సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్పీకే) విధానంలో పంటలు సాగు చేయాలనే ఔత్సాహికులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయనున్నట్లు సేవ్‌ సంస్థ ప్రతినిధి విజయరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి నలుగురు ప్రతి నిధులు సెప్టెంబరు 2న హైదరాబాద్‌ దోమలగూడలోని శ్రీరామచంద్రమిషన్‌లో ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు, యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు వంటి వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు.