పంట పండించిన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశం
తెలంగాణలో పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి. తప్పనిసరిగా వారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ధ్రువీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఇ పోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలతో ధ్రువీకరణ అనంతరమే రైతుల నుంచి పంట తీసుకుంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెసలు, కందులు, జొన్నలు, సోయా, పొద్దుతిరుగుడు వంటి పంటలకు సరైన ధరలు రానప్పుడు ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా వాటిని మద్దతు ధరకు కొంటోంది. ఈ కేంద్రాలకు దళారుల బెడద ఎక్కువైంది. రైతుల వద్ద తక్కువ ధరకు పంట కొన్న వ్యాపారులు.. కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆధార్ కార్డుల నమోదు ఆధారిత కొనుగోళ్ల విధానం చేపట్టాలని, దీనికోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల లేఖ రాసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ కొత్త విధానంపై ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇపోస్ యంత్రం ఏర్పాటు చేసి వాటిలో రైతులందరి భూముల సర్వే నంబర్లు, పంటల సమాచారం (వ్యవసాయశాఖ పంట నమోదు) ద్వారా అనుసంధానం చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులతో ఆయా కేంద్రాలకు వచ్చినప్పుడు ముందుగా ఆధార్ కార్డుతో ఇపోస్ నమోదు చేసుకోవాలి. అందులో రైతు సాగు చేసిన పంట వివరాలను, తెచ్చిన పంట సరిచూసి.. తర్వాత కొనుగోళ్లకు అనుమతిస్తారు. ఇపోస్ యంత్రంలో రైతు భూమి, పంటల వివరాలున్నా.. ఆధార్ కార్డు లేకపోయినా, పేరు, ఇతర వివరాల్లో తప్పులున్నా.. జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకొని ఆ పత్రాన్ని తెచ్చి సమర్పిస్తే పంటను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ధాన్యం, పత్తేతర కొనుగోలు కేంద్రాలకే పరిమితం చేశారు. త్వరలో పౌరసరఫరాల శాఖ, సీసీఐల ద్వారా జరిగే వరి, పత్తి కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త విధానం అమలుకు మార్క్ఫెడ్ సిద్ధమైంది. తమ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాలు, సహకార సంఘాల్లో వెంటనే ఇపోస్ యంత్రాలను కొనుగోలు చేయాలని సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో త్వరలో పెసలు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 58,728 ఎకరాల్లో పెసర పంట వేయగా.. 16,326 క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేస్తున్నారు. దీంతో ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.











