35 వేల మంది డ్వాక్రా మహిళలకు వెదురు సాగుతో జీవనోపాధి

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More