిశాట్‌, ఎన్‌ఆర్‌సీఎస్‌ సంస్థలు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా వానాకాలం పంటల సాగు వివరాలను సేకరిస్తున్నాయి. అన్ని సంస్థల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా 'ఏఐ' సాయంతో సాంకేతికతను రూపొందించాలని కంపెనీలకు ఆయన సూచించారు. కృత్రిమ మేధను వ్యవసాయంతో అనుసంధానించేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ గోపి, జాయింట్‌ సెక్రటరీ ఉదయ్‌కుమార్‌లు గత రెండు నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు. తుది నివేదిక అందగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతితో అన్ని పథకాల అమలులో ఏఐ సాంకేతికతను వినియోగించి రైతులకు వేగవంతమైన సేవలు అందించనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Read More

రైతులు కొత్త వంగడాలు వాడాలి

వ్యవసాయశాఖ డైరెక్టర్‌ దిల్లీరావు

సంప్రదాయంగా వాడుతున్న రకాలను కాకుండా, గత ఐదేళ్లలో కొత్తగా వచ్చిన రకాలను సాగు చేసి, అపరాలు, నూనెగింజల ఉత్పత్తిలో రైతులు స్వయం సమృద్ధి సాధించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ దిల్లీరావు రైతులను కోరారు. అలాగే తెగుళ్లు, పురుగుల నివారణకు నష్ట పరిమితిని గుర్తించి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మందులను సరైన పద్ధతిలో పంటలపై పిచికారీ చేయాలని సూచించారు. రకరకాల మందుల మిశ్రమాన్ని వాడొద్దని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో రాష్ట్ర, జిల్లా వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో రబీ సీజన్‌లో అపరాలు, నూనెగింజల సాగుపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. రైతులు నూతన యాజమాన్య పద్ధతులు అనుసరించేలా అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.

Read More

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష

ఈ రోజు జలసౌధలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వచ్చే 6 నెలలు చాలా క్రియాశీలమని, సత్తుపల్లి ట్రంకు, ట్రంక్‌ కెనాల్‌, యాతలకుంట వరకు పనులు పూర్తి చేసుకొంటే, వచ్చే పంటకాలానికి సాగునీరందించే అవకాశమున్నదని, దానికి సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిందిగా నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేసుకున్న ఈ పథకం, మన శాఖకు అత్యంత ప్రాధాన్యత అని, ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు కానీ, పరిపాలన అనుమతులు ఇచ్చే బాధ్యత తాను తీసుకొంటానని, అధికారులు త్వరితగతిన పనులు ఆరంభించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ప్రతీ 15 రోజులకు సమీక్షించి, తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందచేయాల్సిందిగా సెక్రటరీ  ప్రశాంత్‌ పాటిల్‌ని ఆదేశించారు.
Read More

పత్తి కొనుగోళ్ళ ఏర్పాట్లపై సచివాలయంలో మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు మరియు అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

మార్కెట్‌కు మరియు జిన్నింగ్‌ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, వాట్స్‌ యాప్‌ సేవల (8897281111) ద్వారా వెయిటింగ్‌ టైమ్‌, పేమెంట్‌ స్టేటస్‌, కంప్లయింట్‌ ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలని, జిల్లా అధికారులు, సెక్రటరీలు రైతులకు అందుబాటులో ఉండాలని, అకాల వర్షాలు వస్తున్నందున మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులు, సిసిఐ అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతు తీసుకువచ్చిన పంటలు తడవకుండా కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని, పత్తి కొనుగోళ్ళ విషయములో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో జరిగిన మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు, అధికారులతో సమీక్షలో తెలిపారు.

Read More

దున్నరాజుల విన్యాసాలకు వేళాయె

‘సదర్‌’ అనగానే దున్నరాజుల విన్యాసాలు… యాదవులు తమ జీవనాధారమైన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలతో వేడుక జరిగే ప్రాంతానికి వచ్చి చేసే సందడి.. దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం, దున్నలపై నిలబడి హాకీ కర్రతో చేసే నృత్యాలు ప్రధానాకర్షణ. దీపావళి రెండోరోజున హైదరాబాద్‌లో ‘సదర్‌’ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఐక్యతను చాటుతారు.*మొదలైంది ఇలా…* సుమారు 80 ఏళ్ల క్రితం దివంగత సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్‌ సదర్‌ వేడుకలను ప్రారంభించారు. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఇది మొదలైంది. ఆ తర్వాత మల్లయ్య యాదవ్‌ కుటుంబ సభ్యులు, పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని అనుసరించారో దాన్నే నేటికీ పాటిస్తున్నారు. కాచిగూడ, నింబోలిఅడ్డ, ఖైరతాబాద్‌, సైదాబాద్‌, మారెడ్‌పల్లి, పాతబస్తీలలో కూడా సదర్‌ సందడి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా దున్నరాజు విన్యాసాలు వీక్షించడానికి వస్తుంటారు. పంజాబ్‌, హరియాణ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నరాజులను తీసుకొస్తారు. ఈసారి హరియాణ నుంచి ముర్రా జాతికి చెందిన 3 వేల కిలోల భారీకాయంతో ఉండే ‘ఘోలు-2’ దున్నరాజు వచ్చాడు. ప్రపంచంలో ఎత్తైన దున్నరాజు బాహుబలి (స్కంద సినిమా ఫేం), చేతక్‌ మహారాణా ప్రతాప్‌, వీరా మిల్క్‌ టీత్‌ ఛాంపియన్‌ ఇలా మరెన్నో మేలిమిజాతి దున్నరాజులు కనువిందు చేయనున్నాయి.

Read More

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్ధాస్‌ జానయ్య అధ్యక్షతన రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ఈ సమావేశం జరిగింది. అనేక కీలకంశాలను పాలకమండలిలో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాలకమండలి ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.

  1. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా విత్తన విభాగం ఏర్పాటు చేసి దానికి ఒక సంచాలకుడి స్థాయి అధికారిని నియమించి రాష్ట్రంలో ఒక విత్తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో కనీసం ఐదు నుంచి పది మంది అభ్యుదయ రైతులకు పిజెటిఏయు రూపొందించిన నాణ్యమైన విత్తనాలను ప్రతి ఏటా సరఫరా చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కెవివై) పథకం నుంచి ప్రత్యేక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
  2. గత 13 ఏళ్ల నుండి ఇంచార్జి పాలనతో నడుస్తున్న స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్న అంశానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.
  3. వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల భారీగా పెంచిన ప్రత్యేక కోట సీట్లకు.. భారీగా తగ్గించిన ఫీజులకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
  4. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాధిపతుల పదవికాలంను మూడేళ్లుగా నిర్ణయిస్తూ… ప్రతీ మూడేళ్లకోసారి రొటేషన్‌ పద్ధతిన, సీనియార్టీ ఆధారంగా విభాగాధిపతులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఒకసారి విభాగాధిపతిగా నియామకం అయితే అతను లేదా ఆమె పదవి విరమణ పొందే వరకు ఆ పదవిలో కొనసాగే వారు. దీనివల్ల ఇతర సీనియర్లకు అవకాశం కలగకుండా పోతుందని పాలకమండలి భావించి దేశంలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలలో మాదిరిగా ఈ రొటేషన్‌ పద్ధతిలో విభాగ అధిపతులను నియమించాలని నిర్ణయించింది.
  5. వివిధ కళాశాలలో అనుబంధ పీఠాధిపతుల (అసోసియేట్‌ డీన్‌) నియామకం, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల అనుబంధ పరిశోధనా సంచాలకుల (అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌) సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని మరియు వారి పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయిస్తూ.. అలాగే మరో రెండేళ్ల వరకు పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా పాలకమండలి ఈ మేరకు నిర్ణయించింది.
  6. ఇటీవల యు.జి.సి ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ మరియు అంతర్జాతీయ అనుభవం కలిగిన ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులను ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌గా ఏడాది కాలపరిమితితో మూడేళ్ల వరకు నియమించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పేరెన్నిక కలిగిన నిపుణుల యొక్క నైపుణ్యతను ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
  7. గత 7, 8 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ బిల్లుల చెల్లింపులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు నాలుగు దపాలుగా విడుదల చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
  8. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గత ఐదేళ్ల క్రితం నుంచి నిలిపివేసిన యూనివర్సిటీ ఆరోగ్య కేంద్ర సేవలను పునరుద్ధరిస్తూ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య ఇటీవల తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది.
  9. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డిసెంబర్‌లో విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.
Read More

పోలవరం ప్రాజెక్టు గురించి విదేశీ బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలపై నవంబరు 6 నుంచి నాలుగు రోజుల పాటు మేథోమథనం చేయనున్నారు. ప్రాజెక్టును సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్ళను పరిష్కరించడంపై నిపుణులు చర్చించనున్నారు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్‌ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్‌ బి. పాల్‌, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌లతో కూడిన విదేశీ బృందంతో సంబంధిత అధికారులు, నిపుణులు నవంబరు 6 నుంచి 9వ తేదీ వరకు మేథోమధనం చేయనున్నారు.

Read More

ఆయిల్‌ పామ్‌కు రూ. 20 వేల ధర కల్పించేందుకు కృషి-మంత్రి తుమ్మల

ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్నుకు గరిష్టంగా రూ. 20 వేలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రిని త్వరలో కలవనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన మూడు రోజుల మలేసియా పర్యటనలో అక్కడి ఆయిల్‌పాం సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. పొట్టిరకం, అధిక దిగుబడిని అందించే ఆయిల్‌పాం మొక్కలను తెలంగాణకు ఇవ్వాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అక్కడ నర్సరీల్లోనే నిర్దేశిత రకానికి చెందని (ఆఫ్‌ టైప్‌) మొక్కల గుర్తింపు, గ్యానోడెర్మా వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ఈ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు.

Read More

రూ. 300 కోట్లతో ‘3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌’ సంస్థ విస్తరణ

తూర్పుగోదావరి జిల్లాలో ‘3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌’ ప్రాసెసింగ్‌ సంస్థ రూ. 300 కోట్లతో తమ వ్యాపారాన్ని విస్తరించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. ఆ సంస్థ ఎండీ సంజయ్‌ గోయెంక, డైరెక్టర్‌ ఆశిశ్‌ గోయెంక ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్షా సమావేశం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష మరియు ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్‌ టెక్నాలజీ సెంటర్‌లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కుసుమ మరియు అవిసెలు పంటలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలు 150 మంది పాల్గొని వివిధ పరిశోధన అంశాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు.
ఈ కార్యక్రమంను ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మరియు జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంకు డా. టి.ఆర్‌. శర్మ (ICAR-DDG, న్యూ ఢిల్లీ) అధ్యక్షత వహించి ప్రస్తుతం ఇండియా 1.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలని దిగుబడి చేసుకుంటున్నదని, దీన్ని తగ్గించడానికి జాతీయ నూనె గింజల మిషన్‌ని భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు కావున మనం చేసే పరిశోధనలు నూనె గింజ పంటల సాగును పెంచి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ముళ్ళు లేని కుసుమ రకాలను వృద్ధి చేయాలన్నారు. అన్ని పరిశోధన సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం వల్ల కుసుమ మరియు అవిసెలలో చాలా నూతన రకాలను వృద్ధి చేయడం జరిగిందని శర్మ వివరించారు.
డా. సంజీవ్‌ గుప్త (ICAR-DDG, న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో కుసుమ మరియు అవిసె పంటలకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా ఈ నూనె గింజలలో లైనోలేనిక్‌ ఆసిడ్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు. కాబట్టి ఈ పంటల సాగు ఇంకా పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. డా.మాథూర్‌ (డైరెక్టర్‌, IIOR) గత సంవత్సరం కుసుమ మరియు అవిసెలలో చేపట్టిన పరిశోదన ఫలితాలను క్లుప్తంగా వివరించారు. డా. జెల్లా సత్యనారాయణ (డీన్‌ అఫ్‌ అగ్రికల్చర్‌, PJTAU) మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా వరకు కుసుమ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం చీడ పీడలను తట్టుకునే రకాలను వృద్ధి చేయడమే కాకుండా కుసుమ నూనె కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ మరియు అవిసెలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.

Read More