యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు అనుసరించాలని ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు నానోయూరియా, పచ్చిరొట్ట ఎరువులు, జీవన, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. సోమవారం వర్సిటీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “గల్ఫ్ యుద్ధ ప్రభావం వలన ఒకవేళ యూరియా సరఫరా తగ్గినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. నానోయూరియా మార్కెట్లో కావలసినంత పరిమాణంలో అందుబాటులో ఉంది. నానోయూరియా మొక్కలకు కావాల్సిన నత్రజని అందించటంతో పాటు దిగుబడులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ పొందిన జీవన ఎరువులు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాలను రైతాంగం సేకరించి తొలకరి వర్షాలు రాగానే పొలాల్లో చల్లి, విత్తిన 40 రోజుల్లో ఆయా పంటలను పొలంలో కలియదున్నితే సేంద్రియ కర్బనం పెరిగి నేల ఆరోగ్యం బాగుంటుంది” అని జానయ్య తెలిపారు.

26 May, 2026
