ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

4 May, 2026
